Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏకాగ్రత ఉంటే ఎంత కష్టమైన పనినైనా సాధించవచ్చు అని అందరికి తెలిసిందే. అయితే మన లక్ష్య సాధనాలే కాదు. ఆనందంగా ఉండటానికి కూడా ఏకాగ్రత దోహదపడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఏకాగ్రతతో పనిచేసేవారు ఎక్కువ ఆనందంగా ఉంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై అమెరికాలో ఒక అధ్యయనం నిర్వహించారట. దీనిలో భాగంగా 83 దేశాలకు చెందిన వివిధ వృత్తులు, వయసుల వారిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. వాటి ఆధారంగా అధ్యయన కర్తలు ఎక్కువ ఏకాగ్రతతో పనిచేసేవారు ఎక్కువ ఆనందంగా ఉంటారని తేల్చారు.
83 దేశాలకు చెందిన వివిధ వృత్తులు, వివిధ వయసుల వారిని ఏ యే సమయాలలో ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అప్పుడు వారి అనుభూతి వంటి, ఏ పని చేస్తున్నప్పుడు ఏ దృక్పథంతో వున్నారు వంటి అంశాల పై ప్రశ్నించి వాటిని విశ్లేషించి, పరిశీలించారు. వీరిలో చాలా మంది పనిచేస్తున్న, చూస్తున్నా, తింటున్నా, చివరికి షాపింగ్ చేస్తున్న ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు గుర్తించారు. ఫలితంగా ఆ సమయంలో న్యాయంగా పొందల్సినంత ఆనందాన్ని వారు పొందలేకపోతున్నారని గుర్తించారు పరిశోధకులు.
ఏకాగ్రతతో చేసే ఏ పనైనా పూర్తి ఆనందాన్ని అందిస్తుంది అని రుజువు చేయటానికి చేసిన అధ్యయనంలో ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచించేవారు అనుభూతులను పూర్తిగా ఆస్వాదించలేరు అని తేలింది. నిజానికి మనం మనకి తెలియకుండానే నిరంతరం ఆలోచనల్లో మునిగి వుంటాం. అవి సంతోషాన్నిచ్చే ఆలోచనలు అయినపుడు అప్పటి మన అనుభవంతో సంబంధం లేకుండా మన మనసు సంతోషంగా వుంటుంది. అదే నెగెటివ్ ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతుంటే ఆనందాన్నిచ్చే విషయాలుకి మన ప్రతిస్పందన పూర్తి స్థాయిలో వుండదు. ఏది ఏమైనా మనసు లగం చేయందే ఏ పని పూర్తి ఆనందాన్ని అందించదు అని కచ్చితంగా చెబుతున్నారు అధ్యయకర్తలు.
మన మనసుకి బాధ కలిగించే సంఘటన ఏదైనా జరిగినపుడు ఆ ప్రభావం మన ఆలోచనలపై పడుతుంది. మన ఆలోచనలన్ని వ్యతిరేక భావంతో ఉంటాయి. ప్రతి అంశం మనకి నచ్చనట్టుగానే అనిపిస్తుంది. ఆ సమయంలో మనం వంట చేసినా, ఆఫీసు పని చేసినా ఏదైనా మన మనసు పూర్తిగా ఆ పనిపై లగం కాదన్నది నిజం. దాంతో ఆ చేసేపని మనకి విసుగ్గా అనిపిస్తుంది. దాంతో ఆ పని సరిగ్గా చేయలేం, ఫలితం కూడా అలాగే ఉంటుంది. దాంతో తిరిగి మనం మరింత వ్యతిరేక భావనలో కూరుకుపోతాం. ఇది ఒక వలయంలో అలా సాగుతూనే వుంటుంది. చాలా మంది జీవితం విసుగ్గా ఉంది అనటానికి కారణం అదే. అందుకే నిరంతరం మనపై దాడిచేసే ఆలోచనల నుంచి తప్పించుకోవటం అలవాటు చేసుకోవాలి.
మన మనసుకి ఏకాగ్రత అలవాటు చేయటం కష్టమేమీ కాదు. ధ్యానం, యోగా వంటివి మనలో ఏకాగ్రత పెంచుతాయని చెబుతారు పెద్దలు. ఈ వయసులో నాకెందుకు అనుకోకుండా ప్రతిరోజూ కొంత సమయాన్ని వాటికి కేటాయిస్తే మనసుకి ఏకాగ్రత అలవాటుగా మారుతుందో ప్రతీ పనిని ఆనందించగలుగుతాం. అనుభూతులని అందుకోగలుగుతాం. కాబట్టి ఆనందంగా వుండాలంటే ఏకాగ్రత ఉండాల్సిందే.