Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసీలియా: నిర్దేశిత సమయంలోగా భారత్కు ఎస్-400 క్షిపణులను అందజే స్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. అంతా ప్రణాళిక ప్రకారమే.. సవ్యంగానే సాగుతుంది కాబట్టే భారత్ నుంచి ఎటువంటి ఒత్తిడి రాలేదని అన్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా మోడీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వీరి మధ్య ఎస్-400 సహా పలు వ్యూహాత్మక అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు గత అక్టోబర్లో భారత్ ఒప్పందం కుదుర్చుకొంది. అయితే, దీనిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్, సిరియాలో సైనిక జోక్యం చేసుకుంటున్న రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లు చేపట్టొద్దని అమెరికా హెచ్చరించింది. అయితే, భౌగోళికంగా పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఎస్-400 ఆయుధ కొనుగోలు తప్పదని భారత్ ఇప్పటికే అమెరికాకు స్పష్టం చేసింది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలో లేదో తమకు చెప్పే అధికారం ఏ దేశానికి లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలో తేల్చి చెప్పారు. ఆయుధాల కొనుగోళ్లు దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పుతిన్ ప్రకటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.