Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే మహిళా మణిపూసలు ఎందరో బయటకు వస్తారు. స్త్రీ కేవలం ఇంటికే పరిమితమైన రోజుల్లోనే ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన్నవారు ఉన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాలను త్యాగం చేసినవారున్నారు. వివక్ష, దోపిడీ లేని సమసమాజం కోసం దశాబ్దాలుగా కృషి చేస్తున్న వామపక్ష ఉద్యమంతో మమేకమై పని చేసినవారున్నారు. అలాంటి వారిలో సుహాసిని ఒకరు. కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా ఉన్న మొట్టమొదటి భారతీయ మహిళ ఈమె. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్భవించి 100 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఆ నిప్పు కణిక గురించి మరిన్ని విశేషాలు.
సుహాసిని ఓ ఉద్యమకారిణి... ఓ గాయని.. ఓ నర్తకి... ఓ కవి. ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్ట్ ఎడ్గార్ స్నో 'ది రివోల్ట్ ఆఫ్ ఇండియా ఉమెన్' అనే వ్యాసంలో తాను చూసిన అత్యంత అందమైన మహిళ గా ఈమెను అభివర్ణించారు. అన్నింటి కంటే గొప్ప విషయం ఏమిటంటే కమ్యూ నిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలి గా చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ సుహాసిని నంబియార్ నీ చటోపాధ్యాయ. చైనా సంద ర్శించేందుకు మావో నుండి ఆహ్వానం అందుకున్న అతి కొద్దిమందిలో సుహాసిని ఒకరు. భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోనే ఇది అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.
ఈ ప్రపంచానికి తెలియదు
సుహాసిని ఉద్యమ జీవితం గురించి చాలా మందికి తెలియదు. ''ఈమె గురించి వివరాలను తెలుసుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని'' అని రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వప్పాలా బాలచంద్రన్ అన్నారు. ఈయన రచించిన 'ఎ లైఫ్ ఇన్ షాడో: ది సీక్రెట్ స్టోరీ ఆఫ్ ఎసిఎన్ నంబియార్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని చెప్పారు. ''ఆమెను కలుసుకున్న వారెవరైనా ఆమె తెలివితేటలకు, అందానికి, వ్యక్తిత్వానికి ముగ్ధులైపోవాల్సిందే. అయితే మీరు కేవలం ఆమె శారీరాన్ని మాత్రమే చూసినట్లయితే ఆమెలో మీకు ఏదీ కనిపించకపోవచ్చు'' అని ది వీక్ పత్రికతో బాలచంద్రన్ పంచుకున్నారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో ప్రత్యేక కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఈయన సుహాసిని జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సేకరించారు.
హైదరాబాద్లో పుట్టారు
సుహాసిని 1901లో హైదరాబాద్లో ఓ ప్రముఖ బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఎనిమిది మంది పిల్లలలో ఈమె అందరికంటే చిన్నది. సుహాసిని తండ్రి అఘోర్ నాథ్, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవ్యక్తి. అలాగే ప్రఖ్యాత శాస్త్రవేత్త. హైదరాబాద్ కాలేజీకి ప్రిన్సిపాల్గా కూడా పని చేశారు. ఆమె తోబుట్టువులు అందరూ వివిధ రంగాలలో నిష్ణాతులుగా గుర్తింపు పొందారు. వారందరిలో అత్యంత ప్రసిద్ధులు సరోజిని నాయుడు. 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈమె అన్న వీరేంద్రనాథ్ (చాటో) దేశంలో బ్రిటిష్ వారితో పోరాడటానికి అంతర్జాతీయ మద్దతు ఎంతో అవసరమని నమ్మిన విప్లవాత్మక స్వాతంత్య్ర సమర యోధుడు.
నంబియార్ తో పరిచయం
17 ఏండ్లు వయసు వచ్చేసరికి సుహాసిని జీవితం మారిపోయింది. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ అడాల్ఫ్ హిట్లర్ను కలవడానికి వెళ్ళినపుడు ఓ యువ జర్నలిస్టు కూడా ఉన్నాడు. ఆయన ఎ.సి.ఎన్. నంబియార్. ఆ సమయంలోనే సుహాసిని ఆయన్ను కలుసుకున్నారు. మలయాళంలో షార్ట్ స్టోరీలు రాయడం మొదలుపెట్టిన మొదటి కథా రచయిత వెంగాయిల్ కునిÛరామన్ నాయనార్ కుమారుడు ఈ నంబియార్. ఆయనకు ఇందిరా గాంధీతో కూడా గొప్ప సంబంధాలు ఉండేవి. 1955 నుండి 1958 వరకు జర్మనీకి భారత రాయబారి గా పని చేసిన నంబియార్ పద్మ భూషణ్ అవార్డు కూడా అందుకున్నారు.
వివాహం.. ఆక్స్ఫర్డ్ లో చదువు
చెన్నైలో వీరిద్దరూ కలుసుకునే నాటికి నంబియార్ యువ న్యాయవాది. ఇద్దరూ ఎంతో ప్రతిభావంతులు. ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఏర్పడింది. నంబియార్ కుటుంబ ఇష్టానికి విరుద్ధంగా వీరి వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే ఈ జంట 1919లో లండన్కు వెళ్ళిపోయారు. అక్కడకు వెళ్ళిన తర్వాత సుహాసిని పై చదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిట ీలో చేరారు. నంబియార్ జర్నలిస్టుగా పనిచేయడం ప్రారంభించారు. అక్కడే రెండేండ్లు గడిచిన తర్వాత బెర్లిన్కు మారారు. అక్కడ ఆమె జర్మన్ స్టడీస్ కోసం బెర్లిన్ యూనివర్సిటీలో చేరగా, నంబియార్ జర్నలిస్టు వృత్తిని కొనసాగించారు. సుహాసిని అనువాదాలు చేస్తూ జర్మన్లకు ఇంగ్లీష్ కూడా నేర్పించేవారు.
గాంధేయ ఆలోచనలను వదిలిపెట్టి
అప్పట్లో బెర్లిన్లోని రాజకీయ వాతావరణానికి ఈమె ప్రభావితులయ్యారు. అక్కడి రాజకీయాలు సుహాసిని జీవితాన్ని పూర్తిగా మార్చి వేశాయని చెప్పవచ్చు. మెల్లమెల్లగా గాంధేయ ఆలోచనలను వదిలేసి వామపక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటికే ఆమెకు ఎంతో స్ఫూర్తిదాయకమైన అన్న ప్రభావం కూడా పడింది. అలాగే బ్రిటిష్ రచయిత సోమెర్సెట్ మామ్ రచించినటువంటి ఓ చిన్న కథ 'గియులియా లాజారీ'లోని ఓ పాత్రకు ఎంతో ప్రభావితం చెందారు. మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించు కున్నారు. సోవియట్ యూనియన్ ఆసియా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈస్ట్రన్ విశ్వ విద్యాలయంలో చేరడానికి బయలుదేరారు. అప్పటి నుండి కమ్యూనిస్ట్ భావ జాలం ఆమెలో నిండి పోయింది. దాంతో బెర్లిన్ కు రావడం బాగా తగ్గిపో యింది. అదే సమయంలో సుహాసిని చైనా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితురాలయ్యారు.
దేశానికి తిరిగి వచ్చి...
కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 1928లో ఆమె తిరిగి భారదేశానికి వచ్చారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఈమెకు అప్పగిం చారు. అప్పట్లో భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం చాలా బలహీనంగా ఉందని కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అభిప్రాయ పడింది. ఆ సమయంలో నంబియార్ బెర్లిన్లోనే ఉండి పోయారు. అప్పటినుండి బొంబాయిలో ఆమె కమ్యూనిస్ట్ ఉద్యమా నికి కేంద్ర బిందువుగా మారారు. మీరట్ కుట్ర కేసులో అరెస్టయిన వారికి సహాయం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. అలాగే 'ది లిటిల్ బ్యాలెట్ గ్రూప్ అండ్ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్'లో చురుకైన పాత్ర పోషించారు. ఆమె నాయకత్వంలో ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. అవి విశేషమైన ప్రజాదరణ పొందాయి. అలాగే ఈమె కమ్యూ నిస్ట్ పార్టీకోసం 'ది న్యూ స్పార్క్' ప్రచురించడం ప్రారంభించారు.
కోలుకోలేని మానసిక దెబ్బ
అప్పటికి నంబియార్ బెర్లిన్లోనే ఉండిపోయారు. భర్త తన జర్మన్ సెక్రటరీకి దగ్గరవుతున్నాడని తెలియక సుహాసిని భారతదేశానికి రావాలని ఆరు సంవత్సరాల పాటు ఉత్తరాలు రాస్తూనేఉన్నారు. చివరకు నంబియార్తో ఆమె వివాహబంధం ముగిసిపోయింది. ఆమె మనసుకు అత్యంత బాధ కలిగించిన సంఘటన ఇది. ''నంబియార్, సుహాసినిలు అసాధారణమైన జంట'' అంటారు బాలచంద్రన్. ''నంబియార్ వామపక్ష భావ జాలం కలిగిన వ్యక్తిగా ఉండడం కంటే జర్నలిస్టుగా ఉండటానికే ఇష్టపడ్డారు. సుహాసిని మాత్రం వామపక్ష ఉద్యమంలో మునిగిపోయారు. ఎవరి భావాలకు వారు కట్టుబడి చివరికి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. సుహాసిని సన్నిహితులు కొందరు చెప్పిన ప్రకారం భర్త నుండి విడిపోయిన తర్వాత మానసికంగా కోలుకోలేక పోయారని అంటారు. కానీ ఆమె తన బాధని ఉద్యమంలో మాత్రం ఎప్పుడూ చూపించలేదు. తన వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితంపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డారు. 1938లో కవి, ట్రేడ్ యూనియన్ కార్యకర్త అయిన ఆర్.ఎం.జంభేకర్ను వివాహం చేసుకున్నారు.
కెప్టెన్ లక్ష్మీసెహెగల్ కు రాజకీయ గురువు
''మొట్టమొదటి భారతీయ మహిళా కమ్యూనిస్టు అయిన సుహాసిని తన విశిష్టమైన జీవితంలో వివిధ కోణాలను కలిగి వున్నారు'' అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిని అలీ అన్నారు. ''నేను ఆమెను కలిసినప్పుడు నిత్యం సామాజిక కార్యక్రమాల్లో, లోతైన రాజీకీయ అవగాహన కలిగిన వ్యక్తిగా అనిపించారు. మా అమ్మ కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ కూడా సుహాసిని స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా, తన మొదటి రాజకీయ గురువుగా చెబుతారు'' అంటున్నారు సుభాషిని ఆలీ. ఆమె చెప్పిన ప్రకారం స్వచ్ఛంద సంస్థ, న్యూ వర్క్ సెంటర్లో సుహాసిని చివరి వరకు చురుగ్గా ఉండేవారని అన్నారు. 1950 చివరి వరకు సుహాసిని రాజకీయాల్లో ఉన్నారు. 1960లలో జరిగిన రాజకీయ మార్పులను అంగీకరించలేకపోయారు. క్రమంగా రాజకీయా లకు దూరమయ్యారు. తర్వాత కొంత కాలానికే ఆమె ఆరోగ్యం క్షీణించి వీల్ చైర్కు పరిమితమయ్యారు. 1973లో బొంబాయిలో ఆమె తన తుదిశ్వాస విడిచారు.