Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్లో జరిగిన ఓ దీపావళి పార్టీలో కలుసుకున్న ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఓ వ్యాపార ఆలోచనకు దారితీసింది. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడం తల్లిదండ్రులకు ఇప్పుడు అతి పెద్ద సవాల్గా మారిపోయింది. దానికి ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొన్నారు వీరిద్దరూ. పిల్లలకు నాణ్యమైన చిరుతిండిని అందిస్తూ వారూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న వారి ప్రయాణం గురించి నేటి మానవిలో...
శౌరవి మాలిక్, మేఘన నారాయణ్, ఉమాంగ్ భట్టాచార్య ప్రారంభించిన స్లర్ప్ర్ ఫామ్ పిల్లలు ఇష్టపడే ఆహారపదార్థాలను తయారు చేస్తుంది. వీటిని తృణ ధాన్యాల ద్వారా తయారు చేసి పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రాభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ మూడు శాతం వృద్దిని సాధించారు. శౌరవి మాలిక్, మేఘనా నారాయణ్ తమను తాము ఈ స్లర్ప్ర్ ఫామ్ సంస్థకు వ్యవస్థాపకులుగా భావించరు. ఆ సంస్థ కోసం పని చేసే వర్కర్లుగానే అనుకుంటారు. ఎందుకంటే ఫామ్లో వారు ఎక్కువ సమయం గడుపుతారు, నాణ్యమైన ఆలోచనలను ఆచరణలో పెడుతూ పట్టుదలతో ముందుకు వెళుతున్నారు.
మార్కెట్ ప్రభావంతో...
ఆ ఇద్దరు స్నేహితులు కలిసి అక్టోబర్ 2016లో స్లర్ప్ర్ ఫామ్ను ప్రారంభించారు. దీన్ని ప్రారంభించక ముందు వారు గమనించిన విషయం ఏమిటంటే చాలా సూపర్ మార్కెట్లలో పిల్లల కోసం గోధుమలు, బియ్యంతో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే నిల్వ చేసి అమ్ముతున్నారు. వీటిలో కొవ్వు, చక్కెర వంటి ప్రమాదకరమైనవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి పిల్లల ఆరోగ్యానికి ఎట్టిపరిస్థితుల్లోనూ మంచివికావు. ''తృణధాన్యాల వంటి మంచి ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు పండే మన దేశంలో ఇలాంటి చెడు ప్రభావాలు చూపే ఆహారాన్ని మన పిల్లలకు పెట్టడం ఘోరమైన విషయం. ముఖ్యంగా వీటిపై మార్కెట్ ప్రభావం తీవ్రంగా ఉంది'' అని మేఘనా అంటున్నారు.
మూడు శక్తుల కలయిక
మేఘన... బెంగళూరులో పెరిగింది. ఈమె జాతీయ స్థాయి ఈత పోటీల్లో కూడా పాల్గొంది. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి రోడ్స్ స్కాలర్షిప్ సైతం అందుకుంది. తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తి చేసి ఏడు సంవత్సరాలు మెకిన్సేలో పనిచేసింది.
శౌరవి... న్యూఢిల్లీలో పెరిగింది. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ఆర్థికశాస్త్రం పూర్తి చేసింది. ఆ తర్వాత జెపి మోర్గన్ అనే ఫైనాన్స్ సంస్థలో కన్జూమర్, హెల్త్కేర్, రిటైల్ అడ్వజరీ బృందంతో కలిసి పనిచేసింది. అలాగే లండన్లోని వర్జిన్ గ్రూప్లో సర్ రిచర్డ్ బ్రాన్సన్ గ్రూప్ హోల్డింగ్ ఎంటిటీలో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కూడా చేసింది. స్లర్ప్ర్ ఫామ్ ఏర్పాటులో వీరిద్దరితో పాటు సృజనాత్మకంగా ఆలోచించగలిగే ఉమాంగ్ భట్టాచార్య కూడా వీరితో చేరింది. ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఆర్ట్లో 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఉమాంగ్ స్లర్ఫ్ర్ ఫామ్కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
మనది మూడో స్థానం
సాధారణంగా మనం పిల్లలుగా ఉన్నప్పటి ఆలోచనలు తల్లిదండ్రులుగా మారిన తర్వాత ఉండవు. ఆలోచనలు మారిపోతాయి. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలనే తల్లిదండ్రులు భావిస్తారు. ''మా పరిశోధనలో ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఊబకాయంలో ప్రపంచంలోనే మన దేశం మూడవ స్థానంలో ఉంది. మరో విషయం ఏమిటంటే మన దేశంలో పోషకాహార లోపం సంభవిస్తుంది పేదరికం వల్ల మాత్రమే కాదు చక్కెర, ఉప్పు ఉన్న జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. వీటిలో కృత్రిమ రుచి కోసం రంగులను విపరీతంగా ఉపయోగిస్తుంటారు. అందుకే పిల్లలకు ఆరోగ్యకరమైన తిండిపదార్థాలను అందించేందుకు శక్తిమేరకు కృషి చేయాలని భావించాం. అవకాశాల రీత్యా మన మార్కెట్ చాలా పెద్దది'' అని శౌరవి అంటున్నారు.
నిపుణుల పర్యవేక్షణలో...
ఇప్పుడు స్లర్ప్ర్ ఫామ్ చిన్నపిల్లలతో పాటు కుటుంబాలకు కూడా ఆరోగ్యకరమైన, రుచికరమైన, సౌకర్యవంతమైన అల్పాహారం, భోజనం కూడా అందిస్తుంది. ప్రతి వంటకం తయారైన తర్వాత నిపుణుల బృందం వాటిని పరిశీలిస్తుంది. కృత్రిమ రంగులు, రుచులు, కొవ్వు పదార్థాలతో పాటు ఎటువంటి అనారోగ్యకరమైనవి అందులో జోడించకుండా నాణ్యమైన ఉత్పత్తి బయటకు వచ్చేలా ఆ బృందం పరిశీలిస్తుంది.
మాపై నమ్మకంతో...
''నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనే రాజీపడము. అది ఎంత కష్టంతో కూడుకున్నది అయినా పట్టించుకోకు. బియ్యం, గోధుమల కంటే తృణ ధాన్యాలతో తయారు చేసిన ఉత్పత్తులకు ఖర్చు ఎక్కువ ఉంటుంది. మా దగ్గర కొనుగోలు చేసే తల్లి దండ్రులు తమ పిల్లలకు ఇబ్బంది లేని, ఆరోగ్యకరమైన, పోషకాలతో నిండిన ఆహార ఉత్పత్తుల కోసం చూస్తున్నారు. వారు పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు నాణ్యమైన ఆహారంవైపే మొగ్గు చూపుతున్నారు. అలాంటి నాణ్యత మా వద్ద దొరుకుతుందనే నమ్మకంతో స్లర్ప్ర్ ఫామ్ను ఎంచుకుంటున్నారు'' అని మేఘనా అంటున్నారు.
ఎన్నో రుచులు...
సేంద్రీయ తృణ ధాన్యాలతో తయారు చేసిన సాతు మావు, కిచిడి మిక్స్, మిల్లెట్ ఓట్స్ గంజి, మిల్లెట్ పాన్ కేకులు, అరటి పండుతో పాటు చాక్లెట్తో చేసిన పాన్ కేకులు, మిల్లెట్ దోశ, బీట్రూట్ ఓట్స్ దోశతో పాటు మరెన్నో వీరి వద్ద దొరుకుతాయి. అలాగే రాగులు, సజ్జలతో తయారు చేసిన స్టార్ ఆకారపు మంచీలు, పఫ్స్ ఇలా ఎన్నో రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిండిని వీరు ఉత్పత్తి చేస్తున్నారు. ''ప్రస్తుతం మేము సుమారు 800 రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాం'' అంటున్నారు మేఘన.
కరోనా సమయంలోనూ...
''ఆహార సంస్థ కాబట్టి లాక్డౌన్ సమయంలో కూడా స్లర్ప్ర్ ఫామ్ పనిచేయడానికి అనుమతి వుంది. అయితే అన్ని సంస్థల మాదిరిగానే మేము కూడా ఆ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాం. బయటి ఆహారాన్ని తీసుకోవడానికి అందరూ భయపడిన కాలం అది. అయితే మేము పాటించే నాణ్యతే మా సంస్థను వృద్ధిలోకి తీసుకెళ్ళింది. కరోనా సమయంలో కూడా మూడు శాతం వృద్ధిని చూశాము'' అంటున్నారు సంస్థ వ్యవస్థాపకులు.
వృద్ధి చెందుతున్న క్షణం
స్లర్ప్ర్ ఫార్మ్ గత ఆరు నెలల్లో తన ఉత్పత్తులను 300 శాతం పెంచుకో గలిగింది. వచ్చే 12 నెలల్లో 5-6 మిలియన్ డాలర్లకు వృద్ధి చెందాలని కంపెనీ చూస్తోంది. మా పెద్ద సవాలు ఏమిటంటే.. ఇంటి వంటగదిలో తయారు అయిన ఆహారపదార్థాల రుచిని పిల్లలు మా సంస్థ ద్వారా పొందాలి. అది వారి చేతులకు చేరుకున్నప్పుడు దానికి అదనంగా ఏమీ జోడించకుండా ఇష్టంగా తినగలగాలి. ఇంకొక సవాలు ఏమిటంటే.. ఈ లక్ష్యం చేరాలంటే చాలా సమయం పడుతుంది. కష్టంతో కూడా కూడుకున్నది. అయితే లక్ష్యం చేరుకున్న తర్వాత మాత్రం పిల్లలకు మేలైన ఆహారాన్ని అందించామనే తృప్తి మాత్రం మాకు ఉంటుంది.
- శౌరవి
నాణ్యమైన పదార్థాలపై దృష్టి
మా మొదటి ప్రయోగంగా పిల్లలకు సేంద్రీయ పండ్లు, కూరగాయలతో ప్యూరీని తయారు చేశాము. అయితే వీటికి డిమాండ్ చాలా తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. కేవలం మార్కెట్పైనే ఆధారపడకుండా మా మనసు ఏం చెప్తే అదే చేయాలని భావించాము. మా అమ్మమ్మలు, నానమ్మల కాలంనాటి వంటకాలే పిల్లలకు మేలైన ఆహారమనే నిర్ణయానికి వచ్చాము.
- మేఘనా