Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జహ్నాబీ గోస్వామి... 18 ఏండ్ల వయసులో భర్త వల్ల హెచ్ఐవి సోకింది. ఈ వ్యాధి కారణంగా తన రెండేండ్ల బిడ్డను కూడా పోగొట్టుకుంది. ఇక ఆమె బతికేది కేవలం మూడు నెలలు మాత్రమే అని డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పుడు ఆమె వయసు 44 ఏండ్లు. హెచ్ఐవితో తను పోరాడుతూ.. ప్రాణాలు కాపాడుకుంటూ ఓ సంస్థను స్థాపించి ప్రజల్లో వ్యాధిపై అవగాహన కార్యక్రాలు నిర్వహిస్తుంది. ఆమె స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో...
1993లో జహ్నాబీ గోస్వామి హెచ్ఐవి బారిన పడింది. తను వ్యాధికి గురైన ఇరవై ఏడు సంవత్సరాల తరువాత ఆమె భారతదేశంలో హెచ్ఐవి/ ఎయిడ్స్ పై అవగాహన పెంచుతుంది. వాస్తవానికి మన దేశం ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో పెద్దగా పురోగతి సాధించలేదనే చెప్పాలి. సరైన వైద్యం లేని ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం. ఇలాంటి వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యక్తులపై, సంస్థలపై ఉంది. అలాంటి ఓ గొప్ప కార్యక్రమాన్నే చేపట్టింది జహ్నాబీ. ఇలాంటి గొంతులు బయటకు రావడం నిజంగా ఆనందించవలసిన విషయం.
మొట్టమొదటి మహిళ
సాధారణంగా హెచ్ఐవీ బారిన పడిన వారు తమకు వ్యాధి సోకిందని చెప్పుకోడానికి చాలా ఇబ్బందిపడతారు. బయటకు తెలియకుండా జాగ్రత్తపడతారు. ఇక మహిళల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంటుంది. అలాంటిది ఈశాన్య భారత రాష్ట్రాలలోనే తనకు హెచ్ఐవి పాజిటివ్ అని బహిరంగంగా చెప్పుకున్న మొట్ట మొదటి మహిళ జహ్నాబీ. ఈమె 'అస్సాం నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్'(ఎఎన్పిపి) వ్యవస్థాపకురాలు. అలాగే ''ఇండియన్ నెట్వర్క్ ఫర్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి/ఎయిడ్స్'' సంస్థకు మొదటి మహిళా అధ్యక్షురాలు.
వివక్ష చూపుతున్నారు
''మనం స్వరం పెంచి మాట్లాడడం వల్ల మనపై పడిన కళంకం మాయమైపోతుంది. హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై మన చుట్టూ ఉన్న సమాజం చూపిస్తున్న వివక్ష వారి జీవితాలకు సామాజికంగా, ఆర్థికంగా హాని చేస్తుంది'' అంటుంది ఆమె. వ్యాధి సోకడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని, సామాజికంగా దూరంగా ఉండాల్సి వస్తుందని జహ్నాబీ చెబుతుంది. యజమానుల్లో చాలామంది తమ ఉద్యోగస్తులకు హెచ్ఐవి సోకిందని తెలిసిన తర్వాత పనికిరాని కారణాలు చెప్పి ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారనీ, ఉండేందుకు ఇళ్ళు అద్దెకు కూడా దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అంటుంది. 27 సంవత్సరాల కిందట జహ్నాబీకి కూడా హెచ్ఐవి ఉన్నట్టు నిర్ధారణ అయినప్పుడు అస్సాంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.
వ్యాధిని దాచిపెట్టి
అస్సాంలోని నాగావ్ జిల్లాలోని కంపూర్లో పెరిగింది జహ్నాబీ. రాజకీయ నాయకుడైన ఆమె తండ్రి హిరణ్య గోస్వామిని ఉగ్రవాదులు హత్య చేశారు. నవంబర్ 27, 1993న ఆమెకు హెచ్ఐవి ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడు నెలలు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. పెండ్లికి ముందే అతనికి హెచ్ఐవి ఉందని తెలిసినా విషయం దాచిపెట్టి పెండ్లి చేశారు. దాంతో తన రెండేండ్ల కస్తూరిని ఆమె పోగొట్టుకుంది.
అమ్మ ఇచ్చిన ధైర్యంతో
వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆమె తన పుట్టింటికి తిరిగి వచ్చింది. అప్పటి నుండి జహ్నాబీ తన తల్లికి అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉండేది. ''అమ్మ ప్రేరణ లేకుండా నేను ఈ రోజు ఇలా నిలబడగలిగేదాన్ని కాదు. అమ్మ నాకేంతో ధైర్యాన్ని చెప్పింది. అది చెయ్యి, ఇది చెయ్యెద్దు అని నాకు పరిమితులు పెట్టలేదు. పైగా ఇకపై నేను ఈ సమాజంలో జహ్నాబీలను చూడదలచుకోలేదు'' అంటూ నిత్యం అనే తన తల్లి మాటలను ఆమె గుర్తు చేసుకుంది.
సామాజిక వివక్షపై పోరాడాలి
ప్రారంభంలో ఆమె తన తల్లి కోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది. కానీ సమాజంలో ఎయిడ్స్పై అవగాహన పెంచడం ఎంత అవసరమే చాలా త్వరగానే తెలుసుకుంది. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. 2004లో ఆమె 'అస్సాం నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్' అనే సంస్థను స్థాపించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో వ్యాధికి సంబంధించిన వివిధ అంశాలను, నివారణ, వ్యాధి బారిన పడిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. తన కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రభుత్వ అధికారులను కూడా కలిసేది. బాగా చదువుకున్న వారు, మత పెద్దలు, కొన్ని సామాజిక సంస్థలు సైతం హెచ్ఐవి సోకిన వారి పట్ల అసహనంతో ఉండడం ఆమె గమనించింది. ఇటువంటి ప్రవర్తన సరైనది కాదని వ్యాధితో బాధపడే వారు ముందు సామాజిక వివక్షపై పోరాడేందుకు ముందుకు రావాలని ఆమె అభిప్రాయపడుతుంది.
రాజకీయ ప్రచారానికి వేదిక కాకూడదు
వ్యాధిపై అవగాహన పెంచడానికి ప్రవేశపెట్టిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అర్థం భారతదేశంలో మారిపోయిందని ఆమె అభిప్రాయం. ''నేను ఆ రోజును ఎయిడ్స్ అవగాహన దినోత్సవంగా అంగీకరించలేను. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వం జరుపుకునే పండుగగా మాత్రమే మారింది. ఆరోజు మంత్రులు, ప్రముఖులను ఆహ్వానించి వేడుకలా జరుపుకోవడం వల్ల వ్యాధి సోకిన వారికి ఎలాంటి ఉపయోగం లేదని నా అభిప్రాయం. నాకు ప్రతి రోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవమే. నా ఉద్దేశంలో ఈ దినోత్సవాన్ని రాజకీయ ప్రచారం కోసం జరుపుకోకూడదు. ముందు ఇలాంటి పద్ధతుల్లో మార్పు రావాలి. అప్పుడే ఈ దినోత్సవానికి అసలైన అర్థం'' అంటుంది ఆమె.
సెక్స్ విద్యపై అవగాహన పెంచాలి
కొన్ని సంవత్సరాల కిందట జహ్నాబీ హెచ్ఐవితో జీవిస్తున్న 14 ఏండ్ల బాలికను కలిసింది. ఆ బాలికకు ఈ వ్యాధి ఎలా వచ్చిందో కారణం తెలియదు. అప్పటి వరకు ఆమెకు ఎలాంటి రక్త మార్పిడి జరగలేదు, తల్లిదండ్రులు ఇద్దరికీ హెచ్ఐవి రికార్డు లేదు. ఆ బాలిక లైంగిక వేధింపులకు గురైన తర్వాత వ్యాధి సంక్రమించినట్టు జాహ్నాబీకి అర్థమయింది. ఆమె చేపట్టిన కేసుల్లో ఇదెంతో ప్రధానమైనదిగా ఆమె చెబుతారు. అందుకే ఆమె 'ఇండియన్ నెట్వర్క్ ఫర్ పీపుల్'కు అధ్యక్షురాలిగా ప్రస్తుతం సెక్స్ విద్యను ప్రోత్సహించడం ప్రధాన పరిష్కారాలలో ఒకటి అని అంటుంది.
చికిత్సా కేంద్రాలు పెంచాలి
మన దేశంలో ఎన్నో చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. అలాగే హెచ్ఐవి బాధితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినవి కూడా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడడం లేదు. అందుకే పాఠశాల పాఠ్యాంశాల్లో లైంగిక విద్యను తప్పనిసరి అంశంగా మార్చాలని జహ్నాబీ కషి చేస్తోంది. ఇది కేవలం కౌమారదశకు మాత్రమే కాదు నాలుగు, ఐదవ తరగతుల విద్యార్థుల నుంచే ఈ విద్యను చేర్చడం అత్యంత అవసరం. మన దగ్గర వ్యాధి చికిత్సకు ఇస్తున్న ప్రాముఖ్యతను గమనిస్తే ఇదొక ఆందోళన కరమైన విషయంగా కనిపిస్తుంది. ప్రతి జిల్లాలో రోగులకు అవగాహన కల్పించేందుకు ఒక చికిత్సా కేంద్రం తప్పని సరిగా ఉండాలి. ఎందుకంటే పేదలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళడం అనేది సాధ్యం కాదు.
యూటూబ్ ఛానెల్
''అధికారులు, రాజకీయ నాయకులు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వారు వారి అధికారాన్ని చూసుకుని అహంకారంతో వ్యవహరిస్తుంటారు. పైగా వాళ్ళకు ఎన్నో రకాల బాధ్యతలు ఉంటాయి. ఇటువంటి వారి సమస్యలు వినడానికి, వాటిని పరిష్కరించడానికి వాళ్ళకు సమయమే దొరకదు'' అని ఆమె నొక్కి చెబుతుంది. హెచ్ఐవితో జీవిస్తున్న వారి కుటుంబాలకు ఎన్నో రకాల సందేహాలు వస్తుంటాయి. వాటన్నింటినీ జహ్నాబీ నివృత్తి చేస్తుంది. అలాగే చికిత్స, వ్యాధి దుష్ప్రభావాలకు సంబంధించిన సాధారణ సందేహాలు తీర్చేందుకు, వారికి ఎదురయ్యే ప్రశ్నలను పరిష్కరించడానికి 'హెచ్ఐవి పాజిటివ్' అనే యూటూబ్ ఛానెల్ను కూడా ఆమె ప్రారంభించింది. అంతేకాక ఆమె తన వ్యక్తిగత అనుభవంతో వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంపై కూడా దృష్టి పెడుతుంది.