Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-15 మంది మృతి.. పలువురు గల్లంతు
టోక్యో: భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలతో జపాన్ అతలాకుతలం అవుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు పోటెత్తి.. దక్షిణ జపాన్ ప్రాంతం నీట మునిగింది. ముఖ్యంగా కుమా నది ఉప్పొంగటంతో హితోయోషి పట్టణంతో పాటు నది చుట్టూ ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్లు, వాహనాలు అన్ని జలమయం అయ్యాయి. దీంతో అక్కడి ప్రజలంతా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండ్లపైకి చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వరదల్లో ఇప్పటికే 15 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. అలాగే, 14 మంది గల్లంతయ్యారు. కాగా, వరద ముప్పు ఉన్న ఇతర ప్రాంతాల నుంచి 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. రానున్న 24 గంటల్లో కుమామోటో ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జపాన్ సర్కారు పేర్కొంది. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ప్రధాని షింజో అబే టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. కాగా, శుక్రవారం రాత్రి సంభవించిన ఈ ఆకస్మిక వరదల కారణంగా మరణాల చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. కుమామోటో, కాగోషిమా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సమయంలోనే అధికారులు ఇండ్లను ఖాళీ చేయిస్తుండటం, తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారోనని ప్రజలకు తెలియకపోవడంతో ప్రారంభంలో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడటంతో పాటు అక్కడ గందరగోళం నెలకొన్నది.