Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్యూనిస్: ట్యునీషియాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కైస్ సయీద్ 72.71 శాతం ఓట్లతో ఘన విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. సయీద్కు ప్రత్యర్థిగా పోటీ చేసిన ట్యునీషియా పార్టీ అధినేత, మీడియా మొఘల్ నబిల్ కరౌఇకి కేవలం 27.29 శాతం ఓట్లు మాత్రమే లభించినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 70,74,566 మంది ఓటర్లకు గాను 38,92,085 మంది (55 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ఛైర్మెన్ బిల్ బఫూన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 55,348 ఓట్లు చెల్లలేదని, మరో 15,912 ఖాళీ బ్యాలెట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. తనకు లభించిన విజయంపై హర్షం వ్యక్తం చేసిన సయీద్ తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడుతూ ట్యునీషియన్ ప్రజలు విప్లవానికి సరికొత్త నిర్వచనం చెప్పటం ద్వారా ప్రపంచానికి గొప్ప గుణపాఠం నేర్పారని అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను గౌరవిస్తూ తాము సరికొత్త ట్యునీషియా నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. తమ రాజ్యాంగ పరిధిలో పాలస్తీనా వంటి సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని, తన పాలనలో భారీయెత్తున వ్యవస్థాగత మార్పులు చేపడతామని, అధికార వికేంద్రీకరణతోపాటు రాజ్యాంగ సంస్కరణలు కూడా చేపడతామని ఆయన వివరించారు.