Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా చరిత్రలో మూడోసారి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించి అభిశంసన తీర్మానం ప్రక్రియ సెనేట్లో ప్రారంభమైంది. అభిశంసన తీర్మానం సందర్భంగా సెనేట్ లోని సభ్యులు పక్షపాతంతో వ్యవహరించబోమని ముందుగా జ్యూరీ ఎదుట ప్రమాణం చేశారు. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలో అభిశంసన తీర్మానం ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా చరిత్రలో ఒక దేశాధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇది మూడోసారి కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడి ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో ట్రంప్పై అభిశంసన తీర్మానం ఆసక్తికరంగా మారింది. ట్రంప్పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో జడ్జీలుగా నలుగురు డెమోక్రటిక్ సభ్యులు ఉన్నారు. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి వ్యవహరిస్తారా అని చీఫ్ జస్టిస్ అడుగగా అందుకు సభ్యులంతా తాము పక్షపాతంతో వ్యవహరించబోమని చెప్పి ప్రమాణస్వీకారం ఉన్న పుస్తకంలో సంతకాలు చేశారు.
రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్
గత నెలలో ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ జరిగింది. ట్రంప్ రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష పదవికి రేసులో ఉన్న జో బిడెన్పై విచారణ జరపాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకురావడం ఒకటైతే... తనపై విచారణ జరగకుండా కాంగ్రెస్ను అడ్డుకోవడం రెండోది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని కేవలం తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు డెమోక్రాట్లు దిగారని చెప్పారు. అభిశంసన తీర్మానంలో గట్టెక్కుతానన్న విశ్వాసంను ట్రంప్ వ్యక్తం చేశారు. సెనేట్లో మెజార్టీ సభ్యులు రిపబ్లికన్లు ఉండటంతో ట్రంప్ సులభంగా గట్టెక్కుతారనే పరిశీలకులు చెబుతున్నారు.