Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషల్ మీడియా మితిమీరిన వినియోగం వల్ల కొత్త రకం అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాంలను ఎక్కువగా వాడేవారు న్యూరో లింగ్యువల్ డిఫీషియన్సీ అనే వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు తేల్చారు. ఇది భాషాపరమైన సమస్య. ఒక భాష గ్యాడ్జెట్లలో స్క్రీన్కు పరిమితమైతే.. ఆ భాష విస్తరణ పరిధి దెబ్బతింటుందని ఇంగ్లాండ్కు చెందిన భాషా శాస్త్రవేత్త డేవిడ్ క్రిస్టల్ చెబుతున్నారు. ఈ రోజుల్లో మనం మాట్లాడే భాష గ్యాడ్జెట్ స్క్రీన్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్గా మారింది. దీనివల్ల కొత్త భాషను నేర్చుకోవటం, దాంట్లో ప్రావీణ్యం సాధించడం మెదడుకు కష్టతరమవుతుంది. గ్యాడ్జెట్ల అధిక వాడకానికి, కొత్త భాష నేర్చుకోవడానికి సంబంధం ఉందని పరిశోధకులు తెలిపారు. గ్యాడ్జెట్ల వాడకం మెదడు సహజ సామర్థ్యాలను కూడా దెబ్బతీస్తుందని నిరూపించారు.
విస్తరణ ఆగిపోతుంది
భాష నేర్చుకునే సామర్థ్యం వ్యక్తుల మెదడు కణాలు, వాటి విస్తరణపై ఆధారపడి ఉంటుంది. గ్యాడ్జెట్లు, సోషల్ మీడియా ఎక్కువగా వాడటం వల్ల మెదడు కణాల విస్తరణ ఆగిపోతుంది. దీంతో భాషా నైపుణ్యాలను మెరుగు పరచుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో మెస్సేజ్లు, కామెంట్లు షార్ట్కట్లలో చేస్తారు. ఇవన్నీ కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీసేవేనని పరిశోధకులు చెబుతున్నారు.
సమన్వయం లోపిస్తుంది
2000 సంవత్సరం తరువాత టెక్నాలజీ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత గాడ్జెట్ల వినియోగం క్రమంగా పెరిగింది. దీనివల్ల భాషలపై ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని గుర్తించిన న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్ వంటి వార్తా పత్రికలు తమ కాలమిస్టులను చేతితో వార్తలు రాయమని, ఆ తర్వాతే కంప్యూటర్లో టైపింగ్ చేసి పంపించాలని ఆదేశించాయి. దీనివల్ల మెదడు, వేలు, పెన్ను కోఆర్డినేషన్ మెరుగుపడుతుందని భావించారు. ఒక రచయిత రాయాలనుకున్నది రాసి, దాన్ని మళ్లీ సంక్షిప్తం చేయడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాంలు వాడేటప్పుడు ఈ సమన్వయం లోపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
పెన్నుతో రాయండీ...
పెన్నుతో పేపర్ మీద కాలమ్స్, స్టోరీలు రాసినవారు మెరుగ్గా రాయగలిగారు. వారు రాసేటప్పుడు గాడ్జెట్లను ఉపయోగించకుండా మంచి పదాలు, పదబంధాలను ఆ ఆర్టికల్స్లో రాశారు. గాడ్జెట్ ఓరియెంటెడ్ ప్లాట్ఫాంలను ఎక్కువగా వాడటం వల్ల మెదడు కణాలు కొంత వరకు క్షీణిస్తాయి. సంప్రదాయ పద్ధతిలో రచనలు చేసినప్పుడు మెదడు తిరిగి చైతన్యవంతంగా మారుతుంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఎడ్వర్డ్ డబ్ల్యు సెడ్ అనే శాస్త్రవేత్త కూడా పత్రికలకు రాసే వ్యాసాలను ముందు కాగితంపై, పెన్నుతో రాస్తాడు. ఆ తరువాత దాన్ని టైప్ చేసి వార్తాపత్రికలకు ఈమెయిల్ చేస్తాడు. చాలామంది భాషాభిమానులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.
వాడకం తగ్గించాలి
సోషల్ మీడియా ప్లాట్ఫాంలను వాడకుండా పెన్ను, పేపర్ ఉపయోగించి రాయడం వల్ల పార్కిన్సన్ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చని అధ్యయనాల్లో కనుగొన్నారు. అందుకే భారత్తో పాటు ఇతర దేశాల్లోని ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో ఉండేవారు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను వాడవద్దని సూచిస్తారు. వీటికి దూరంగా ఉండటం వల్ల సీనియర్ సిటిజన్లకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్ మెసేజింగ్ అలవాటు పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధుల తీవ్రతను పెంచుతుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల విద్యార్థులు కూడా తాము మాట్లాడే భాషలపై పట్టును వేగంగా కోల్పోతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. అందువల్ల వయసుతో సంబంధం లేకుండా అందరూ గ్యాడ్జెట్లు, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలని, మెదడు పనితీరును మెరుగుపరచడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.