Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనా భూ భాగాలను బలవంతంగా విలీనం చేసుకునే ప్రణాళికను వదులుకోవాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ ఇజ్రాయిల్ను కోరారు. ఇజ్రాయిల్ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేదిగాను, ఈ ప్రాంతంలో శాంతిని దెబ్బతీసేదిగాను ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్లో మాక్రాన్ మాట్లాడుతూ, ఇజ్రాయిల్ చర్య రెండు దేశాల ఏర్పాటు ప్రతిపాదనకు విఘాతం కలిగించడమే కాక, ఇజ్రాయిలీయులు, పాలస్తీనీయుల మధ్య శాంతి సాధన యత్నాలను నీరుగార్చుతుందని అన్నారు. ఇజ్రాయిల్ చర్య ఏకపక్షమూ, ఇరుదేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఇజ్రాయిల్లోని ఫ్రెంచ్ రాయబారి ఇదివరకే వ్యాఖ్యానించారు. నెతన్యాహు విలీన ప్రణాళికపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాక్రాన్ ఈ ప్రకటన చేశారు. ఈజిప్టు, జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు ఈ వారం ప్రారంభంలో సంయుక్తంగా ఒక ప్రకటన చేస్తూ ఇజ్రాయిల్ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే గాక, శాంతి ప్రక్రియ పునాదులనే ప్రమాదంలో పడేస్తుందన్నారు. గత నెలలో యూరప్కు చెందిన వెయ్యిమందికిపైగా ఎంపీలు ఈ విలీన ప్రక్రియను ఖండిస్తూ సంయుక్తంగా ఒక ప్రకటనపై సంతకాలు చేశారు. ఇది ఇజ్రాయిల్-పాలస్తీనా శాంతి ప్రక్రియకు ఇది మరణశాసనం లాంటిదని వారు విమర్శించారు. జులై 1 నుంచే నెతన్యాహు ఈ విలీన ప్రక్రియను ప్రారంభిస్తానని ప్రకటించినప్పటికీ, అంతర్జాతీయంగాను, దేశీయంగాను వస్తున్న విమర్శలు, ఒత్తిళ్లతో దీనిని పాజ్లో పెట్టారు.