Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ఇరు పార్టీల సన్నాహాలు
- చర్చలకు బ్లూ అండ్ వైట్ పార్టీ సుముఖత
జెరూసలేం: ఇజ్రాయిల్ పార్లమెంట్కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. బుధవారం దాదాపు 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ప్రధాని పదవికి పోటీ పడుతున్న నెతన్యాహూ, ఆయన ప్రత్యర్థి బెన్నీ గాంట్జ్ మధ్య 'టై' దిశగా ఫలితాలు సాగుతున్నట్టు ఇజ్రాయిల్ మీడియా వెల్లడించింది. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ, గాంట్జ్ నేతృత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీలకు మొత్తం 120 స్థానాలున్న పార్లమెంట్లో చెరో 32 స్థానాలు లభించాయి. ఎన్నికల సంఘం ఫలితాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ, మీడియా మాత్రం ఎన్నికల కమిటీ వర్గాలను ఉటంకిస్తూ తాజా సమాచారాన్ని అందిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమౌతున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల మద్దతు కోసం ఇరు పార్టీలూ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో 9 స్థానాలను దక్కించుకున్న నేషనలిస్ట్ ఇజ్రాయిల్ బీటెన్యూ పార్టీ నేత, మాజీ రక్షణ మంత్రి అవిగ్డర్ లిబర్మన్ కింగ్మేకర్గా మారే అవకాశాలున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అరబ్ జాయింట్ లిస్ట్ అలయెన్స్ 12 స్థానాలతో పార్లమెంట్లో మూడో ప్రధాన శక్తిగా అవతరించింది. ఈ కూటమి గాంట్జ్ను సమర్ధించాలని నిర్ణయించినట్టయితే నెతన్యాహూ ఆశలకు గండి పడటం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ కూటమి ఇజ్రాయిల్ ప్రధానిగా ఎవరినీ సమర్ధించటం లేదన్న విషయం తెలిసిందే.
ఎవరితోనైనా చర్చలకు సిద్ధం : బ్లూ అండ్ వైట్ పార్టీ
జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్న ఎవరితోనైనా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్లూ అండ్ వైట్ పార్టీ నేత గాంట్జ్ చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికే తాను పలు పార్టీల నేతలతో చర్చించానని చెప్పారు. మాజీ రక్షణ మంత్రి లిబర్మన్తో కూడా తాను చర్చిస్తానన్నారు. అయితే, లికుడ్ పార్టీ, బ్లూ అండ్ వైట్ పార్టీలతో విస్తృత సంకీర్ణ కూటమి ఏర్పడాలని, ప్రస్తుత ప్రధాని నెత న్యాహూ దానికి నేతృత్వం వహించటం ఒక్కటే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకున్న ఏకైక మార్గమని లిబర్మన్ చెబు తున్నారు. కాగా పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత లికుడ్ పార్టీకి 57, బ్లూ అండ్ వైట్ పార్టీకి 58కి పైగా స్థానాలు లభించే అవకాశాలున్నాయని, అయితే ఇరుపక్షాలూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజార్టీ సాధించే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.