Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.71,566 కోట్ల సాయం అందజేయనున్న జెఫ్ బెజోస్
వాషింగ్టన్: పర్యావరణ పరిరక్షణ కోసం అమెజాన్ సీఈవో, అత్యంత ధనికుడు జెఫ్ బెజోస్ ముందుకొచ్చారు. ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ వాతావరణ మార్పులపై సరైన చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తమ సంస్థపై వచ్చిన విమర్శలకు బెజోస్ ధీటుగా బదులిచ్చారు. వాతావరణ మార్పులను అరికట్టేందుకు 10బిలియన్ డాలర్లను (రూ.71,566 కోట్లు ) కేటాయించన్నట్టు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా బెజోస్ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆయనకు ఇన్స్టాగ్రామ్లో 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాము అందించే సాయాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, ఎన్జీఓలకు ఈ నిధులను వాడుకోవచ్చని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు రావడం చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. 'వాతారవణ మార్పులు అనేది భూగోళానికి అత్యంత పెద్ద సమస్య. వాతావరణంలో నెలకొన్న విపత్కర మార్పులను ఎదుర్కొనేందుకు పోరాడాలనుకుంటున్నా. అందుకు కావాల్సిన మార్గాలను అన్వేషించడానికి నిపుణులతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాను' అని బెజోస్ అన్నారు. ఇటీవల సంస్థ విధానాలను విమర్శిస్తూ.. వందలాది మంది అమెజాన్ ఉద్యోగులు.. సంస్థ బ్లాగ్లో పోస్ట్ చేశారు. వాతావరణ మార్పులను పరిష్క రించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. డోర్ డెలివరీల కోసం అమోజాన్ ఉపయోగించే ప్యాకేజింగ్ వల్ల ఎక్కువ వ్యర్థాలు వెలువడుతునా యని ఆరోపించారు. అంతేగాకుండా భారీ వాహనాల నుంచి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు అధికంగా ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెజోస్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
2040 నాటికి పర్యావరణంలో కార్బన్ సమతుల్యత సాధిస్తామని గతేడాది సెప్టెంబరులో ప్రకటించారు బెజోస్. అంతే కాకుండా లక్ష ఎలక్ట్రిక్ డెలివరీ ట్రక్కులను ఆర్డర్ చేస్తామని పేర్కొన్నారు.