Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల మనసుల్లో ఎన్నో భావాలు ఉంటాయి. వాటిని వ్యక్తపరచడానికి మాత్రం అవకాశాలు తక్కువ. అవకాశం దొరికినప్పుడల్లా కొందరు అక్షరాల ద్వారా తమ భావాలను వ్యక్తపరుస్తారు. కొందరు మాటల ద్వారా... మరికొందరు చిత్రాల ద్వారా... అలా చిత్రాల ద్వారా తమ మనసు లోతుల్లోని భిన్న ఆలోచనలను వ్యక్త పరిచే మహిళల కోసం 'కళాంతర్ ఫౌండేషన్' ఏర్పాటు చేశారు సుహానీ జైన్. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 20 మంది మహిళా చిత్రకారులు తమ కళలను అన్లైన్ ద్వారా ప్రచారం చేసుకునేందుకు వేదిక ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్న మహిళల మనోభావాలు ఈ రోజు మానవిలో తెలుసుకుందాం...
కోవిడ్ కారణంగా ప్రత్యేక కార్యకలాపాలు ఏవీ సజావుగా సాగడం లేదు. సాధారణ పరిస్థితుల్లోనే మహిళా చిత్రకారులకు తమ కళను ప్రచారం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. అలాంటిది ఇలాంటి మహమ్మారి విజృంభిస్తున్న కాలంలో మరీ కష్టం. అయితే టెక్నాలజీ పెరిగిన తర్వాత అన్నీ మన చేతుల్లోకే వచ్చేశాయి. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన మహిళల కళను అంతర్జాలం ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేయాలని భావించారు నాగపూర్కు చెందిన సుహానీ జైన్. తను కళాకారుల కోసం ఏర్పాటు చేసిన కళాంతర్ ఫౌండేషన్ ద్వారా మహిళా చిత్రకారులకు ఓ వేదిక ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 2 నుండి అక్టోబర్ 2 వరకు ఈ ఆన్లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నడుస్తుంది.
మానసిక ఆనందం
''సుహానీ స్థాపించిన ఈ కళాంతర ఫౌండేషన్ వర్థమాన కళాకారులకు ఎంతో ప్రోత్సాహ కరంగా ఉంది. ముఖ్యంగా మహి ళలకు ఓ వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా మహిళలు తమ కళను ప్రచారం చేసుకోవడంతో పాటు జీవనోపాధిని కూడా పొందగలుగుతారు. తమ కళను చూసి పది మంది మెప్పు పొందినప్పుడు మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ప్రస్తుత కోవిడ్ కాలంలో ఇది ఎంతో అవసరం. ఆన్లైన్లో జరుగుతున్న ఈ ఎగ్జిబిన్ ఏర్పాట్లు చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది'' అంటున్నారు కళాకారుడు కప్పారి కిషన్.
మొదటి శిల్ప కళాకారిణి
రేణు బాలా... ఓ సమకాలీన యువ కళాకారిణి. పంజాబ్ రాష్ట్రం లోని పఠాన్కోట్ ఈమె సొంత ఊరు. పఠాన్కోట్ జిల్లా లోని మొదటి మహిళా శిల్ప కళాకారిణి ఈమె. ఆమె తన కళ ద్వారా సమాజంలోని మానవ సంబం ధాలను ఎక్కువగా చూపిస్తారు. తన కళాకృతుల ద్వారా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సమాజానికి అందిస్తుం టారు. మనిషి పుట్టిన దగ్గర నుండి తన చుట్టూ ఉన్న సమాజంతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అనే దానిపైనే ఆమె దృష్టి. రెడ్ బింది ద్వారా కూడా ఆన్లైన్లో తన కళాకృతులను ప్రదర్శించి ఎందరి అభిమానాన్నో పొందుతున్నారు.
ప్రకృతే కథా వస్తువుగా
ప్రస్తుతం సింగపూర్లో నివసిస్తున్న అద్భుతమైన చిత్రకారిణి శిల్ప విశ్వనాథన్ అయ్యర్. ఈమె ముంబైలోని రహేజా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి కోర్సు పూర్తి చేశారు. భారతదేశంలో కొంతకాలం సీనియర్ ఆర్ట్ డైరెక్టర్గా అడ్వర్టైజింగ్ ఇండిస్టీలో పని చేశారు. అలాగే ముంబైలో థాంప్సన్ అసోసియేట్స్లో పదేండ్లు పని చేశారు. జానీ వాకర్, గ్లాక్సో స్మిత్క్లైన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొందారు. 2011లో సింగపూర్ వెళ్ళారు. ప్రస్తుతం చక్కటి ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. సింగపూర్లోని నాన్యాంగ్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ నుండి మోడ్రన్ చైనీస్, వెస్ట్రన్ పెయింటింగ్ లో డిప్లామా చేశారు. ప్రకృతికి సంబంధించిన ఎన్నో అంశాలను తన చిత్రకళ ద్వారా ఆమె ప్రచారం చేస్తున్నారు.
మహిళలకు అవకాశాలు తక్కువ
20 మంది మహిళా కారులు ఈ ఆన్లైన్ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారు. ఇందులో పది మంది మహిళలు ప్రత్యేకంగా ప్రస్తుత కళాకారుల ప్రపంచంలో మహిళలకు ఎలాంటి స్థానం ఉంది అనే దానిపై తమ చిత్రాలను గీశారు. మా 'కళాంతర్ ఫౌండేషన్' మహిళా కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2015లో ప్రారంభించాం. అప్పటి నుండి కేవలం మహిళల కోసం ఎన్నో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాం. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలకు పెద్దగా అవకాశాలు దొరకవు. మగవారికి మాత్రం తమ కళను ప్రచారం చేసుకోవడానికి విసృతమైన వేదికలు ఉన్నాయి. ముఖ్యంగా పెండ్లి తర్వాత మహిళలకు బాధ్యతలు పెరిగిపోతాయి. కుటుంబం నుండి సహకారం దొరకదు. తమలోని కళను బయటకు చూపించలేక ఎంతో మంది మౌనంగా ఉండిపోతున్నారు. అటువంటి మహిళలకు ఓ వేదిక ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాను. ప్రస్తుత కోవిడ్ సమయంలో ఈ ఆన్లైన ఎగ్జిబిషన్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను నా చిత్రాలలో మానవ జీవితం గురించి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే మన జీవితం ఎప్పుడైనా ముగిసిపోవచ్చు. అది మన చేతుల్లో లేదు. కాబట్టి బతికినంత కాలం మంచితనంతో, ఆనందంతో ఉండాలి అనేది నా చిత్రాల ద్వారా చెబుతుంటాను. భవిష్యత్ ఎలా ఉంటుందో అనే ఆందోళన లేకుండా ఈరోజు ఎలా గడుపుతున్నాం అనేది ముఖ్యం అని నా ఆలోచన. ప్రస్తుతం నడుస్తున్న ఆన్లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్కి 'రెడ్ బింది' అని పేరు పెట్టాం. తెలంగాణ, యుపీ, ఎంపీ, బీహార్, పంజాబ్, పూనే వంటి రాష్ట్రాలతో పాటు బెల్జియం, సింగపూర్ వంటి విదేశాల నుండి కూడా కళాకారులు పాల్గొన్నారు. వీరిలో ఎంతో మంది సీనియర్ కళాకారులు కూడా ఉన్నారు. కళాంతర్ ఫేస్బుక్ పేజ్ ద్వారా వీటిని ప్రచారం చేస్తున్నాం.
- సుహానీ జైన్, కళాంతర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
మంచి వేదిక ఇది
ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఎవ్వరికీ బయటకు వెళ్ళే అవకాశం లేదు. ఇలాంటప్పుడు ఆన్లైన్ ఎగ్జిబిషన్ బాగా ఉపయోగపడుతుంది. కళాంతర్ ఫౌండేషన్ ఈ బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కేవలం మహిళల కోసమే 'రెడ్ బింది' పేరుతో ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. సుహానీ జైన్ దీనికి బాధ్యత తీసుకున్నారు. చిన్న వయసులోనే ఆమె మంచి ఆలోచన చేశారు. మహిళలకు ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ. కోవిడ్ కాలంలో అయితే మరీ కష్టం. ప్రస్తుత ఖాళీ సమయంలో చిత్రాలు వేసి ఎలా ప్రచారం చేసుకోవాలో తెలియక మౌనంగా ఉంటున్నారు. అలాంటి వారికి ఈ ఆన్లైన్ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో నా చిత్రాలను కూడా ప్రదర్శించడం ఆనందగా ఉంది. ప్రస్తుత జనరేషన్తో పాటు ఓ సీనియర్ ఆర్టిస్టుగా పాల్గొనడం సంతోషంగా ఉంది. జెఎన్యుఎప్ఏయు (ఫైన్ ఆర్ట్స్) కాలేజీలో ప్రొఫెసర్గా, హెచ్ఓడీగా పని చేసి రిటైర్ అయ్యారు. నా చిత్రాలలో గిరిజన మహిళ జీవితాన్ని చూపించాను. ఇంటిని, పిల్లల్ని వదిలిపెట్టా మగవారితో సమానంగా మహిళలు శ్రమిస్తారు. కానీ వేతనాల్లో మాత్రం తేడా ఉంటుంది. దాన్ని చూపించాలనే ఉద్దేశంతో దీన్ని గీశాను. అలాగే పేరంటం చేసే మహిళలను చూపించాను. ఇప్పటిలా అప్పట్లో కిట్టీ పార్టీలు లేవు. మహిళలందరూ ఒక దగ్గర కలిసి తమ భావాలను పంచుకోవడానికి గతంలో ఇలాంటి పేరంటాలే ఉపయోగపడేవి. బల్కానిలో ఓ మహిళ కూర్చున్న చిత్రాన్ని కూడా గీశాను. ఒక్కరమే బయట కూర్చున్నప్పుడు, ప్రకృతితో లీనమైనపుడు మనసుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అందుకే ప్రకృతిని ఎక్కువగా చిత్రీకరిస్తాను.
- అంజనీరెడ్డి, హైదరాబాద్