Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా ఆరోగ్య కమిషన్ అధికారి వెల్లడి
- 1,700 దాటిన మృతులు, 70 వేలు దాటిన ఇన్ఫెక్షన్లు
బీజింగ్: ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కోవిడ్-19 వ్యాప్తిని నివారించటం, ఇన్ఫెక్షన్లకు సంపూర్ణ చికిత్స అందించటం సుసాధ్యమేనని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్కు చెందిన ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఆరోగ్య కమిషన్లో ఆస్పత్రి సూపర్వైజర్గా వ్యవహరిస్తున్న గువో యాన్హోంగ్ సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వైరస్కు కేంద్ర స్థానంగా వున్న ఉహాన్ నగరంలో ఇన్ఫెక్షన్లు సోకి విషమస్థితిలో వున్న వారు 18 శాతం మాత్రమేనని, 38 శాతం మంది ప్రారంభదశలో ఉన్నారని వివరించారు.
1,700 దాటిన మృతులు, 70 వేలు దాటిన ఇన్ఫెక్షన్లు
సోమవారం కోవిడ్-19 మృతుల సంఖ్య 105 నమోదు కావటంతో మొత్తం మృతుల సంఖ్య 1,770కి చేరిందని అధికారులు చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అత్యవసరం కాని బహిరంగ వేదికలను మూసివేస్తున్నామని, ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నామని అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా తాజాగా ఇన్ఫెక్షన్లు సోకిన వారి సంఖ్య 2,048 నమోదు కావటంతో ఇప్పటి వరకూ మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 70,548కి చేరిందని అధికారులు తెలిపారు. తాజాగా వెలుగుచూసిన మృతులలో 100 హువై ప్రావిన్స్లోనై, మూడు హెనన్ ప్రావిన్స్లోనూ, మరో రెండు గాంగ్డాంగ్ ప్రావిన్స్లోనూ నమోదయ్యాయని వివరించారు. కాగా ఈ ఇన్ఫెక్షన్లతో చికిత్స పొందుతున్న వారిలో రికవరీ అనంతరం 10,844 మందిని ఆస్పత్రులనుండి డిశ్చార్జ్ చేశామని అధికారులు వెల్లడించారు. ఆదివారం నాటికి హాంకాంగ్లో 57 ఇన్ఫెక్షన్లు, ఒకరి మృతి నమోదు కాగా, మకావ్లో 10 ఇన్ఫెక్షన్లు, తైవాన్లో ఒకరి మృతితో పాటు 20 ఇన్ఫెక్షన్లు నమోదయినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ వెలుగు చూసిన తరువాత గత నెల 23 నుండి దిగ్బంధంలోవున్న హువై ప్రావిన్స్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి స్థానిక ప్రభుత్వం కఠిన చర్యలను ప్రకటించింది. తాజా కేసుల నమోదులో ఆదివారం నాడు గణనీయమైన తగ్గుదల కన్పించిందని, వైరస్ వ్యాప్తి నిరోధానికి తాము చేపట్టిన చర్యలు ప్రభావం చూపుతున్నాయని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.