Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: కుర్దు తిరుగుబాటు దారుల లక్ష్యంగా టర్కీ చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఎర్డోగన్ సర్కారు అంగీకరించింది. అయితే, ఓ పక్క కాల్పుల విరమణకు అంగీకరించి మరోపక్క కుర్దు తిరుగుబాటు దారులపై టర్కీ బలగాలు కాల్పులకు తెగబడటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. టర్కీ చర్యలపై అగ్రరాజ్యం మండిపడింది. తాజా ఒప్పందం ప్రకారం...సిరియా నుంచి అమెరికా సంకీర్ణదళాలు వైదొలిగిన తర్వాత సిరియా కుర్దు తిరుగుబాటుదారులే లక్ష్యంగా చేపట్టిన సైనిక చర్యను 5 రోజుల పాటు నిలిపివేసేందుకు టర్కీ అంగీకరించింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్పెన్స్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్తో అంకారాలో జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది. దాదాపు 4 గంటలు జరిగిన చర్చల్లో.. 5 రోజులు కాల్పుల విరమణ పాటించేందుకు ఎర్డోగన్ అంగీకరించారు. ఈ లోపు టర్కీ సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల పరిధిని భద్రతా జోన్గా పరిగణిస్తూ సిరియా కుర్దు దళాలు.. ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే, సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత టర్కీ, కుర్దు దళాలపై భీకర దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తమ మిత్రుల కోసం రంగంలోకి దిగిన అమెరికా.. కాల్పుల విరమణకు టర్కీని ఒప్పించింది. తాము సైనిక చర్యను ఐదు రోజులు నిలిపివేసినట్టు ప్రకటించిన టర్కీ తమ సేనలను ఉపసంహరించుకోవట్లేదని తెలిపింది. కుర్దు దళాలు భద్రతా జోన్ నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టంచేసింది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని కుర్దు తిరుగుబాటుదారులు కూడా ప్రకటించాయి.