Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాపాజ్ : బొలీవియాలో మాజీ అధ్యక్షుడు ఎవో మొరేల్స్ బలవంతపు రాజీనామాకు దారితీసిన కుట్రపై దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నానాటికీ వ్యతిరేకత మిన్నంటుతోంది. మొరేల్స్ వ్యతిరేక కుట్రను నిరసిస్తూ గురువారం నాడు వేలాదిమంది కార్మికులు బొలీవియాలోని ఎల్ ఆల్టో నగరం నుండి రాజధాని లాపాజ్ వరకూ దాదాపు 15 మైళ్ల పొడవున ప్రదర్శన నిర్వహించారు. ప్రజలెన్నుకున్న అధ్యక్షుడిని గద్దెదించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కుట్రదారులను తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నించిన సైన్యంతో వారు తీవ్ర స్థాయిలో ఘర్షణలకు దిగారు. స్వయం ప్రకటిత అధ్యక్షురాలు అనీజ్ ప్రభుత్వం 24 గంటల్లోగా రాజ్యాంగ పరిస్థితులను పునరుద్ధరించకపోతే తాము నిరవధిక సమ్మెకు దిగుతామని దేశంలోని ప్రధానకార్మిక సంఘం బొలివేరియన్ వర్కర్స్ సెంట్రల్ హెచ్చరించింది. గత దశాబ్దన్నర కాలంగా తాము కాపాడుకుంటున్న ఆర్థికవ్యవస్థను పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఈ ఉద్యమం రాజకీయోద్యమంగా మారుతోందని బలవంతపు రాజీనామా లపై ఆందోళన చేపట్టిన మొరేల్స్, ఆయన నేతృత్వంలోని అధికార మాస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అమెరికా స్వయంప్రకటిత అధ్యక్షురాలు అనీజ్ను గుర్తించటంలో కూడా ముందే నిలబడింది. అదే విధంగా బొలీవియాతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ అక్కడి ఖనిజ, వాయు నిక్షేపాలపై కన్నేసిన బ్రెజిల్, ఐరోపా కూటమి అనేక పెట్టుబడిదారీ అనీజ్ సర్కారును గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి.