Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు
- ఈనెల 21 నుంచి మరో ఆరు దేశాలపై ప్రయాణ ఆంక్షలు
- భవిష్యత్తులో అమెరికాకు మరిన్ని చిక్కులు : జార్జి వాషింగ్టన్ వర్సిటీ సదస్సులో యూఎస్ మాజీ దౌత్యవేత్త
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం అనైతికమైనదని ఉక్రెయిన్లో యూఎస్ మాజీ దౌత్యవేత్త మేరీ యోవనోవిచ్ విమర్శించారు. అమెరికా విదేశాంగ విధానమంటేనే ఇతర దేశాల్లో భయాందోళనలు కల్గుతున్నాయని అన్నారు. యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేసిన తర్వాత ఇతర దేశాల అంతర్గత వ్యవహరాల్లో జోక్యం పెరిగిపోయిందన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా భవిష్యత్తులో అమెరికాకు మరెన్నో చిక్కులు వచ్చిపడే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు. గురువారం జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. ట్రంప్లో జాతివిద్వేష భావాలు ఉన్నాయని అన్నారు. ఆరు దేశాలకు చెందిన ( ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్) ముస్లిం వలసదారులను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా చేయాలనే దురుద్దేశంతో ప్రయాణ ఆంక్షలు విధించారని అన్నారు. అమెరికా న్యాయస్థానాల్లో ట్రంప్ సర్కారుకు చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారని ఆమె గుర్తు చేశారు. అమెరికాలో ఆశ్రయం కోసం వచ్చే ముస్లిం వలసదారులపై ఉగ్రవాద ముద్ర వేశారని విమర్శించారు. గతంలో వలసదారులను అక్కున చేర్చుకున్న ఘనత అమెరికాది అని ఆమె గుర్తు చేశారు. వలసదారుల పట్ల విద్వేష భావాలు ప్రదర్శించొద్దని ట్రంప్తో అనేక సార్లు చర్చించానని అన్నారు. ట్రంప్పై ఆరోపణలు చేసినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యక్తిగత న్యాయవాది రూడీ గిలియానీ, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోలు తనను బెదిరించారని అన్నారు. మరో ఆరుదేశాలపై (ఎరిట్రియా, కిర్గిస్థాన్, మయన్మార్, నైజీరియా, సుడాన్, టాంజేనియా) ప్రయాణఆంక్షల విధించనున్నట్టు గతనెల31న ట్రంప్ ప్రకటించిన విషయం ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రంప్ ఆదేశాలు ఈనెల 21 నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పారు. ఓ వర్గానికి చెందిన ప్రజలపై ట్రంప్ అనుసరిస్తున్న విద్వేష భావాల కారణంగా అమెరికా ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు. ఇజ్రాయిల్, పాలస్తీనా వివాదంలో తలదూర్చి ట్రంప్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు ఆజ్యం పోశారని మండిపడ్డారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమానిని అమెరికా హతమార్చిన అనంతరం మధ్య ప్రాఛ్య దేశాలు అగ్నిగుండంలా మారాయని అన్నారు. ట్రంప్ అనాలోచిక చర్యల కారణంగా పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు.
కాగా, డెమోక్రటిక్ పార్టీ నేత, యూఎస్ మాజీ ఉపాధ్యక్షుడు జోబిడెన్ను ఇరకాటంలో పడేసేందుకు ఉక్రెయిన్తో ట్రంప్ రహస్య సంప్రదింపులు జరిపిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. జోబిడెన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ట్రంప్ దిగజారుడుతనానికి పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. ఉక్రెయిన్లోని జోబిడెన్, ఆయన కుమారుడు నిర్వహిస్తున్న వాణిజ్య సంస్థలపై దాడులు నిర్వహించి ఆయన్ను అప్రతిష్టపాలు చేయాలని ట్రంప్ కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు లీకయ్యాయి. దీని ఆధారంగా రిపబ్లికన్ పార్టీ ట్రంప్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతినిధుల సభ అభిశంసన విచారణ చేపట్టింది. ఈనెల5న ఈ అంశం సెనెట్కు చేరింది. సెనెట్లో రిపబ్లికన్ పార్టీ సభ్యుల మెజారిటీ అధికంగా ఉండటంతో అభిశంసన వీగిపోయింది. ట్రంప్పై మోపిన అభియోగాలు రుజువు కాలేదని హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ వెల్లడించారు. రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్ రోమ్నీ కూడా ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తూ అభిశంసనకు అనుకూలంగా సెనెట్లో ఓటు నమోదు చేయడం గమనార్హం. యూఎస్ సెనెట్లో ట్రంప్పై అభిశంసన ప్రవేశపెట్టడంలో మేరీ యోవనోవిచ్ కీలక పాత్ర పోషించారు. గతంలో ఉక్రెయిన్లో యూఎస్ దౌత్యవేత్తగా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ట్రంప్ విధానాలతో విసిగిపోయినట్టు ప్రకటించారు.