Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లబి ఘోష్... వందలాది మంది మహిళలు, పిల్లలను బాల్య వివాహాలు, బలవంతపు వివాహాల నుండి కాపాడింది. బాల కార్మికులుగా ఉన్న ఎంతో మంది ఆడపిల్లలను చదువు దగ్గర చేసింది. అంతేకాదు వారిని వ్యభిచారం నుండి రక్షించి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ స్వచ్ఛంధ కార్యకర్త. ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ద్వారా అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్న ఆమె పరిచయం మానవి పాఠకుల కోసం...
2013లో పల్లబి ఘోష్కి న్యూఢిల్లీలోని ఓ పాష్ కాలనీలోని ఓ ఇంట్లో బాలికను బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు ఫోన్ వచ్చింది. ఆ సమయంలో యాంటీ ట్రాఫికింగ్ ఎన్జిఓ శక్తి వాహినిలో భాగంగా ఉంది ఆమె. గత వారం రోజులుగా తనకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నందున మొదట ఆ కాల్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత అది ఫేక్ కాల్ అని తేలింది. మరోసారి మళ్ళీ కాల్ వచ్చింది. అటునుండి మాట్లాడుతున్న వారి స్వరాన్ని బట్టి చూస్తే ఇది తీవ్రమైన విషయం అని ఆమెకు అర్థమయింది. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఆ సమయంలో ఏడు నెలల గర్భవతి అయిన మహిళా పోలీసు అధికారికి ఆ బాలికను అప్పగించే వరకు వేచి ఉంది.
ఆమెను విపరీతంగా కొట్టారు
''ఆమె ఎలా సహాయం చేస్తుందో అని నేను ఆందోళన చెందాను, భయపడ్డాను. అయినప్పటికీ మేము మరొక సంస్థకు చెందిన అధికారితో కలిసి ఇంటి తలుపు తట్టాము. ఒక వృద్ధ మహిళ నెట్టెడ్ తలుపు గుండా చూసింది. ఆమె పక్కన రెండు పెద్ద కుక్కలు మొరుగుతూ ఉన్నాయి. ఇంట్లో పనిమనిషి ఉన్నారా అని నేను అడిగాను. కానీ స్పందన లేదు'' అని పల్లబి గుర్తు చేసుకుంది. ఓ బహుళజాతి కంపెనీకి దక్షిణాసియా అధిపతిగా ఉన్న ఓ మహిళ జార్ఖండ్ నుంచి అక్రమ రవాణాకు గురైన యువతిపై రకరకాల చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు బృందానికి సమాచారం అందింది. పల్లబి మాట్లాడుతూ ''ఆ మహిళ చివరకు లాయర్ని తీసుకుని రాత్రి 8 గంటలకు వచ్చింది. మేము అప్పటి వరకు వేచి ఉన్నాము. ఆమె రెచ్చిపోయి కేకలు వేసింది. మేము ఫిర్యాదును స్వీకరించినందున దాన్ని ధృవీకరించాలనుకుంటున్నామని మేము ప్రశాంతంగా ఆమెకు చెప్పాము. ఇంట్లోకి వెళ్ళినపుడు ఒక అమ్మాయి పూర్తిగా నగంగా నేలపై కూర్చోవడం చూశాము. బాలిక పైనుంచి కాలి వరకు గాయాలు, ఆమెను కొట్టినట్టు ఇట్టే అర్థమవుతుంది. ఆమె ముఖం కోతలతో వికృతమైంది. పల్లబి ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఒక వైద్యుడు బాలికను పరీక్షించేందుకు అంగీకరించే వరకు వారు ఒక విభాగం నుండి మరొక విభాగానికి తిరుగుతూనే ఉన్నారు. నేను ఒక చేత్తో ఆ అమ్మాయి చేతిని, మరో చేత్తో సెలైన్ బాటిల్ పట్టుకున్నాను. ఇది ఒక పీడకల. ఆమె శరీరంలోని ప్రతి భాగంలో గాయాలు, తలపై పురుగులు ఉన్నాయి'' అంటూ ఆ బాధాకరమైన సంఘటన గురించి పల్లబి చెప్పుకుంటూ పోతుంది.
బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు
యజమాని తన కోపాన్ని బాలికపై బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఆమెను బాత్రూమ్లో పెట్టి గడియపెట్టారు. ఆమె తలను వాష్ బేసిన్కి పదే పదే కొట్టినట్టుగా ఉంది. ఆమెకు వార్తాపత్రికలో ఆహారం అందించబడింది. రెస్క్యూ తర్వాత బాలికను జార్ఖండ్లోని తన తల్లిదండ్రులతో తిరిగి కలిసేలా చేశారు. తర్వాత కాలంలో ఆమెకు పెండ్లి జరిగినట్టు విన్నానని పల్లభి చెప్పింది. చివరికి బాలిక చాలాసార్లు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా కోర్టు నిందితుడిని స్కాట్ ఫ్రీగా విడిచిపెట్టింది. ఆ కేసు మూడేండ్ల పాటు కొనసాగింది.
ట్రాఫికింగ్కు హద్దులు లేవు
అస్సాంలోని లుమ్డింగ్లో పుట్టి పెరిగిన పల్లబి ఇప్పటివరకు ఏడు వేల మందికి పైగా బాలికలు, అబ్బాయిలను అక్రమ రవాణా నుండి రక్షించింది. తన 18వ ఏట పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాస్లో తన ప్రయాణంలో ఒక తండ్రిని కలుసుకున్నానని, ఆయన తన కూతురు తప్పిపోయిందని చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది. ''అతను శోకం, భయంతో విలపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఎవరో అబ్బాయితో కలిసి పారిపోయి ఉంటుందని చెప్పడంతో వారు దానిని తోసిపుచ్చారు. ఒక గ్రామానికి చెందిన ఒక అబ్బాయిని కలిసి మాట్లాడినపుడు ఒక అపరిచితుడు తరచూ గ్రామానికి వచ్చేవాడని, ఆ అమ్మాయి అతనితో మాట్లాడటం చూశాడని నేను తెలుసుకున్నాను'' ఆమె చెప్పింది.
ఏమీ చేయలేకపోయిందని
తర్వాత కాలంలో పల్లబి ఆ తండ్రితో సంబంధాలు కోల్పోయింది. ఆ బాలిక ఆచూకీ కోసం ఆమె ఏమీ చేయలేకపోయింది. ఇది ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దాంతో ఆమె పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమ రవాణాపై పరిశోధన చేయడం ప్రారంభించింది. ఢిల్లీ యూనివర్శిటీ నుండి బీఏ, చెన్నై నుండి జెండర్ స్టడీస్లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఆమె తన పనిని ముందుకు తీసుకెళ్లడానికి శక్తి వాహినిలో చేరింది. వయసు విషయానికి వస్తే అక్రమ రవాణాకు హద్దులు లేవని పల్లబి అభిప్రాయపడింది. తన 52 ఏండ్ల భార్య అపహరణకు గురై హర్యానాలో ఉందని అస్సాంలోని 58 ఏండ్ల వ్యక్తి నుంచి తనకు కాల్ వచ్చిన మరో సంఘటనను ఆమె గుర్తు చేసుకుంది.
తీవ్ర ప్రటిఘటన ఎదురైంది
''తప్పిపోయిందని ఫిర్యాదు ఇచ్చి ఆ ఏరియా ఎస్పీకి వద్దకు వెళ్ళి మద్దతు అడిగాను. ఆ తర్వాత గ్రామంలోని పోలీసు చౌకీకి వెళ్లి వెరిఫికేషన్ కోసం ఉన్నామని ఇన్ఛార్జ్ అధికారితో మాట్లాడాను. ఈ ప్రాంతాల్లో ఒక మహిళ (అపరిచితుడు) కనిపించారా అని మేము గ్రామానికి చెందిన ఖబ్రీ (ఇన్ఫార్మర్)ని అడిగాము. ఊరికి కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పాడు. నేను అయోమయంలో పడ్డాను'' అని పల్లబి చెప్పింది. వాస్తవానికి 52 ఏండ్ల మహిళ, 5 అడుగుల కంటే తక్కువ పొడవు ఉన్న ఆమెను తప్పుగా భావించి, కిడ్నాప్ చేసి హర్యానాలోని ఈ గ్రామానికి తీసుకువచ్చారు. ఆమె మానసిక సమస్య ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంది. పల్లబి ఇంట్లోకి వెళ్లి మహిళను రక్షించేందుకు ప్రయత్నించగా ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ ఇంట్లోని ఆడవాళ్ళు ఆమె బట్టలు లాగి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలాగోలా కిడ్నాప్కు గురైన మహిళతో కలిసి ఆమె అక్కడి నుంచి బయటపడగలిగింది. అనంతరం రక్షించిన మహిళ పల్లబికి తన స్థానంలో ప్లాస్టిక్ వస్తువులు విక్రయించేందుకు వచ్చిన మహిళతో ఎలా స్నేహం చేశాడో చెప్పింది.
బెదిరింపుల గురించి లెక్కే లేదు
ఒక రోజు ఆమె ఒక కప్పు టీ తెచ్చింది. ఆమెకు మెలకువ వచ్చేసరికి (ఆమెకు మత్తుమందు ఇచ్చారు) హర్యానాలోని గ్రామంలో ఆమె కనిపించింది. ఇది ఒంటరి సంఘటన కాదని పల్లబి అంటుంది. హర్యానాలోని ఎన్నో గ్రామాలు ఇటువంటి కిడ్నాప్లతో నిండి ఉన్నాయి. ఇతర గ్రామస్తులు లేదా పోలీసుల జోక్యం లేదు. ఆమె తల్లితో పాటు బహుభార్యాత్వానికి గురైన ఒక మహిళ విక్రయించిన నాలుగు నెలల పసికందుతో సహా అనేక ఇతర రెస్క్యూల గురించి ఆమె మాట్లాడుతుంది. ''నాకు వచ్చిన బెదిరింపుల గురించి అయితే లెక్కే లేదు. పింప్లు నన్ను పిలిచి నేను దాడులను ఆపితే వారు నాకు ఇల్లు కొనిస్తామని చెప్పారు. అందుకే నేను ఎల్లప్పుడూ నా రక్షణలో ఉంటాను. ప్రతిసారీ నా ఇంటికి చేరుకోవడానికి వేర్వేరు రహదారులను తీసుకుంటాను. నేను నా జీవితంలో ఎక్కువ భాగం సోషల్ మీడియాలో వెల్లడించను'' ఆమె చెప్పింది.
పునరావాసం కల్పించినపుడే
పల్లబి 2016లో శక్తి వాహినిని విడిచిపెట్టి ఇతర అక్రమ రవాణా నిరోధక సంస్థలతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ప్రాణాలతో బయటపడిన వారితో ప్రత్యక్షంగా సంభాషిస్తున్న వ్యక్తిగా ఒక దశాబ్దానికి పైగా అందులో పనిచేసిన తన అనుభవం నుండి ఆమె ఎన్నో నేర్చుకుంది. ఒక వ్యక్తిని కేవలం అక్రమ రవాణా నుండి రక్షించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ వ్యక్తికి పునరావాసం కల్పించినపుడే నిజమైన సాయం చేసినట్టని ఆమె గ్రహించింది. పైగా రక్షింపబడిన వారి సంఖ్య, అక్రమ రవాణాకు గురైన వారి సంఖ్యలో కేవలం పదోవంతు మాత్రమే. కాబట్టి పల్లబి దాని మూలాలను కనిపెట్టి నాశనం చేయాలనే ఆలోచనతో మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి 2020లో ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ను ప్రారంభించింది.
మూలం వద్ద పరిష్కరించడం
''చాలా సంస్థలు పునరావాసం అంటే కుటుంబంతో మళ్లీ కలిసిపోవడమని నమ్ముతాయి. కానీ మీరు ఆ పిల్లలను ఎలా శక్తివంతం చేస్తున్నారు? మొదట పిల్లలు తండ్రిపై ఆధారపడి ఉంటారు. ఆపై విక్రయించబడతారు. రక్షించిన తర్వాత వారికి వివాహం జరుగుతుందా? ఇది ఎలాంటి పునరావాసం?'' అని పల్లబి అడుగుతుంది. రెస్క్యూ పిల్లలను మేధోపరంగా సవాలు చేయబడినవారు, అత్యాచారం నుండి బయటపడినవారు, దోషులు, దయనీయమైన పరిస్థితులలో నివసించే షెల్టర్ హోమ్లలో తీవ్రమైన సమస్య ఉందని ఆమె అంగీకరించింది. ఇది సమస్యను దాని మూలం వద్ద పరిష్కరించడానికి, వారు రక్షించడానికి మించిన ఆలోచనకు దారితీసింది.
అక్రమ రవాణాపై అవగాహన
ప్రస్తుతం ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ అస్సాంపై దృష్టి సారిస్తుంది. ఇక్కడ పల్లబి సాంఘిక సంక్షేమ శాఖలు, పంచాయతీ (విలేజ్ కౌన్సిల్) నాయకులను చేరవేస్తుంది. అక్రమ రవాణాపై అవగాహన సెషన్ల ఆవశ్యకతను, వారు ఎలా ప్రయోజనం పొందుతారో వివరిస్తుంది. ''అస్సాంలో రవాణా అనేది పెద్ద సవాలు. నేను రైళ్లు, బస్సులు, ఎద్దుల బండ్లను ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు ప్రయాణించాను. విద్యాసంస్థలు, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు, పోలీసు సిబ్బంది, రవాణా అధికారులు, కార్మికులతో మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు, వాటాదారుల మధ్య సంభాషణలు ప్రారంభించేందుకు, శిక్షణా సమావేశాలు, వర్క్షాప్లు, వీధి నాటకాలు నిర్వహించేందుకు నేను వారిని సంప్రదించాను'' అంటూ ఆమె వివరిస్తుంది.
ఎన్నో అంశాలపై...
మహమ్మారి కారణంగా పల్లబి సెప్టెంబర్ 2021 వరకు ప్రజలను భౌతికంగా కలవలేకపోయింది. అప్పటి నుండి ఆమె 75,000 మందికి పైగా వ్యక్తులను చేరుకుంది. మానవ అక్రమ రవాణా, రుతుక్రమ పరిశుభ్రత, స్కూల్ డ్రాపౌట్లు, ఆడ భ్రూణహత్యలు, జననేంద్రియ వికృతీకరణ, వరకట్నం, గృహ హింస వంటి లింగ ఆధారిత హింస, బాల్య వివాహాలు, బాలల దుర్వినియోగం, ూ+దీుQ× హక్కులు, లింగ సమానత్వ సాధికారత వంటి సమస్యల గురించి మాట్లాడుతుంది.
ఒక మహిళా సైన్యం
పల్లబిని కహానివాలి దీదీ (కథల సోదరి) అని పిలుస్తారు. ఆమె నిజ జీవిత సంఘటనలను పంచుకుంటుంది. ఆమెకు మద్దతు ఇవ్వడానికి స్పాన్సర్లు లేని ఒక మహిళా సైన్యం. చాలా సంస్థలకు కన్సల్టెంట్గా వచ్చిన డబ్బును ఆమె తన ప్రయోజనం కోసం ఉపయోగిస్తుంది. ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయాలనుకున్నప్పుడు ఆమె వారి ఆహారం, ప్రయాణానికి చెల్లించేలా చూసుకుంటుంది. ఎన్జీఓలు కొన్ని అవినీతి చేస్తున్నాయన్నది వాస్తవం. ఆ కారణంతోనే ఆమెకు చాలా తక్కువ నిధులు వస్తున్నాయి. ఎలాంటి రుసుము లేకుండా అవగాహన పెంచుకోవడానికి తనకు వేదిక ఇవ్వాలని విద్యాసంస్థలను తరచుగా అడుక్కోవలసి వస్తుందని అని ఆమె చెప్పింది.
మూస పద్ధతిని విచ్ఛినం చేస్తా
పస్తుతం టెక్నాలజీని ట్రాఫికింగ్ కోసం ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై అవగాహన కల్పించేందుకు ఆమె బెంగళూరులో ఉన్నారు. ''పేదలు మాత్రమే అక్రమ రవాణాలో చిక్కుకుంటారనే మూస పద్ధతిని నేను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాను. విద్యావంతులు ఇప్పుడు సైబర్ దుర్వినియోగానికి గురవుతున్నారు. యువకులు సమూలంగా మారుతున్నారు. ఆరు లేదా ఏడేండ్ల వయసు ఉన్న అబ్బాయిలను డ్రగ్ పెడ్లర్లుగా ఉపయోగిస్తున్నారు. ప్రజలు వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం'' అంటుంది ఆమె. ''పది మంది జీవితాలను రక్షించడం.. ఆ పది జీవితాలను శక్తివంతం చేయడం'' అనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతుంది.
- సలీమ