Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబియా : కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశంలో విధించిన మూడు నెలల లాక్డౌన్ అనంతరం శ్రీలంకలోని పాఠశాలలు సోమవారం తిరిగిప్రారంభమయ్యాయి. నాలుగు దశల్లో విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వస్తారని విద్యాశాఖ మంత్రి డల్లాస్ అలహపెరుమా తెలిపారు. విద్యార్థులు తిరిగి పాఠశాలలకు వచ్చేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ప్రణాళికలు రూపొందించేందుకు విధులకు హాజరైనట్లు తెలిపారు. ఏప్రిల్ 30 తరువాత మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు. శ్రీలంకలో కరోనావైరస్ కేసులు రెండు వేలకుపైగా నమోదయ్యాయనీ, ఇందులో 11 మంది మృతి చెందారనీ, జూన్ 1 తరువాత ఇప్పటి వరకూ మరణాలు నమోదు కాలేదని తెలిపారు. తరగతులను ప్రారంభించేందుకు మరిన్ని ప్రణాళికలు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
విద్యార్థుల తరగతుల ఆధారంగా జులై 6, 20, 27 నుంచి వస్తారని పాఠశాలలకు మంత్రి తెలిపారు. మొదటి దశలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల నిర్వహణ బోర్డులన్నింటికీ జూన్ 29 నుంచి జులై 3 లోగా నివేదించాలని కోరుతూ పాఠశాలలకు సర్క్యులర్లను పంపుతామని వివరించారు. తరగతి గదులను శానిటైజ్ చేయాల్సి ఉన్నందున మరో వారం పాటు విద్యార్థులు పాఠశాలలకు హాజరు కానవసరం లేదని మంత్రి తెలిపారు. అయితే గ్రేడ్-1,2 పాఠశాలలను తెరవడానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆగస్టు 5న ప్రారంభం కావాల్సిన జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్డ్ లెవల్ను సెప్టెంబర్ 7 నుంచి అక్టోర్ 2 వరకూ వాయిదా వేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు తెలిపారు.