Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్: తమ దేశానికి చెందిన చమురు రవాణా నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవాలని జిబ్రాల్టర్ను కోరిన అమెరికా తీరుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు ఆరువారాల దిగ్బంధం అనంతరం ఈ నౌక సోమవారం జిబ్రాల్టర్ రేవు నుండి బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ నౌకను అప్పగించాలంటూ అమెరికా జిబ్రాల్టర్ అధికారులపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని తాము హెచ్చరించినట్టు ఇరాన్ వెల్లడించింది. ఐరోపా కూటమి విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా సిరియాకు చమురు సరఫరా చేస్తున్నదన్న అనుమానంతో అమెరికా మిత్ర దేశం బ్రిటన్కు చెందిన రాయల్ మెరైన్స్ ఈ అద్రన్ దర్యా (గ్రేస్-1) నౌకను జులై 4న జిబ్రాల్టర్ రేవులో దిగ్బంధించిన విషయం తెలిసిందే. రెండు వారాల తర్వాత ఇందుకు ప్రతీకార చర్యగా బ్రిటన్కు చెందిన ఒక నౌకను హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ దళాలు దిగ్బంధం చేశాయి. ఈయూ ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ చమురు నౌక సిరాయకు చమురును సరఫరా చేస్తోందని రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, తక్షణమే నౌకను విడుదల చేయాలని జిబ్రాల్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చిన సిరియాకు చమురు సరఫరా చేస్తున్న ఈ నౌకను నిర్బంధంలోనే ఉంచాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని జిబ్రాల్టర్ ప్రభుత్వం నిరాకరించింది. ఈ ఆంక్షలు ఐరోపాలో చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. దీనితో కోర్టు ఆదేశాల మేరకు గ్రేస్-1 నౌక ఆదివారం సాయంత్రం జిబ్రాల్టర్ నుంచి గ్రీస్లోని కలమట రేవుకు బయల్దేరినట్టు అధికారులు తెలిపారు. తమ నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలోని స్విస్ రాయబార కార్యాలయం ద్వారా ట్రంప్ సర్కార్ను తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిపింది. మరోసారి ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం చేసినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధికారులను హెచ్చరించినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ మొసావీ తెలిపారు.