Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకుర్తి గ్రామంలో విసునూను దొర రామచంద్రారెడ్డి అరాచకాలు సాగిస్తున్న కాలం అది. అలాంటి సమాజంలో పుట్టింది మన ఉద్యమ వేగు చుక్క వీరనారి ఐలమ్మ. తన పోరాట పటిమతతో తనకంటూ ఏమీ పోగేసుకోలేకపోయినా.. పరోక్షంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలుగా పేరు తెచ్చుకుంది. ''ఈ భూమినాది... పండించిన పంటనాది... తీసుకెళ్లడానికి ఆ దొర ఎవడు..? నా ప్రాణం పోయాకే ఈ పంటను, భూమిని మీరు దక్కించుకోగలరు'' అంటూ దొరలను ఎదిరించింది ఐలమ్మ. నేడు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం సముచితం.
1919లో వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలోని క్రిష్టాపురం గ్రామంలో ఐలమ్మ జన్మించింది. ఈమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఈమె వివాహం జరిగింది. వీరికి నలుగురు కొడుకులు, ఒక కుమార్తె.
విసునూరు విలన్ రామచంద్రారెడ్డి: విసునూరు దేశముఖ్ రాపాక వెంకట రామచంద్రారెడ్డి. మామూలుగా ఆయనను విసునూరు రామచంద్రారెడ్డి అని పిలిచేటోళ్లు. జనం మాత్రం విసునూరు దొర అని పిలిచేటోళ్లు. నల్లగొండ జిల్లాలోని జనగామా తాలుకా విసునూరు గ్రామం కూడా విసునూరు రామచంద్రారెడ్డి ఆధీనంలోనే ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆనాడు జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ భర్త నర్సయ్య, ఆమె ఇద్దరు కొడుకులు సోమయ్య, లచ్చయ్య కూడా అందులో సభ్యత్వం తీసుకున్నారు. ఐలమ్మకు తూర్పు ఇల్లు పడమటి ఇల్లు అని ఉండేది. ఇంటిలోనే ఒక బాగాన్ని ఆంధ్ర మహా సభ సంఘం కార్యాలయానికి ఇచ్చింది. ఐలమ్మ ఇల్లు కేంద్రంగా పాలకూర్తిలో సంఘం కార్యకలాపాలు చురుగ్గా జరిగేవి.
భర్త మరణం: ఆంధ్ర మహాసభల ముఖ్యనాయకుడైన ఆరుట్ల రామచంద్రారెడ్డి 1945 ఫిబ్రవరి పాలకుర్తి జాతరలో మహా సభ సమావేశం పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను సమీకరించారు. కానీ, సభలు నిర్వహించడం విసునూరు రామచంద్రారెడ్డి భరించలేక పోయాడు. జనంలో చైతన్యం పెరిగితే తన అధికారానికి ముప్పు వస్తుందని ఆరుట్ల రామచంద్రారెడ్డిపై తన మనుషులను పురమాయించాడు. అయితే ఆయన తప్పించుకున్నాడు. దాంతో జాతరలో జరగబోయే మీటింగ్ ఏర్పాట్లు చూస్తున్న ఐలమ్మ భర్తను, కొడుకులను పోలీసులు విపరీతంగా కొట్టారు. ఆ దెబ్బలతో అనారోగ్యం పాలై నర్సయ్య చనిపోయాడు. భర్త మరణం ఆమెలో మరింత కసి పెంచింది. దొరలకు వ్యతిరేకంగా మరింత చురుగ్గా పనిచేయాలని నిర్ణయించుకుంది.
అన్నం పెట్టిన ఐలమ్మ: అనాడు నైజాం సర్కారోళ్ల కండ్లు కప్పి ఆంధ్ర మహాసభ నాయకులు రహస్య మీటింగ్లు పెట్టేవారు. వారు పాలకుర్తి ఏరియాకు వచ్చినప్పుడు ఐలమ్మతో పాటు ఇతర రైతులు కూడా తమ ఇండ్లలో వారికి చోటు ఇచ్చేవారు. ఆ ఇండ్లలో ఉండి కార్యకర్తలు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేవారు. సుమారు 60మంది కార్యకర్తలు ప్రతిరోజు పాలకుర్తిలో కవాతు చేసేవారు. వారికి ఐలమ్మనే అన్నం పెట్టేది.
భూమిపై కుట్రతో: గ్రామంలో చురుగ్గా పనిచేస్తున్న ఐలమ్మ కుటుంబాన్ని ఎలాగైనా లొంగదీసుకోవాలని రామచంద్రారెడ్డి అనుకుంటాడు. కానీ ఇది అతనికి సాధ్యం కాలేదు. అయితే ఇరవై ఏండ్ల కింద మల్లంపల్లి మఖ్తాదారు ఉత్తమరాజు కొండల్రావు తండ్రి నరసింహరావు దగ్గర ఐలమ్మ నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకుంది. దీనిపై కన్నేసిన దొర ఆ భూమిని తనకు రాసివ్వాలని కొండల్రావును ఒత్తిడి చేశాడు. భయపడిన కొండల్ రావు దొరకు ఆ భూమిని అప్పగించాడు. అప్పుడే ఐలమ్మ పొలం కోతకు వచ్చింది. దస్తావేజులు చూపించి కోతకు వచ్చిన పంటను తీసుకుపోవాలని ప్రయత్నించాడు. అప్పటికే దొర పన్నాగాన్ని పసిగట్టిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు పెద్ద్దఎత్తున ఐలమ్మ పొలం దగ్గరికి చేరుకొని దొర పంపిన దుండగులను చెదర గొట్టారు. కార్యకర్తలే పంటను మూటల్లో వేసుకొని ఐలమ్మ ఇంటికి చేర్చారు. తన కుట్ర భగం కావడంతో దొర ఆంధ్రా మహా సభ నాయకులపై దొమ్మీ కేసులు పెట్టి జైలుకు పంపి చిత్రహింసలు పెట్టించాడు. ఐలమ్మ ఇంటిని తగులబెట్టించాడు. ధనాన్ని, ధాన్యాన్ని కూడా ఎత్తుకెళ్లారు. అంతేకాదు.. ఐలమ్మ కూతురైన సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఐలమ్మ కుమారులు పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చేసి.. అదేస్థలంలో మొక్కజొన్న పంటను పండించారు.
అసువులు బాసిన ఐలమ్మ: ఐలమ్మ కుటుంబానికి ఎన్నిరకాలుగా నష్టాలు వాటిల్లినా కూడా వాళ్లు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎర్రజెండాను వీడలేదు. ''ఈ దొరగాడు ఇంతకంటే నన్ను ఏం చేస్తాడు'' అంటూ రోకలిబండ చేతపట్టుకుని గూండాలను తరమికొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిలోని ధాన్యాన్ని కమ్యూనిస్టులు ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు మొత్తం 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ఈ విధంగా దొరలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి.. ధైర్యశాలిగా పేరుగాంచిన ఈమె సెప్టెంబర్ 10, 1985న అనారోగ్యంతో మరణించింది.