Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా వైరస్ను గుర్తించేందుకు భారత్లోని అన్ని విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన కరోనా వైరస్ చైనాలో వేగంగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ 9 మంది మృతి చెందారు. 400కి పైగా కేసులు నమోదయ్యాయి. తైవాన్, హాంకాంగ్ ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ ఉనికిని గుర్తించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రభావం భారత్లో లేదని వెల్లడించారు. చైనాలోని భారత ఎంబసీ నుంచి కూడా తాజా సమాచారం సేకరిస్తున్నామని ప్రీతి సుడాన్ తెలిపారు.
అమెరికాలో తొలి కేసు
ఈ వ్యాధి ఆసియాతో పాటు పశ్చిమ దేశాలకూ వ్యాప్తి చెందినట్టు భావిస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే ఒక కేసు నమోదైనట్టు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. సీయాటెల్లో నివసించే ఓ 30 ఏండ్ల వ్యక్తి అధికారులను సంప్రదించారు. అతను అనారోగ్యానికి గురవడంతో జరిపిన వైద్యపరీక్షల్లో సార్స్ ఆనవాళ్లు గుర్తించినట్టు డాక్టర్లు చెప్పారు. దీంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించారు. ప్రస్తుతం అతనికి ప్రత్యేకవార్డులో చికిత్స అందజేస్తున్నారు. గతంలో చైనాలోని ఉహాన్ నగరానికి వెళ్లిన ఆయన జనవరి 15న తిరిగి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు