Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒక మహిళ టీ బ్యాగ్ లాంటిది.. టీ బ్యాగ్ను వేడి నీటిలో వేసే వరకు దాని శక్తి ఏమిటో తెలియదు. అలాగే మహిళ కూడా...'' అంటారు యుఎస్ మాజీ ప్రధమ మహిళ ఎలియనోర్ రూజ్వెల్ట్. హిమబిందు జీవితానికి ఇది సరిగ్గా సరి పోతుంది. ఆమెను అంతం చేయడానికి అత్త మామలు మూడుసార్లు ప్రయత్నించారు. ఎదురైన ప్రతి కష్టంతో ధైర్యంగా పోరాడి ఓ ప్రతిష్టాత్మకమైన కళాకారిణిగా ఎదిగారు. దాని కోసం ఎన్నో అసమానతలను అధిగమించారు. ప్రస్తుతం కాఫీ వ్యర్థాలతో అద్భుతమైన చిత్రాలను సృష్టిస్తున్న ఆమె జీవితం గురించి ఈ రోజు తెలుసుకుందాం...
మూడు సార్లు ప్రయత్నించారు
యాభై ఏండ్ల హిమ బిందు అసమానతల నడుమ తన మనుగడ సాగిస్తున్నారు. ఆమె పుట్టినప్పుడు తల్లిదండ్రులు, తాతలు ఆడపిల్ల పుట్టిందని నిరాశ చెందారు. హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుండి కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత పై చదువు కొనసాగించాలని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆమె విజ్ఞప్తిని ఎవ్వరూ పట్టించుకోలేదు. చదువు కోవాలనే ఆమె ఆశలపై నీళ్ళు చల్లారు. 22 ఏండ్ల వయసులో యుఎస్లో ఉండే ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె కలలు, కోరికలు, ఆలోచనలకు ఏమాత్రం విలువ ఇవ్వని కుటుంబంలో వచ్చి పడ్డారు. దానికి తోడు గృహహింస. పెండ్లయిన తొమ్మిది నెలలకే ఆమెను చంపడానికి అత్తమామలు చేసిన మూడు ప్రయత్నాల నుండి బయటపడ్డారు. అక్కడి నుండి ఎలాగో తప్పించుకుని భారతదేశానికి తిరిగి వచ్చి తల్లిదండ్రుల వద్దకు చేరారు.
భవిష్యత్ ఏమిటో తెలియదు
తను పడిన కష్టాల నుండి ఎన్నో అనుభవాలను నేర్చుకున్నారు హిమబింది. ''అక్కడ నాకు అయిన కొన్ని గాయాలు నయమ యాయ్యాయి. కొన్ని ఇప్పటికీ అలాగే ఉన్నాయి'' అంటారు ఆమె. ఆ చేదు అనుభవాలను పక్కకు నెట్టేసి ముందుకు సాగాలని నిశ్చయించుకున్నారు. దాని కోసం ముందు తన చదువు కొనసాగించాలని భావించారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా చేశారు. తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ చేసి జర్మనీకి చెందిన ఎంఎన్సీ కంపెనీలో అసోసియేట్గా ఉద్యోగం సంపాదించారు. అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో బాధ్యతలు చూశారు. రెండు ఎంఎన్సీలలో 25 సంవత్సరాల పాటు పని చేసి తన కార్పొరేట్ కెరీర్లో హిమ ప్రతిష్టాత్మక సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డులను దక్కించుకున్నారు.
వ్యక్తిత్వంపై నిందలు వేస్తారు
''నేను ఒక పని రాక్షసిని. పని చేయడమంటే చాలా ఇష్టం. మన సమాజం దయకలిగినదే. కానీ మనపై జాలి చూపించదు. ఒక మహిళ తన ఉద్యోగంలో విజయాన్ని సాధించినప్పుడు ఆమె గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ముందుగా ఆమె వ్యక్తిత్వంపై నిందలు వేస్తారు. మగ అధికారుల కోర్కెలు తీర్చి నేను ఈ స్థాయికి వచ్చానని కొందరు నా గురించి మాట్లాడుకుంటారు'' అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె తన సహోద్యోగులతో స్నేహం చేయడానికి ప్రయత్నించింది. కానీ అది కూడా సాధ్యపడలేదు.
కార్పొరేట్ ప్రపంచం నుండి కళల వైపుకు
ఆమె సంస్థలో తన ప్రత్యేక హక్కు కార్డు ద్వారా సిఎస్ఆర్ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఎయిడ్స్ రోగులు, కంటిచూపు లేని పిల్లలతో కొవ్వొత్తులు, కాగితపు సంచులను తయారు చేయించేవారు. ఒకసారి వేసవి శిక్షణా శిబిరంలో పెయింటింగ్ పట్ల తనకున్న చిన్ననాటి అభిరుచిని మొదలుపెట్టారు. సాధారణంగా పెయింట్ కోసం వాడే పదార్థాలలో కిరోసిన్, లిన్సీడ్ నూనె నుండి వచ్చే తీవ్రమైన వాసన వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే హిమ అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాఫీ వ్యర్థాల నుండి తయారు చేసే కషాయాలతో పెయింటింగ్ ప్రారంభించారు. అప్పటి నుండి ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.
ప్రపంచ సదుస్సులో ప్రాతినిధ్యం
2017లో హిమబిందు ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆమె శరీరం కన్నా కాళ్ళూ, చేతులు ఎక్కువ పరిమాణాన్ని కలిగి ఉన్నాయని, ఇది చాలా ప్రమాదమని న్యూరో సర్జన్ హెచ్చరించారు. అప్పటి నుండి కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి ఓ మంచి ఉద్దేశంతో పెయింటింగ్ కోసం తన సమయాన్ని కేటాయించారు. ఆసియాలోనే మొట్టమొదటి మహిళా కాఫీ టేస్టర్ సునాలిని మీనన్ సహాయంతో హిమబిందు తనలోని నైపుణ్యాలను చిత్రీకరించడం ప్రారంభించారు. 2020 ప్రపంచ కాఫీ సదస్సులో కాఫీ పెయింటింగ్స్ ద్వారా భారతదేశ కళ, సంస్కృతికి ప్రాతినిధ్యం వహించాలని కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమెను కోరింది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇది ఆలస్యమయింది. కాఫీ వ్యర్థాలతో ఆమె తయారు చేసిన టాంజోర్ స్టైల్ పెయింటింగ్స్ రూ .50 నుంచి రూ .50 వేల మధ్య అమ్ముడవుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి నెలలో హిమా కళలు, భాషపై ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు.
మరింత బలంగా...
జీవితంలో కష్టాలు అనుభవించడం హిమకు కొత్తేమీ కాదు. అయితే ఎదుర్కొన్న ప్రతి సమస్య ఆమెను మరింత బలంగా తయారు చేసిందనడంలో సందేహమే లేదు. కళలు, భాషకు సంబంధించిన క్లాసులు బోధించడం, తను గీసే చిత్రాల గురించి ఆలోచించడం మధ్య ఆమె తన సమయాన్ని విభజించుకున్నారు. దీని కోసం ఆమె మంచి జీతం, మరెన్నో ప్రోత్సాహకాలు ఉన్న కార్పొరేట్ ఉద్యోగాన్ని కోల్పోయారు. ఏదేమైనా ఒక కళాకారిణిగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నందుకు మాత్రం ఆమె చాలా సంతోషంగా ఉన్నారు.
బలమైన స్త్రీ నన్ను పెంచింది
ఆమె ఇటీవలి గీసిన చిత్రాలలో ఒకటి దుర్గాదేవి. ఆమె దానిని తన తల్లి, రిటైర్డ్ ప్రొఫెసర్ లీలా కుమారికి అంకితం చేశారు. ఎప్పుడైనా జీవితంపైన విరక్తి కలిగినప్పుడు హిమబిందుకు తన తల్లి తన కండ్ల ముందు కనిపిస్తుందని, అలాంటి ఆలోచనలతో పోరాడి జీవితాన్ని నెట్టుకు రావడం తల్లి తనకు నేర్పించిందని ఆమె అంటారు. చేసే పనిలో సవాళ్ళు ఎదురైనప్పుడు ఆమె తల్లి ఇలా సలహా ఇచ్చేది ''ఏనుగు నడిచినప్పుడు కుక్కలు మొరుగుతాయి. అప్పుడు దాని విలువ ఏమీ తగ్గదు. అలాగే మనం కూడా. మన లోని శక్తి మనం తెలుసు కోవాలి''.
ఓ సందర్భంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రేక్షకుల నుండి వచ్చిన ఓ ప్రశ్నకు హిమా సమాధానం చెబుతూ జీవితం అనేది అంత సులభమైనది కాదంటారామె. ముఖ్యంగా విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలను సమాజం టార్గెట్ చేస్తుందంటారు. వీటన్నింటినీ ఎదుర్కొని ఈరోజు తను విజయం సాధించారంటే ఆమె ఓ బలమైన స్త్రీ చేతుల్లో పెరగడమే.