Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 34మంది మృతి, 17 మందికి గాయాలు
కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం ఉదయం అఫ్ఘనిస్థాన్ హెరాత్-కాందహార్ హైవే రోడ్డు పక్కన అమర్చి ఉన్న ల్యాండ్మైన్ పేలింది. ఈ దాడిలో 34 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్నదని అధికారులు ధ్రువీకరించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. హెరా ప్రావిన్స్ అధికార ప్రతినిధి ముహిబుల్లా ముహిబ్ తెలిపిన వివరాల ప్రకారం...హెరాత్-కాందహార్ హైవేపై ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు పక్కన అమర్చి ఉన్న బాంబును తాకింది. దీంతో, భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది చనిపోగా, మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతాదళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. పేలుడు భారీగా జరగటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. దాడి తరువాత భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తు న్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. కాగా, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. గతంలో జరిగిన దాడులకు ఐఎస్, తాలిబన్లు బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించుకున్నాయి. ఈ దాడి కూడా మిలిటెంట్ల పనేనని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.