Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీపి అప్పం
కావల్సిన పదార్థాలు: వరిగపిండి - ఒక కప్పు, కొబ్బరి కోరు - ఒక కప్పు, కొబ్బరి ముక్కలు - పిడికెడు, బెల్లంపొడి - ముప్పావు కప్పు, పటిక బెల్లెం పొడి - ఒక చెంచా, ఈస్ట్ - అర చెంచా (ఈస్ట్ లేకపోతే ఒక స్పూను పులిసిన పెరుగు), జీడిపప్పు, కిస్మిస్ - గుప్పెడు, నెయ్యి - ఒక చెంచా, యాలకుల పొడి - అరచెంచా.
తయారు చేసే విధానం: వరిగ పిండిని మందపాటి బాణలిలో వేసి సన్నమంట మీద నూనె లేకుండా దోరగా వేయించాలి. అర కప్పు వేడి నీటిలో ఈస్ట్, పటిక బెల్లం పొడి కలిపి పక్కన ఉంచాలి. బెల్లం పొడిలో పావు కప్పు నీరు పోసి సన్నమంట మీద ఐదు నిమిషాలు మరిగించి దించాలి. ఇందులో వేయించి చల్లార్చిన వరిగపిండి, ఈస్ట్, పటికబెల్లం నీటిని వేసి కలిపి రెండు గంటల సేపు పక్కన పెట్టాలి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. రెంగు గంటల తర్వాత ఈ మిశ్రమంలో యాలకులపొడి, కొబ్బరి కోరు వేసి అవసరమైతే మరికొంత నీటిని పోసి గరిటె జారుగా (ఇడ్లీ పిండిలా) కలుపుకోవాలి. అంచులు ఎత్తుగా ఉన్న పళ్లానికి నెయ్యిరాసి మిశ్రమాన్ని పోసి సమంగా సర్దాలి. వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు సర్దాలి. ఇడ్లీ పాత్రలో అడుగున నీరు పోసి పైన పళ్లాన్ని పెట్టి పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత తీసి ముక్కలు కోసి వడ్డించవచ్చు.
మురుకులు
కావల్సిన పదార్థాలు: వరిగలు - ఒక గ్లాసు, శనగపప్పు - పావు కప్పు, మినప్పప్పు - పావు గ్లాసు, పెసరపప్పు - పావుగ్లాసు, వరిబియ్యం - పావు గ్లాసు, జీలకర్ర - రెండు చెంచాలు, వాము - ఒక చెంచా, కారం - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, నూనె - మురుకులు కాలడానికి సరిపడినంత.
తయారు చేసే విధానం: వరిగలు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, వరి బియ్యం అన్నింటినీ మందపాటి బాణలిలో నూనె లేకుండా సన్నమంట మీద దోరగా వేయించాలి. ఒక్కొక్క దానిని విడిగా కూడా వేయించుకోవచ్చు. కలిపి వేయించాలనుకుంటే ముందుగా శనగలు వేసి అవి ఒక మోస్తరుగా వేగిన తర్వాత మిగిలిన ధాన్యాలను వేయాలి. చల్లారిన తర్వాత మరపట్టించి జల్లించాలి. పిండిలో జీలకర్ర, వాము, కారం, ఉప్పు, రెండు చెంచాల వేడి నూనె పోసి బాగా కలపాలి. అందులో ఒక కప్పు వేడి నీరు కూడా పోసి కలపాలి. చివరగా తగినంత చన్నీళ్లతో పిండిని ముద్దగా చేయాలి. బాణలిలో నూనె వేడి చేసి కాగిన తర్వాత పిండిని మురుకుల గొట్టంలో పెట్టి నూనెలోకి వత్తాలి. మీడియం మంట మీద మురుకులను దోరగా వేయించాలి. మురుకులు వేగిందీ లేనిదీ తెలియాలంటే చిల్లుల గరిటెతో మురుకుల మీద చిన్నగా తడితే తీగ లోపల మెత్తగా ఉందా గట్టి పడిందా అనే అంచనా వస్తుంది.
గమనిక: కలిపిన పిండి ఆరిపోకూడదు. తడి వస్త్రంలో కప్పి ఉంచి గొట్టంలో పట్టేంత పిండిని విడిగా తీసుకుంటూ మురుకులు చేయాలి.
దిబ్బరొట్టె
కావల్సిన పదార్థాలు: వరిగలు - ఒక గ్లాసు, కందిపప్పు - పావు గ్లాసు, శనగపప్పు - పావు గ్లాసు, మినపప్పు - పావు గ్లాసు, పెసరపప్పు - పావు గ్లాసు, పుల్లటి పెరుగు - పావు గ్లాసు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద - రెండు చెంచాలు, పసుపు - ఒక చెంచా, కారం - ఒక చెంచా, ఉప్పు - తగినంత, సొరకాయ తురుము - అరకప్పు, క్యాబేజీ తురుము - అరకప్పు, మెంతికూర - అరకప్పు, కొత్తిమీర - పావు కప్పు, నువ్వులు - అరచెంచా, పోపుకోసం - ఆవాలు - రెండు చెంచాలు, కరివేపాకు - రెండు రెమ్మలు, నువ్వులు - మూడు చెంచాలు, నూనె - పావు కప్పు.
తయారు చేసే విధానం: వరిగలు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు నాలుగు గంటల సేపు నానబెట్టాలి. నానిన తర్వాత మెత్తగా రుబ్బాలి. అందులో పెరుగు, కారం, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, పసుపు, సొరకాయ తురుము, క్యాబేజీ తురుము, మెంతికూర, కొత్తిమీర వేసి రెండు గంటల సేపు పక్కన ఉంచాలి. ఒక బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పై మిశ్రమంలో వంటసోడా కలిపి పోపు బాణలిలో పోయాలి. బాణలి అంతటా సమంగా సర్ది మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. దీనిని పుదీన చట్నీ లేదా పెరుగు చట్నీతో తినవచ్చు.
వరిగ పుట్టు
కావల్సిన పదార్థాలు: వరిగ బియ్యం - ఒక గ్లాసు, కొబ్బరి కోరు - అరకప్పు, ఉప్పు - అర చెంచా.
తయారు చేసే విధానం: వరిగ బియ్యాన్ని ఐదు గంటల సేపు నానబెట్టి నీరంతా పోయే వరకు వడపోయాలి. ఈ బియ్యాన్ని పొడి వస్త్రం మీద పోసి నీడన ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టి మరపట్టించాలి. ఆ పిండిని వెడల్పాటి పళ్లెంలో పోసి అందులో ఉప్పు వేసి కొద్దిగా నీటిని వేసి తడిపొడిగా కలుపుకోవాలి. మిశ్రమం ముద్దగా కాకూడదు. పిండి అంతటికీ నీరు అందాలి. చేత్తో నలిపితే పొడిగా రాలిపోతున్నట్టు ఉండాలి. ఇలా కలుపుకుని ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. కలిపేటప్పుడు నీటిని ఒకేసారి పోస్తే ఒక చోట ముద్దయి మిగిలిన పిండి అంతా పొడిగా ఉండిపోతుంది. కాబట్టి పిండిలో కొద్దికొద్దిగా నీటిని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. పుట్టు తయారు చేసే గొట్టంలో కొంచెం కొబ్బరి కోరు కూరాలి. ఆ పైన పుట్టు పిండిని కూరాలి. తర్వాత కొబ్బరికోరు, ఆ తర్వాత పిండి అలా పొరలు పొరలుగా నింపాలి. దీనిని ఆవిరి మీద ఆరేడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇది చాలా బలవర్ధకమైన ఉపాహారం.