Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయన్మార్ సర్కారుకు ఐసీజే ఆదేశాలు
ది హేగ్ : రోహింగ్యా ముస్లింలను రక్షించాలని మయన్మార్ సర్కారును అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది. రోహింగ్యా ముస్లింల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తక్షణమే దృష్టి సారించాలని కోరింది. బుధవారం జస్టిస్ అబ్దుల్లాఖవీ అహ్మద్ యూసుఫ్ నేతృత్వంలోని 17 మంది న్యాయమూర్తుల విస్త్రృత ధర్మాసనం మయన్మార్లో మారణకాండ అంశంపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టి పై ఆదేశాలు జారీ చేసింది. ఐరాసలో పొందుపరిచిన నిబంధనలను మయన్మార్ ఉల్లంఘించిందని అభిప్రాయపడింది. రోహింగ్యా ముస్లింల హక్కులను మయన్మార్ సర్కారు కాలరాసిందని, పూడ్చలేని నష్టాన్ని కలిగించిందని తెలిపింది. రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యా ముస్లింలను ఊచకోత కోసిన మయన్మార్ ఆర్మీ చర్యలు క్షమించరాని నేరమని పేర్కొంది. రోహింగ్యా ముస్లింల ఊచకోత అంశం యావత్ ప్రపంచ దేశాలకు తెలిసినప్పటికీ స్పందించకపోవడం విచారణకరమని ధర్మాసనం అభిప్రాయపడింది. మయన్మార్ చర్యలను వ్యతిరేకిస్తూ రోహింగ్యా ముస్లింలకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తూ ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసిన గాంబియా సర్కార్ను జస్టిస్ అబ్దుల్లాఖవీ అహ్మద్ యూసుఫ్ అభినందించారు.కాగా, మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో 2016అక్టోబర్లో అక్కడి ఆర్మీ అరాచకాలకు పాల్పడింది. మత విద్వేష భావాలతో రోహింగ్యా ముస్లింలను ఊచకోత కోసింది. వేలాది ఇండ్లకు నిప్పంటించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మహిళలు, వృద్ధులు, పిల్లలనే తేడా లేకుండా 24వేల మందిని హతమార్చారు. మయన్మార్ ఆర్మీ హింసాకాండకు భీతిల్లిన రోహింగ్యా ముస్లింలు ప్రాణభయంతో బంగ్లాదేశ్ తదితర దేశాలకు పారిపోయారు. మయన్మార్ ఆర్మీ హింసాకాండపై అనేక దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.