Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 52.25శాతం ఓట్లతో ఎస్ఎల్పీపీ నేత గెలుపొందినట్టు ప్రకటించిన ఎన్నికల సంఘం
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పోడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) నేత గోటబయ రాజపక్స విజయం సాధించారు. రాజపక్సకు 52.25 శాతం ఓట్లు ( 6,924,255 ) గెలుచుకోగా, గృహనిర్మాణ శాఖ మంత్రి సజిత్ ప్రేమదాసకు 41.99 శాతం ఓట్లు ( 5,564,239), ఇతర అభ్యర్థులకు 5.76శాతం ఓట్లు వచ్చినట్టు శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 13లక్షల ఓట్ల మెజారిటీతో రాజపక్స గెలుపొందినట్టు పేర్కొంది. శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల కౌంటింగ్ ప్రతిదశలోనూ రాజపక్స ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్పీ ( యునైటెడ్ నేషనలిస్ట్ పార్టీ ) నేత సజిత్ ప్రేమదాసపై పైచేయి సాధించారు. రాజపక్స గెలుపొందినట్టు ఎస్ఎల్పీపీ, యూఎన్పీలు ధ్రువీకరించాయి. ఎస్ఎల్పీపీ అభ్యర్థిగా ఎన్నికల్లోకి దిగిన 70 ఏండ్ల రాజపక్స దేశానికి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద రాజపక్స సోదరుడు కావడం విశేషం. రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. వివాదాస్పద నాయకుడిగా ఆయనకు పేరుంది. 2008-2009లో తమిళ వేర్పాటువాద గెరిల్లాలతో తుది విడత పోరులో తీవ్రమైన యుద్ధనేరాలకు పాల్పడిన ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన తన అమెరికా పౌరసత్వాన్ని వదలుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన కీలకంగా సింహళీయులు, జాతీయతావాదాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. మెజారిటీ కమ్యూనిటీగా ఉన్న సింహళీయుల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా, తాజా ఫలితాల ప్రకారం సింహళీయులు ఆయనకు పెద్దఎత్తున మద్దతుగా నిలవగా, మైనారిటీ తమిళులు, ముస్లింలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తెలుస్తోంది. చైనా అనుకూల నేతగా గోటబయ రాజపక్సాను పేర్కొంటారు. శ్రీలంకలో ఈస్టర్ సండేరోజున ఆత్మాహుతి దాడి జరిగింది. ఈదాడిలో 269 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. పర్యాటక రంగం ఆదాయానికి గండిపడింది. ఇన్ని సమస్యల నడుమ శనివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. 16 మిలియన్ల శ్రీలంక జనాభా భవిష్యత్తును కాపాడతానంటూ రాజపక్స హామీల వర్షం కురిపించారు. మరోవైపు ఈస్టర్ సండేనాడు జరిగిన ఆత్మాహుతి దాడుల వల్ల ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముందస్తు సమాచారం అందినప్పటికీ దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత విక్రమ సింఘేని తొలగించి మహీంద రాజపక్సను ప్రధానిగా నియమించుకోవాలనే అంశంపై కసరత్తు చేయనున్నట్టు ఎస్ఎల్పీపీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు రాజ్యాంగంలోని 19ఏ అధికరణపై అధ్యయనం చేయనున్నట్టు తెలిపింది.