Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నేపథ్యంలో బిసిజి అధ్యయనం
వాషింగ్టన్ : కరోనా విజృంభనతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కొన్ని దేశాల్లో ఇటీవల ఆంక్షల సడలింపుతో ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్, దాని వలన విధించిన లాక్డౌన్ ప్రభావం ఇప్పుడే పోదని, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఇప్పట్లో తిరిగి కోలుకునే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో రానున్న రెండు, మూడు నెలల్లో ప్రపంచ కార్మిక శక్తిలో సగం అంటే దాదాపు 2 వందల కోట్ల మంది ఉద్యోగం కోల్పోయే ప్రమాదం పొంచివుందని లేదా వారు తాత్కాలిక ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బిసిజి) తన తాజా అధ్యయనంలో పేర్కొంది. కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రపంచ కార్మిక శక్తిలో వచ్చే మార్పులను అంచనా వేయడం చాలా కష్టతరమని నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఈ ఏడాది 3.4 ట్రిలియన్ డాలర్ల మేర అదాయం కోల్పోనున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) అంచనాలను బిసిజి నివేదిక ఈ సందర్భంగా గుర్తుచేసింది. రానున్న రెండు, మూడు నెలల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోనున్నారని, ప్రపంచ నిరుద్యోగం 17 శాతానికి మించి ఉంటుందని అధ్యయన పరిశోధకులు పేర్కొన్నారు. అయితే లేబర్ మార్కెట్పై ఈ ప్రభావం పరిశ్రమల వారీగా చూసుకుంటే తేడాగా ఉంటుందని నివేదిక తెలిపింది. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న రంగాలు ఆంక్షలు, క్వారంటైన్ల కారణంగా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మూతపడిన పరిశ్రమల్లో దాదాపు 80 శాతం ఆహారేతర రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, హౌటల్, రెస్టారెంట్ వ్యాపారం, టూరిజం, నిర్మాణ రంగాలే అని వెల్లడించింది. కరోనా సంక్షోభంతో ఏర్పడిన నిరుద్యోగ సమస్య 2020 చివరి నుంచి మెరుగయ్యే అవకాశం ఉందని బిసిజి నివేదిక తెలిపింది. 2030 నాటికి ఆటోమేషన్ సాంకేతికత దాదాపు 12 శాతం ఉద్యోగాలను రిస్క్లో పెడుతుందని, 30 శాతం మందికి కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయని పేర్కొంది. ఈ నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు వేతనాల రాయితీ, సామాజిక భద్రత, ఆర్థిక, పన్ను రాయితీలు వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బిసిజి తన నివేదికలో తెలిపింది.