Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ హక్కుల కార్యకర్త గులాలై ఇస్మాయిల్ అమెరికాకు పారిపోయినట్టు డాన్ మీడియా సంస్థ శుక్రవారం ప్రకటించింది. అంతేగాకుండా, యూఎస్లో ఆశ్రయం కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని తెలిపింది. న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థలో ఆమెకు సంబంధించిన వివరాలు ప్రచురితమైనట్టు పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గులాలై ఇస్మాయిల్ గళమెత్తారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగువవేశారు. ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టులో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. గులాలై ఇస్మాయిల్ పేరును ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్లో పొందుపరిచేందుకు అనుమతిని నిరాకరించింది. అయితే, ఆమె పాస్పోర్టును స్వాధీనం చేసుకునే అధికారం పాక్ ప్రభుత్వానికి ఉన్నదని పేర్కొంది. ఐఎస్ఎస్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని పాక్ విదేశాంగ శాఖను మే నెలలో సూచించింది. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం గులాలై ఇస్మాయిల్ జాడ తెలియరాలేదు. ఆమె కోసం ప్రత్యేక బృందాలు పాక్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఆమె బంధువులను, సన్నిహితులను విచారించారు. ఆమె నివాసముంటున్న అపార్ట్మెంట్లోనూ సోదాలు నిర్వహించారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన కథనం ప్రకారం ఆమె అమెరికాలో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్టు డాన్ మీడియా సంస్థ పేర్కొన్నది. పాక్లో తనకు ప్రాణ హాని ఉందని ఆమె న్యూయార్క్ టైమ్స్తో చెప్పారు. ఈ కారణంతోనే అమెరికాను ఆశ్రయించినట్టు తెలిపారు. పాక్లో నివాసముంటున్న తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. వాయిసెస్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ సంస్థ ద్వారా అమెరికాలో ఆశ్రయం పొందేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.