Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్యామల పదోతరగతి పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. స్నేహితురాలి ద్వారా సాగర్ పరిచయమయ్యాడు. ఇద్దరి కులాలు వేరు. అయితే ప్రేమకు కులం అడ్డుకాదనుకున్నారు. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అతని ఇంట్లో పెండ్లికి ఒప్పుకోరని, చెప్పకుండా చేసుకుందామన్నాడు. శ్యామల ఇంట్లో వాళ్ళే దగ్గరుండి పెండ్లి చేశారు. ఇద్దరూ శ్యామల అమ్మగారింట్లోనే ఉండేవారు. నాలుగు రోజుల తర్వాత పెండ్లి విషయం సాగర్ ఇంట్లోవాళ్ళు తెలుసుకొని, తమవైపు బంధువులెవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
పెండ్లయిన నెలకే శ్యామల నెలతప్పింది. కార్పెంటర్ వర్క్ చేసే సాగర్ ఆ పనిలో పట్టుసాధించాడు. సొంతంగా తనే ఓ షాప్ పెట్టుకుంటానన్నాడు. అతని వ్యాపారానికి శ్యామల తన బంగారాన్ని తాకట్టు పెడితే, ఆమె పుట్టింటి వాళ్ళు అక్కడక్కడ కొంత డబ్బులు సేకరించి మొత్తం రెండు లక్షలు అతని చేతిలో పెట్టారు.
ఆ డబ్బుతో సాగర్ కొత్త బిజినెస్ ప్రారంభించాడు. నెలలు నిండిన శ్యామలకు బాబు పుట్టాడు. వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది. సాగర్ వేరు కాపురం పెట్టాడు. సంసారం ఇలా హాయిగా సాగిపోతోంది. సాగర్ వ్యాపారంలో బిజీ అయిపోయాడు. నిత్యం ఫోన్లతోనే గడిపేవాడు. శ్యామల అడిగితే ఏదేదో చెప్పేవాడు. శ్యామల గురించి, బాబు గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. దాంతో సాగర్ తనకు ఎక్కడ దూరమవుతాడోనని శ్యామల భయపడేది. ఈలోపు సాగర్కు పెండ్లి జరిగిన విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసింది.
కొడుకు కులం తక్కువ పిల్లను పెండ్లి చేసుకున్నాడనే విషయం ఊరందరికీ తెలిసిందని, తమ పరువు పోయిందని సాగర్ తల్లిదండ్రులు గొడవ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు మొదటి పుట్టిన రోజు వచ్చింది. కొడుకు పుట్టిన రోజుకు శ్యామల తన అత్తామామలను ఆహ్వానించింది. అక్కడకు వచ్చిన వారు సాగర్ బాగా స్థిరపడ్డాడని అర్థం చేసుకున్నారు. అప్పటి నుండి వాళ్ళు శ్యామలతో మంచిగా ఉండేవారు. 'పెండ్లి ఎలాగో ఎవరికీ తెలియకుండా చేసుకున్నారు, బంధువులందరినీ పిలిచి ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం' అని నమ్మించి శ్యామలను అత్తామామలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. సాగర్ మాత్రం వ్యాపారంలో బిజీగా ఉన్నానని చెప్పి సిటీలోనే ఉండి పోయాడు. శ్యామల బాబును తీసుకొని అత్తగారింటికి వెళ్ళింది.
శ్యామల అక్కడికి వెళ్ళిన రోజే ఇంట్లో నల్లా పాడయింది. శ్యామల రావడం వల్లే ఇలా జరిగిందని, ఆమె జాతకం మంచిది కాదని అత్త గోల మొదలు పెట్టింది. శ్యామల ఏం చేసినా, ఏం మాట్లాడినా తప్పుపట్టేది. కులం తక్కువదనీ, జాతకం బాగాలేదనీ సూటిపోటి మాటలతో వేధించేది. తీసుకెళ్ళమని సాగర్కు ఫోన్ చేస్తే 'మా ఇంట్లో నాలుగు రోజులు ఉండలేవా...' అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. అక్కడ శ్యామల మూడు నెలలు ఉన్నా సాగర్ ఒక్కసారి కూడా ఆమెను చూడటానికి వెళ్లలేదు సరికదా మరోవైపు వ్యాపారాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. దాంతో పార్ట్నర్ సాగర్ని మోసం చేశాడు. ఈ విషయం తెలుసుకొని శ్యామల బాబును తీసుకొని సిటీకి వచ్చేసింది. అప్పటికే సాగర్కు అప్పులు బాగా పెరిగిపోయాయి.
దీంతో సాగర్ ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు.
ఇక శ్యామల చేసేదేం లేక మళ్ళీ అత్తగారింటికే వెళ్ళింది. తన జాతకం వల్లే కొడుకు ఇలా వెళ్ళిపోయాడని అత్త పెట్టే హింస ఎక్కువయ్యింది. అక్కడ ఆమెకు తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. దాంతో శ్యామల అత్తగారింటి పక్కనే బాబుతో కలిసి చిన్న గది అద్దెకు తీసుకొని కుట్టు మిషన్ పెట్టుకుని బతకడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత సాగర్ తిరిగి వచ్చాడు. ఇక సిటీకి వెళ్ళనని, ఊరికి దగ్గర్లోని టౌన్లో ఉండి పని చేసుకుంటానన్నాడు. దాంతో శ్యామల పుట్టింటి వాళ్ళను అడిగి మళ్ళీ డబ్బు ఏర్పాటు చేసింది.
శ్యామల ఇచ్చిన డబ్బుతో సాగర్ వ్యాపారం మొదలు పెట్టాడు. సాగర్తోపాటు అతని తల్లిదండ్రులు కూడా అతనితో పాటే టౌన్లో ఉండేవారు. శ్యామల మాత్రం బాబుతో ఊర్లోనే ఉండేది. సాగర్ తనకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఇంటికి ఎప్పుడో ఓసారి వెళతాడు. శ్యామల కూడా టౌన్కి వస్తానంటే సాగర్ వద్దన్నాడు. ఎందుకని అడిగితే 'ఆదాయం సరిగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం టౌన్లో ఉంటే కష్టం' అని చెప్పేవాడు. దాంతో శ్యామల తనకు వచ్చిన ఆదాయంతోనే కొడుకుతో పాటు బతుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రెండోసారి గర్భవతి అయింది. ఇక అప్పటి నుండి సాగర్ ఇంటికి రావడం పూర్తిగా మానేశాడు. డాక్టర్ శ్యామలకు పూర్తిగా బెడ్ రెస్ట్ అని చెప్పారు. దాంతో కుట్టు పని ఆపేసింది. దాంతో తింటానికి తిండి లేదు. ఇంటి పక్కవాళ్ళు తనకు, బాబుకు తిండి పెడితే తిని బతికేది. కానీ ఇంటి అద్దె ఎలా కట్టాలి.
ఇలాంటి పరిస్థితుల్లో శ్యామల వాళ్ళ అక్క సాగర్కు ఫోన్ చేసి చెప్పి చెల్లిని తీసుకెళ్ళింది. శ్యామల అక్కడకు వెళ్ళిన దగ్గర నుండి సాగర్ ఆమెకు ఫోన్ చేయడమే మానేశాడు. ఆమె ఫోన్ చేస్తే 'ఎవరికి చెప్పి మీ అక్క దగ్గరకు వెళ్ళావు. అసలు నువ్వు నా భార్యవే కాదు, నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు' అన్నాడు. సాగర్ మాటలకు భయపడ్డ శ్యామల ఆరోగ్యం సరిగా లేకపోయినా వెంటనే ఊరికి వెళ్ళి మళ్ళీ అదే గదిలో అద్దెకు ఉంది. కాని సాగర్ మాత్రం ఇంటికి వచ్చేవాడు కాదు. అద్దె కట్టేవాడు కాదు. ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఇక భరించలేక ఏడో నెలలో శ్యామల పుట్టింటికి వచ్చేసింది. జర్నీలు చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఆస్పత్రికి తీసుకెళితే డాక్టర్లు మందులు రాసిచ్చారు. ఇక అప్పటి నుండి శ్యామల పుట్టింట్లోనే ఉంది. ఆమెకు మళ్ళీ బాబు పుట్టాడు. కాని సాగర్ చూడటానికి రాలేదు. ఫోన్ చేస్తే బాబు అసలు నాకు పుట్టలేదన్నాడు.
దాంతో శ్యామల పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది. పోలీసులు అరెస్టు చేసి, కోర్టుకు తీసుకెళ్ళారు. ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చి సాగర్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు సాగర్ తన ఆస్తి మొత్తం అమ్ముకొని తనకూ, పిల్లలకు ఏమీ లేకుండా చేయాలని చూస్తున్నాడనే విషయం శ్యామలకు తెలిసింది. తనకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, కనీసం పిల్లల కోసమైనా ఆస్తి కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. తెలిసిన వారి ద్వారా ఐద్వా లీగల్సెల్ గురించి తెలుసుకొని వచ్చి కలిసింది.
ఐద్వా లీగల్సెల్ వారి సలహా మేరకు శ్యామల, సాగర్ ఇంటిముందు పోరాటం మొదలుపెట్టింది. దాంతో కేసు వాపస్ తీసుకుంటే ఇంటికి తీసుకెళతానని సాగర్, శ్యామలకు ఆశపెట్టాడు. కాని అతని మాటలను ఆమె నమ్మలేదు. తన ఇద్దరు పిల్లలకి ఆస్తిలో వాటా రాసి, పిల్లల చదువుల కోసం ఐదు లక్షలు డిపాజిట్ చేస్తేనే కేసు వాపస్ తీసుకుంటానని స్పష్టంగా చెప్పింది. అప్పటికే ఎన్నో సార్లు కోర్టు చుట్టూ తిరిగిన సాగర్, అతని తల్లిదండ్రులు ఊర్లో పరువు పోతుందని భయపడ్డారు.
అయితే కేసు విషయంలో శ్యామలను బెదిరించడానికి ప్రయత్నించారు. కాని శ్యామల ధైర్యంగా తన హక్కు కోసం నిలబడింది. ఇక చేసేది లేక సాగర్ ఊరి పెద్దల సమక్షంలో పిల్లలకు తన ఆస్తిలో కొంత భాగం రాసిచ్చాడు. అలాగే పిల్లల చదువు కోసం ఐదు లక్షలు ఫిక్స్ చేశాడు. తను అనుకున్నది సాధించిన తర్వాత శ్యామల సాగర్ నుండి విడాకులు తీసుకుంది. కుట్టు మిషన్ షాప్ పెట్టుకుని పిల్లల్ని చదువించుకుంటూ సంతోషంగా బతుకుతోంది.
- సలీమ