Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ను హిమపాతం కుదిపేసింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. హిమపాతం కారణంగా దేశవ్యాప్తంగా 75 మంది మృతిచెందారు. 40 మంది గాయపడ్డారు. గత మూడు రోజులుగా పాకిస్తాన్లో ప్రతికూల వాతావరణం కారణంగా రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. రహదారులపై మంచు భారీగా పేరుకుపోయింది. పలు ప్రధాన మార్గాల్లోనూ వాహన రాకపోకలు నిలిచిపోవడంతో వందల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 24 గంటల వ్యవధిలో 57మంది ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. బలూచిస్తాన్లో 17మంది మరణించారని పేర్కొన్నాయి. హిమపాతం కారణంగా 35 ఇండ్లు కూలిపోయాయని తెలిపాయి. హిమపాతం కారణంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఖైబర్ పక్తుంక్వాలోని కోహిస్తాన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన కారణంగా కారకోరం జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చిత్రాల్ జిల్లాతో సంబంధాలు తెగిపోయాయి. మలాకండ్, హజారా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.