Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఒప్పందంపై రాజీపడాలని ఐరోపా సమాఖ్య నేతలకు బ్రిటన్ నూతన ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై నేతలు తమకున్న వ్యతిరేకతలను వదిలితేనే చర్చలు జరుగుతాయని బ్రిటన్ ప్రధాని సంకేతాలిచ్చారు. లేదంటే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. బ్రెగ్జిట్పై తిరిగి చర్చలు జరగాలంటే ఐరోపా సమాఖ్య(ఈయూ) నేతలు ఈ ఒప్పందంపై ఉన్న వ్యతిరేకతను పక్కనపెట్టాలని జాన్సన్ కోరారు.
బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే ప్రతిపాదించిన ఒప్పందంలో కొన్ని మార్పులు చేయడానికి జాన్సన్ ఆలోచిస్తున్నప్పటికీ... అవసరమైతే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. బ్రెగ్జిట్ విషయమై ఐరోపా సమాఖ్య నేతలతో బోరిస్ జరిపే చర్చలపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే నేతలు రాజీపడేంత వరకు చర్చలు జరపడానికి బ్రిటీష్ ప్రధాని సుముఖంగా లేరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
స్కాట్లాండ్లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్కాట్లాండ్లో పర్యటించినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. స్కాట్లాండ్ మంత్రి నికోలా స్టర్జియన్తో జాన్సన్ భేటీ అయ్యారని తెలిపింది. ఇరుదేశాధినేతలు బ్రెగ్జిట్ అంశంపై సుదీర్ఘ మంతనాలు జరిపారని తెలిపింది. బ్రెగ్జిట్ ఒప్పందానికి జాన్సన్ అడ్డుపడుతున్నారని నికోలా అనేక సందర్భాల్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో నికోలాతో బ్రిటన్ ప్రధాని సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.