Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమేనిని హెచ్చరించిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలి ఖమైనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమైనీని లక్ష్యంగా 'మాటలు జాగ్రత్త' అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. 'ఇరాన్ సుప్రీం నేత'గా పిలవబడుతున్న వ్యక్తి అమెరికా, ఐరోపా పట్ల కఠినంగా మాట్లాడుతున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకూ దిగజారిపోతున్నది. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి ఇరాన్ సుప్రీం లీడర్ ఆచితూచి మాట్లాడాలి. అయినా ఆయన ఎంతో కాలం సుప్రీంగా ఉండబోరు' అని ఖమేనీపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అలాగే.. పరువు కోసమని దాడులు చేయడం సరికాదు. ఇరాన్ను నాశనం చేయడం కంటే.. ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై ఎక్కువ దృష్టి సారించి, ఇరాన్ను తిరిగి గొప్ప దేశంగా మార్చాలని ట్రంప్ ఆ దేశ నేతలకు హితవు పలికారు. అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్టుగా వారికి మెరుగైన భవిష్యత్తును, గౌరవాన్ని అందించే ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని ట్రంప్ అన్నారు. కాగా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్- అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ పట్ల అయతొల్లా ఖమైనీ వివాదాస్పద వ్యాఖ్య చేసినట్టు ట్రంప్ ట్విటర్ ఖాతా ద్వారా తెలుస్తున్నది. ఖమైనీ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలోని కొన్ని వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇరాన్ ప్రజలకు అండగా ఉంటున్నా మంటూ అనాగరికపు అమెరికా అబద్ధాలు చెబుతున్నదనీ, ఇరాన్పై దాడికి ప్రయత్నించి విఫలమాయ్యారనీ, ఇక ముందు కూడా ఓటమిపాలవుతూనే ఉంటారని అన్నారు. అమెరికాలో ట్రంప్ పాలన జోకర్ మాదిరిగా ఉన్నదని విమర్శించారు. అదే విధంగా ఇరాన్లో ఉక్రెయిన్ విమాన ప్రమాదంపై విచారం వ్యక్తంచేశారు. కానీ ప్రత్యర్థి దేశాలు మాత్రం ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాయని అన్నారు. అణు ఒప్పందం తదితర విషయాల్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ రోజుకో మాట మారుస్తూ... 'అమెరికా బానిసలు' అని నిరూపించుకుంటున్నాయని విమర్శించారు.