Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యుబాకి ప్రపంచం మద్దతివ్వాలి:చేగువేరా కుమార్తె అలైడా చేగువేరా
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
అగ్రరాజ్యం అమెరికా ఆగడాలను అడ్డుకునేందుకు యావత్ ప్రపంచం మద్దతు తమకు కావాలని క్యుబా విప్లవకారుడు ఎర్నొస్టో చేగువేరా కుమార్తె, సామాజిక కార్యకర్త అలైడా చేగువేరా విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలు తమకు సంఘీభావం తెలపాలని ఆమె కోరారు. చిన్న దేశమైనా తమను అమెరికా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం ఒత్తిళ్లకు లొంగకుండా క్యుబా ప్రజానీకమంతా సమైక్యంగా పోరాడుతున్నామని వివరించారు. భారత్, నేపాల్ తదితర దక్షిణాసియా దేశాల్లో పర్యటించేందుకు వచ్చిన ఆమె శనివారం ఢిల్లీలోని క్యుబా రాయబార కార్యాలయంలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ దేశంపై అమెరికా ఆర్థిక బంధనాలు విధించి తమ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. క్యుబా వ్యాపార ఒప్పందాలు చేసుకునే ఏ దేశంతోనైనా అమెరికా తన వాణిజ్య సంబంధాలను తొలగించుకుంటుందని వివరించారు. అమెరికా ఏదైనా దేశంతో వ్యాపార ఒప్పందాలు చేసుకునే సమయంలో కూడా క్యుబాతో ఎటువంటి సంబంధాలు ఉండొద్దని నిబంధనలు పెడుతుందని చెప్పారు. అందువల్ల తమతో ఏ దేశం కూడా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం లేదని తెలిపారు. అయినా తమకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నదనీ.. అందుకే తాము పోరాడుతున్నామని వివరించారు. ప్రపంచం ముందు తమను ఒంటరి చేసేందుకు అమెరికా వేస్తున్న ఎత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికా ఈ విధంగా తమను ఇబ్బందులకు గురి చేయడమేంటని ప్రశ్నించారు. పాల ఉత్పత్తిలో అమెరికా ఎంతో పేరు ఉన్నదనీ.. కానీ 90 మైళ్ళ దూరంలో ఉన్న తమకు వాటిని ఎగుమతి చేయడం లేదని అన్నారు. తాము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కరుణించడం లేదన్నారు. కేవలం రాజకీయకక్షతోనే తమకు పాల ఉత్పత్తులను పంపించడం లేదన్నారు. దీంతో తాము ఎంతో దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుంచి తమ దేశంలోని చిన్నారులు తాగేందుకు పాలను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం ఎంతో వ్యయంతో కూడిన వ్యవహారమని వాపోయారు. లాటిన్ అమెరికా దేశాల్లో సోషలిజం కాపాడేందుకు క్యుబా తన పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. భారత్, నేపాల్ తదితర దక్షిణాసియా దేశాలు తమ దేశంలో వైద్య రంగంలో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న ఇతర దేశాల మందుల కంటే తాము చవక, నాణ్యమైన వాటిని అందించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో క్యుబా ఎంతగానో అభివృద్ధి చెందినట్టు చెప్పారు. ఇప్పటికీ తమ దేశంలో వైద్య, విద్య ప్రభుత్వం నియంత్రణలోనే నడపబడుతాయని వివరించారు. ప్రయివేటు శక్తులను ఏ విధంగా ప్రోత్సహించేది లేదని చెప్పారు.
క్యుబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో మరణం తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితి ఏంటని నవ తెలంగాణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ.... కన్నీటి పర్యంతం అయ్యారు. తన తండ్రి చేగువేరాతో పని చేసిన ఫిడేల్ క్యాస్ట్రో కూడా తనకు పితృసమానులని ఆమె వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న సమయంలో కూడా ఫిడేల్ క్యాస్ట్రో తమ దేశంలో సమర్థవంతమైన పాలన అందించారని చెప్పారు. ఆయన ఆదర్శవంతమైన పాలనతోనే తమ దేశంలో ఇంకా సోషలిజం ఇంకా కొనసాగుతున్నదని గుర్తు చేశారు. క్యుబాలో అద్బుత రాజకీయ వ్యవస్థను రూపొందించిన వ్యక్తి ఫిడేల్ క్యాస్ట్రో అని అన్నారు. వ్యవస్థలను ఆయన నిర్మించిన తీరు ఎప్పుడూ తమకు ఆచరణీయమని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్, అనువాదకురాలు సోనియా గుప్తా తదితరులు పాల్గొన్నారు.