Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ప్రముఖుల జీవన విధానాలు తెలుసుకోవాలని చాలా మంది నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ మరోసారి తన ఆరోగ్యం, ఆహారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారానికి ఏడుసార్లు మాత్రమే భోజనం చేస్తానని వెల్లడించి వార్తల్లో నిలిచాడు. డోర్సీ బుధవారం యూట్యూబ్ యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే ఆహార నియమాల గూర్చి మరోసారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తాను వారంలో ఏడు సార్లు భోజనం చేస్తానని..అది కూడా రాత్రి డిన్నర్ మాత్రమే చేస్తానని తెలిపారు. యోగాతో పాటు ఉపవాసాలు కూడా ఉంటానని తెలిపారు. తాను నిత్యం స్నానం చేసి రెండు గంటల పాటు ధ్యానం చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా చాలా ప్రశ్నలు ఎడిట్ బటన్, స్పెల్ చెక్ లాంటి సాంకేతిక అంశాలపై అడిగినప్పటికీ, వ్యక్తిగత ప్రశ్నలు, ఆయన జీవన శైలికి సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. కొంత మంది నెటిజన్లు ఆయనపై సెటైర్లు కూడా పేల్చారు. గతంలోవారానికి అయిదుసార్లు అని ప్రకటించిన డోర్సీ, ఇపుడు ఆ కోటాను 7కు పెంచారని చమత్కరించారు. తన ఆహారంలో (డిన్నర్) చేపలు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానని గత మార్చిలో చెప్పిన విషయం తెలిసిందే.