Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంక్షలకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా మీడియా సంస్థల వినూత్న నిరసన
కాన్బెర్రా: మీడియా సంస్థలపై ఆంక్షలను నిరసిస్తూ ఆస్ట్రేలియా వార్తా పత్రికలు వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. ప్రభుత్వం తమ స్వేచ్ఛను కాలరాస్తోందని ఆరోపించాయి. సోమవారం న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియాతో పాటు తొమ్మిది పత్రికలు మెయిన్ ఎడిషన్లోని ఫ్రంట్ పేజీ అక్షరాలకు నల్లరంగు వేసి దానిపై రహస్యం అనే స్టాంప్ను ప్రచురించాయి.ఈ ఏడాది జూన్ నెలలో ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్తో పాటు న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు సంస్థలు ప్రజావేగుల సమాచారం ఆధారంగా యుద్ధనేరాలకు సంబంధిం చిన వివరణాత్మక ఆరోపణలతో పాటు ఆస్ట్రేలియా పౌరులపై నిఘా పెట్టేందుకు ఓ ప్రభుత్వ సంస్థ చేసిన ప్రయత్నాన్ని వివరిస్తూ కథనాలు ప్రచురిం చాయి. ఈ దాడులకు సంబంధించి ముగ్గురు జర్న లిస్టులు ప్రాసిక్యూషన్ను ఎదుర్కోవాల్సి ఉంటుం దని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఖరిపై మీడియా సంస్థలు మండిపడ్డాయి. తమపై దాడులు, ఆంక్షలను నిరసిస్తూ సోమవారం జరిగిన నిరసన ర్యాలీకి దేశంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, వెబ్ మీడియా సంస్థలు మద్ధతు తెలిపాయి. గత రెండు దశాబ్ధాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన భద్రతా చట్టాలు పరిశోధ నాత్మక జర్నలిజానికి ముప్పు తెచ్చాయని. ప్రజలు తెలుసుకునే హక్కుకు ఇది విఘాతం కలిగించాయని పలువురు మీడియా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
వ్యతిరేక వార్తలపై సర్కార్ మార్క్ ఆగ్రహం..
ఓ సామాజిక సంస్థ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ది ఆస్ట్రేలియన్ సహా కొన్ని దినపత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. దీనిపై ప్రభుత్వం వివరణ కోరింది. దీనికి అనుగుణంగా వివరణలు ఇచ్చుకున్నాయి కూడా. అయినప్పటికీ ప్రభుత్వం మెత్తబడలేదు. మెట్టు దిగలేదు. రూపర్ట్ ముర్డోక్ కు చెందిన న్యూస్ కార్పొరేషన్, సిడ్నీ కేంద్రంగా ప్రసారమయ్యే ఆస్ట్రే లియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కార్యాలయాలపై కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడులు, తనిఖీలు, సోదాలు మీడియా సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించాయని చెబుతున్నారు.
ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ మహిళా సంపాదకురాలిని పోలీసులు తనిఖీ చేసిన విధానం అత్యంత అమానవీయమని విమర్శలు వెలువడ్డాయి. ఎలాంటి ఆధారాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలను ప్రచురించారని ప్రశ్నిస్తూ పోలీసులు ఆమెను నిలువెల్లా తనిఖీ చేశారని అంటున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పుకొనే మీడియాపై ఆంక్షలు విధించడం, తాము చెప్పినట్టు వినాలనే ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము ఈ చర్యలు తీసుకున్నట్టు మీడియా, ఎంటర్ టైన్ మెంట్, ఆర్ట్స్ అలయన్స్ (ఎంఈఏఏ) ప్రధాన కార్యదర్శి పాల్ మర్ఫీ అన్నారు.
కుదిపేస్తోన్న మీడియా బ్లాక్ అవుట్..
ప్రభుత్వం ఆంక్షలు సడలించేంత వరకూ తమ నిరసన కొనసాగిస్తామని, నిరసన స్వరూపం ఎలా ఉండాలనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. కనీస సమాచారాన్ని కూడా వెల్లడించకుండా ప్రభుత్వం దేశ ప్రజలను చీకట్లో ఉంచడానికి, కండ్లు కప్పడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ఘటన ఆస్ట్రేలియన్ చట్టసభలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు పత్రిక ప్రతులను ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై ఆస్ట్రేలియా సమాచార శాఖ మంత్రి పాల్ ఫ్లెచర్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాన్ని తాము ఎప్పుడు చేయలేదని అన్నారు.