Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా చమురు కంపెనీపై ఆంక్షలు
మాస్కో : వెనిజులాపై అక్కసుతో రష్యాలోని రోస్నెఫ్ట్ అనే ప్రముఖ చమురు కంపెనీపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. రోస్నెఫ్ట్ కంపెనీ వెనిజులా నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకొని విదేశాలకు విక్రయిస్తోందని ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను రోస్నెఫ్ట్ చైర్మెన్ దీదియర్ కసిమిరో ఖండించారు. అగ్రరాజ్యం చర్యలపై రష్యా మండిపడింది. అమెరికా ఆంక్షలకు తలొగ్గేది లేదని వెల్లడించింది. రష్యా, వెనిజులా దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డీమిత్రీ పెస్కోవ్ తెలిపారు. రష్యా అనుబంధ చమురు కంపెనీలపై ఆంక్షలు విధించి వెనిజులాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అన్నారు. రోస్నెఫ్ట్ చమురు సంస్థకు జెనీవాలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. ఈ సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టాలని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈసంస్థ మదురోకు ఆర్థికంగా సహకరిస్తోందని అమెరికా ఆరోపిస్తున్నది. ఇదిలా ఉండగా, మదురో పాలనకు రష్యా, చైనా, క్యూబా దేశాలు మద్దతిస్తున్నాయి. రష్యా మిత్రదేశాల నుంచి మదురోకు మద్దతు లభించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతున్నది.