Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్ర లేవగానే హడావిడిగా, టెన్షన్గా రోజును ప్రారంభిస్తే ఇక ఆ రోజంతా ఎప్పుడు గడిచిపోతుందా అన్నట్టుగా ఉంటుంది. అదే హ్యాపీగా, పాజిటివ్ మైండ్సెట్తో మొదలుపెట్టామంటే సమయమే తెలియకుండా ఆ రోజులోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేయచ్చు. అందుకు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
ఈ రోజుల్లో చాలామంది కండ్లు తెరవగానే పక్కనున్న మొబైల్ ఫోన్నే చూస్తున్నారు. రాత్రి నుంచి ఎవరి నుంచి ఏయే సందేశాలొచ్చాయి? వాట్సప్ మెసేజెస్ ఏంటి? ఈ రోజు వార్తలేంటి? వంటివన్నీ చెక్ చేస్తున్నారు. దీంతో ఏదో ఒక చేదు వార్త కంట పడడం, దాంతో తీవ్ర ఒత్తిడికి లోను కావడం ప్రస్తుతం చాలామందిలో ఇలాంటి ఆందోళనే. కాబట్టి ఉదయం లేవగానే మొబైల్ పక్కన పెట్టేసి లేలేత సూర్యకిరణాలు పడే చోట కాసేపు పచ్చగడ్డిపై అలా నడవడం.. నచ్చిన వర్కవుట్ చేయడం.. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం.. ఇలా ఇవన్నీ మనలో పాజిటివిటీ నింపే అంశాలే అంటున్నారు. ఫలితంగా మనసుకు ఏదో తెలియని ఉత్సాహం కలిగి ఆ రోజంతా సంతోషంగా గడిపేయచ్చంటున్నారు.
శరీరం యాక్టివ్గా ఉన్నప్పుడే మనసులో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అయితే ఆ యాక్టివ్నెస్ అనేది రోజులో మనం తీసుకునే తొలి ఆహారం పై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి టీ, కాఫీలకు బదులు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ప్రయోజనం. కచ్చితంగా తాగాల్సిందే అనుకునేవారు నిమ్మరసం తాగిన తర్వాత ఓ అరగంట, గంట వాటిని తాగచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదురవకుండా రోజంతా పాజిటివ్గా, సంతోషంగా గడిపేయచ్చు.
రాత్రిళ్లు పడుకోవడం ఆలస్యం.. నిద్ర లేవడమూ లేటే. దాంతో హడావిడిగా రోజువారీ పనుల్లోకి దూరిపోవడం ఇది చాలామందికి అలవాటే. దాంతో ఉదయం పనులన్నీ పూర్తయ్యే సరికి నీరసం వచ్చేస్తుంది. ఆ అలసటతోనే రోజంతా గడిచిపోతుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే లేచీ లేవగానే ఒళ్లు విరవమంటున్నారు నిపుణులు. తద్వారా మనలో ఉన్న బద్ధకం వదిలిపోయి యాక్టివ్నెస్ మన దరి చేరుతుందట. ఇలా శారీరకంగా ఉత్సాహంగా ఉంటే మనసూ పాజిటివ్గా ఉంటుందంటున్నారు.
రోజులో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు బోలెడుంటాయి.. దీనికి తోడు ఇంటి పనులు. నిద్ర లేవగానే ఇవన్నీ తలచుకున్నామంటే టెన్షన్ వచ్చేస్తుంది. దాంతో ఏ పని ఎప్పుడు పూర్తిచేయాలో అర్థం కాక ఆ రోజంతా అదే నెగెటివిటీతో గడిచిపోతుంది. అలాకాకుండా ఆ రోజులో చేయాల్సిన పనులేంటో, వాటిలో ముందుగా పూర్తిచేయాల్సినవేంటో నోట్ చేసుకుంటే పని సులభమవుతుంది. ఇలా పనుల్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనసుపై భారం కూడా తగ్గుతుంది.
ఆఫీసుకు వెళ్లినా, ఇంటి నుంచి పని చేసినా చక్కగా స్నానం చేసి, నీట్గా ముస్తాబైతే మనసులోకి ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. చేసే పనిపై శ్రద్ధ పెట్టగలుగుతాం.. పనులన్నీ చకచకా పూర్తవుతాయి.