Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు ట్యాంక్ పేలుడుకు 60 మంది మృతి
- 70 మందికి గాయాలు
మోరోగోరో : టాంజానియాలో ఒక చమురు ట్యాంకర్ పేలిన దుర్ఘటనలో 60 మందికి పైగా మృతి చెందారు. మరో 70 మందికి గాయాలయ్యాయి. టాంజానియా రాజధాని రాజధాని డార్ ఎస్ సలామ్కు పశ్చిమంగా 200 కిలోమీటర్ల దూరుంలో ఉన్న మోరోగోరో పట్టణ శివార్లలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ట్యాంకర్ నుంచి స్థానికులు పెట్రోలు తీసుకెళ్ళేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా పేలుళ్ళు సంభవించాయని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ట్విట్టర్లో పోస్టయిన వీడియోలోని దృశ్యాలను పరిశీలిస్తే ఓ చమురు ట్యాంకర్ బోల్తా పడటంతో అందులోని ఆయిల్ రోడ్డుపై ప్రవహించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చమురు నింపుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఒక వ్యక్తి సిగరెట్ అంటించడంతో ఒక్కసారిగా మంటలు రేగి ట్యాంకర్లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు మోరోగోరో గవర్నర్ స్టీఫెన్ కెబ్యూ తెలిపారు. గాయపడిన 70 మందికి ఇదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ దుర్ఘటనలో ఎంత మంది మృతి చెందారో కచ్చితంగా తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోరోగోరో పోలీస్ కమిషనర్ తెలిపారు.
పలు మృతదేహాలను ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఇంకా కొన్ని సంఘటనా స్థలం వద్దే ఉన్నాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కేవలం చమురు చోరీ చేయడానికి వచ్చిన వారే కాకుండా, ఇతరులు కూడా మరణించారని, ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు.
తూర్పు ఆఫ్రికాలో ఇటువంటి ప్రమాదాలు సహజంగానే జరుగుతుంటాయి. సామర్థ్యాన్ని మించి చమురును ట్యాంకర్లలో తరలించడం వల్ల అవి పేలి పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. గత ఏడాది అక్టోబరులో కాంగో ప్రాంతంలో జరిగిన ఒక ప్రమాదంలో 50 మంది, మేలో నైజర్ వద్ద జరిగిన ఒక ప్రమాదంలో 58 మంది, గత నెలలో నైజీరియాలో జరిగిన మరో ప్రమాదంలో 50 మంది మృతి చెందారు.