Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్గుయెన్హై ప్రమేయం ఉందని ఆరోపణలున్న ఒక అవినీతి కేసులో స్థానిక కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అమెకు 20 ఏళ్ల జైలు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో పాటుగా 1.7 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. అయితే కోర్టు తీర్పునిచ్చే సమయంలో ఆమె అక్కడ లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ న్యాయస్థానంలో జరిగిన విచారణను ఆమె బహిష్కరించారు. తీర్పుపై తాజాగా స్పందిస్తూ కోర్టులు తనపై పక్షపాతం వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తానే తప్పు చేయలేదని, జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్కు వెళతానని పేర్కొన్నారు. పార్క్గుయెన్హై దక్షిణకొరియాకు 2013-17 మధ్యలో అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ దేశంతో పాటు తూర్పు ఆసియాలోని దేశాల్లోనే అధ్యక్ష్య హోదాలో కూర్చున్న తొలి మహిళగా గుయెన్హై నిలిచారు. అయితే ఈ సమయంలో ప్రభుత్వపరంగా సాయం చేసినందుకుగానూ ఆమెతో పాటు సన్నిహితుడొకరికి బడా వ్యాపారవేత్తల నుంచి భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రజలు పెద్దయెత్తున ఆందోళనలు చేయడంతో 2017లో అమె అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం అధికార దుర్వినియోగం, లంచం తీసుకున్నారన్న కేసులో గుయెన్హైను కోర్టు 2018, ఏప్రిల్లో దోషిగా నిర్ధారించింది. కోర్టు తాజా తీర్పుపై దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బ్లూహౌస్ స్పందించింది. ఈ తీర్పు దేశానికి హృదయ విదారకమైనదని, జ్ఞాపకం లేని చరిత్ర పునరావృతం అవుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది.