Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయోగాలకు జపాన్ ఆమోదముద్ర
టోక్యో: జంతువుల్లో మానవ అవయవాల పెరుగుదలకు అవసరమైన ప్రయోగపరీక్షల నిర్వహణ కోసం జపాన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇటువంటి ప్రయోగపరీక్షలు జరగటం దేశంలో ఇదే మొదటిసారి కావటం విశేషం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ప్రయోగాలలో మానవుల నుంచి సేకరించిన జన్యుకణాలతో జంతువుల పిండాలను సమ్మిళితం చేయటం ద్వారా మానవ శరీరానికి సంబంధించిన ఏ అవయవమైనా జంతువుల్లో పెరిగేలా చేస్తారని తెలుస్తోంది. అత్యంత వివాదాస్పదమైన ఈ ప్రయోగపరీక్షల్లో ఆశించిన ఫలితాల కోసం పరిశోధకులు అత్యంత జాగ్రత్తగా, ఓపిగ్గా దీర్ఘకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే మానవులకు అవసరమైన శరీరావయవాలను జంతువుల్లో అభివృద్ధి చేసి వారికి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన జన్యుశాస్త్ర పరిశోధకుడు ప్రొ.హిరోమిట్సు నకౌచీ నేతృత్వంలోని జన్యు శాస్త్రవేత్తలు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిన జపాన్ ప్రభుత్వం మానవ కణాలను జంతువుల్లో అమర్చే నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. గతంలో మానవకణాలను ఇంప్లాంట్ చేసిన 14 రోజుల తరువాత జంతువుల పిండాలను విచ్ఛిన్నం చేయాల్సి వచ్చేది. మానవ కణాలను ప్రవేశపెట్టిన పిండాలు పెరుగుదలకు అవసరమైన వాతావరణం కోసం వాటిని జంతువుల గర్భాశయాలల్లో వుంచటాన్ని నిరోధించింది. అయితే గత మార్చిలో ఈ నిబంధనలను రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రయోగ ప్రాజెక్టులకు వేర్వేరుగా అనుమతులు పొందేందుకు శాస్త్రవేత్తలకు అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టు ఫలప్రదమయ్యేందుకు దాదాపు పదేండ్లు పట్టవచ్చని, ప్రస్తుతం ఈ ప్రయోగాలను ప్రారంభించేందుకు తాము సిద్ధమవుతున్నామని నకౌచీ మీడియాకు చెప్పారు.