Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రవాస భారతీయులు సత్తాచాటారు. ఏకంగా నలుగురు ప్రవాస భారతీయులు యూఎస్ సెనెట్కు ఎన్నికయ్యారు. వీరిలో హైదరాబాద్కు చెందిన ముస్లిం మహిళతో పాటు వైట్హౌస్ టెక్నాలజీ పాలసీ అడ్వైజర్ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. సెనెటర్లుగా ఎన్నికైన వారిలో కమ్యూనిటీ కాలేజ్ ప్రొఫెసర్ గజాలా హష్మీ, మాజీ వైట్హౌస్ అధికారి సుహాస్ సుబ్రహ్మాణ్యం, తమిళనాడు రాష్ట్రానికి చెందిన రిసెర్చ్ స్కాలర్ ప్రవాస భారతీయుడు రాజు, డింపుల్ అజ్మీరా ఉన్నారు. గజాలా హష్మీ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గ్లెన్ స్టర్టీవంట్పై గెలుపొందారు.వర్జీనియా సెనెటర్గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభినందించారు.
రెనాల్డ్ కమ్యూనిటీ కాలేజ్లోని సెంటర్ ఫర్ ఎక్సెల్ల్లెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విభాగానికి వ్యవస్థాపక డైరెక్టరుగా ఆమె ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ప్రవాస భారతీయుల జనాభా అధికంగా ఉన్న లౌడన్, ప్రిన్స్విల్లియం నగరాల నుంచి బరిలో నిలిచి సుబ్రహ్మణ్యం గెలిచారు. ఆయన తల్లిదండ్రులు బెంగళూరు నుంచి 1979లో అమెరికాకు వలస వచ్చారు. ఒబామా హయాంలో ఆయన వైట్హౌస్లో పనిచేశారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి రాజు గెలుపొందారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడు రాష్ట్రం నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. చార్లొట్టె సిటీ కౌన్సిల్ నుంచి డింపుల్ అజ్మీరా ఎన్నికయ్యారు. ఆమె 16ఏండ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. నలుగురు ప్రవాస భారతీయులు అమెరికా సెనెట్కు ఎంపిక కావడం పట్ల డెమోక్రటిక్ పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు అభినందించారు.