Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: జమ్మూకాశ్మీర్ వివాదంలో తలదూర్చనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వివాదం పరిష్కారం కోసం అవసరమైతే భారత్, పాక్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ తాజాగా ఈ ప్రతిపాదనను నుంచి వెనక్కి తగ్గారు. కాగా, మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ప్రతిపాదన భారత్, పాకిస్థాన్ల అంగీకారంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ గతంలో స్పష్టం చేశారు. రెండు దేశాలు ఒప్పుకున్నట్టయితే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమే అన్నారు. అయితే, అందుకు భారత్ నిరాకరించడంతో మధ్యవర్తిత్వం ఆఫర్ ఇంకెప్పుడూ చర్చకు రాదని ఆయన స్పష్టంగా చెప్పారు. 'కాశ్మీర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేయకూడదనేది అమెరికా దశాబ్దాల నాటి విధానం. అయితే, ఈ సమస్యను భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాత్రం రెండు దేశాలను ప్రోత్సహిస్తూ వస్తోంది' అని హర్షవర్ధన్ శ్రింగ్లా ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అమెరికా పర్యటనకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్తో గతనెల 22న ట్రంప్ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని భారత ప్రధాని తనను కోరినట్టు ఆ సమయంలో ట్రంప్ చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు భారత్లో వివాదానికి తెరలేపాయి. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను కొట్టిపారేసింది. మోడీ, ట్రంప్ మధ్య కాశ్మీర్ ప్రస్తావనే రాలేదని తేల్చి చెప్పింది.
ఇది జరిగిన కొద్ది రోజులకు ట్రంప్ మాట్లాడుతూ.. 'కాశ్మీర్ సమస్య భారత్, పాక్ ద్వైపాకిక్ష అంశమే. అయితే ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కోసం మా సాయం కోరితే మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం' అని అన్నారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. 'కాశ్మీర్పై ఎలాంటి చర్చలైనా అవి కేవలం పాకిస్థాన్తో మాత్రమే.. అది కూడా ద్వైపాక్షికంగానే' అని స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై అమెరికా స్పందిస్తూ.. అది పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనని పేర్కొంది.
మాకు అండగా నిలిచే అవకాశం లేదు :పాక్ విదేశాంగ మంత్రి
కాశ్మీర్ వివాదంపై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పాక్ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కాశ్మీర్ అంశంలో భారత్పై పాక్ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సిద్ధంగా లేదని ఘాటుగా స్పష్టం చేశారు. కాశ్మీర్ పై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ప్రపంచ దేశాల మద్దతుకు ఇమ్రాన్ ప్రయత్నాలు
జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ప్రపంచదేశాల మద్దతు కూడబెట్టుకోవాలని పాక్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు దేశాధినేతలతో చర్చలు జరిపిన ఇమ్రాన్ తాజాగా ఇండోనేషియా అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపారు. 370 అధికరణ రద్దుతో అమాయకులైన కాశ్మీర్ ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని జోకో విడోడోకు ఇమ్రాన్ వివరించారు. కాశ్మీర్ విషయంలో తమకు మద్దతుగా నిలవాలని కోరినట్టు సమాచారం.ఇదే అంశంపై ఇంగ్లాండ్, మలేషియా ప్రధానులతో పాటు టర్కీ అధ్యక్షుడు, సౌదీ యువరాజుతో ఇమ్రాన్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఆర్టికల్ 370 రద్దుపై అభ్యంతరాలు లేవనెత్తిన పాకిస్థాన్ సర్కార్.. భారత్తో దౌత్య, వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకునే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్లోని భారత హైకమిషనర్ అజరు బిసారియాను బహిష్కరించింది. సంఝౌతా ఎక్స్ ప్రెస్ రద్దుతో పాటు భారత్కు పాక్ హైకమిషనర్ను నియమించొద్దని నిర్ణయించుకుంది.