Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి వైద్య పట్టా అందుకున్న ఇరవైమూడేండ్ల డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. చదువూ, భరతనాట్యం, యోగా, సేవ, అందాలపోటీలు, ప్రధానమంత్రి పతకం, షూటర్, సింగర్... ఇలా ఎన్నో కళలలో ప్రావీణ్యాన్ని సంపాదించి తనకంటూ సముచిత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంతేనా ఇంకా ఉంది... ఓ వైపు మిస్ దివా పోటీలకు సిద్దమవుతూనే మరోవైపు వైద్య విద్యలో పీజీ, సివిల్స్పై దృష్టిపెట్టారు.
చదువుకుంటున్నప్పుడే ఆమెకు అందాల పోటీల పట్ల ఆసక్తి కలిగింది. అందాల పోటీలలో పాల్గొని విజయాన్ని అందుకుంటే ప్రజలకుసేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావించారు. కేవలం దీనికే పరిమితం కాకుండా స్కూల్లో చదివే సమయంలోనే ఎన్సీసీలో కూడా రాణించారు. ఇంటర్ చదువుతూ ఎన్సీసీలో ఏబీసీ విభాగాలు పూర్తి చేశారు. ఢిల్లీలో శిక్షణ తీసుకుంటూ 13 లక్షల మంది ఎన్సీసీ విద్యార్థుల్లో అనేక స్థాయిల్లో డ్రిల్, కవాతు, గ్రూపు చర్చ, రైఫిల్ షూటింగ్, త్రివిధ దళాల అధికారులతో ఇంటర్వ్యూలు చేశారు.
ఆత్మవిశ్వాసాన్ని నింపాయి
అన్ని విభాగాల్లో పాల్గొని 2010లో ఎన్సీసీలో 'ఆలిండియా బెస్ట్ క్యాండెట్'గా నిలిచింది. దాంతో ప్రధానమంత్రి పతకం లభించింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నా. అలాగే శ్రీలంకలో నిర్వహించిన సార్క్ దేశాల యువ ప్రతినిధుల సదస్సులో మన దేశం నుంచి యూత్ ఆఛీవర్గా వెళ్లారు. రాష్ట్రపతి, రక్షణశాఖ మంత్రి, ఆర్మీ దళాలతో తేనీటి విందు... ఇవన్నీ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.
సేవ చేయొచ్చనే...
చిన్నప్పటి నుంచి అందాలపోటీల పట్ల ఆసక్తి ఉన్న తేజస్వినీ ఈ మధ్య జరిగిన యమహా ఫాసినో మిస్ దివా-2017 ఆడిషన్స్కు వెళ్లారు. అందులో తొలి విడతగా సదరన్ మిస్ దివా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఇప్పుడు మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్నారు. ఆ తరువాత మిస్ యూనివర్స్... అందులో గెలుపొందితే ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుందని ఆమె ఆశపడుతుంది. తన కలసాకారమైనతే అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు, పిల్లలకు సేవ చేసే అవకాశం దొరుకుతుందని తేజస్విని ఆలోచన.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో...
తేజస్విని సొంత ఊరు మహబూబ్నగర్. అయితే పుట్టిపెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. తల్లి అనిత, సాఫ్ట్వేర్ ఉద్యోగి. తండ్రి మదన్ మోహన్ శర్మ, బ్యాంక్ ఉద్యోగి. తను ఇలా ఇన్ని రంగాలలో రాణించడానికి కారణం తల్లిదండ్రుల ప్రోత్సాహం. వారి ప్రోత్సాహంతోనే చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నారు. తెలుగు యూనివర్సిటీలో భరతనాట్యంలో డిప్లొమా కూడా చేశారు. నలుగురికి సేవ చేయాలనే భావాలతో పెరిగారు. ఆ ఉద్దేశంతోనే ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో డాక్టర్గా పని చేస్తున్నారు.
దేశదేశాలకు తిరిగి...
అమ్మ మంచి గాయని కాబట్టి స్వతహాగా పాటలు పాడుతుండటంతో ఆమె వద్దనే సంగీతం నేర్చుకున్నారు. ఇక పాఠశాల స్థాయిలోనే ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. వీటిల్లో ఎక్కువగా సేవా కార్యక్రమాల కోసం చేసినవే. అంటే ఫండ్ రైజింగ్ కోసం. అలా ఇప్పటి వరకు సుమారుగా 2500 ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చారు. ఐ ఫాండేషన్ కోసం అమెరికాలో రెండుసార్లు ప్రదర్శనలు ఇచ్చారు. ఇంకా దుబారు, శ్రీలంక, సింగపూర్, యుఎస్ఏ ఇలా ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి మన దేశ సంస్కృతిని దేశదేశాలకు ప్రచారం చేశారు.
యోగాలోనూ...
పదో తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో యోగాలో డిప్లొమా చేశారు. అక్కడ గురువు జూనియర్స్కు తరగతులను ఆమెతో చెప్పించేవారు. అలాగే ఖాళీ సమయంలో తరగతులు కావాలని అడిగిన వారికీ కూడా శిక్షణ ఇచ్చేవారు. అంతేకాదు కొండాపూర్లోని 8వ పోలీస్ బెటాలియన్, యూసుఫ్గూడలోని మొదటి బెటాలియన్లో శిక్షణ పొందే పోలీసు సిబ్బందికి కూడా ఈ ఏడాది యోగాలో శిక్షణ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి దేశానికి సేవలందించే ఆర్మీ వారికి శిక్షణ ఇవ్వడం తనకు ఎంతో తృప్తినిస్తోందని అంటారు తేజస్విని.
ఇంకా సాధించాలి
ఇటు డాక్టర్గా అటు నృత్యకారిణిగా, యోగా ఇలా ఎన్నో విభిన పనులు చేపడుతున్న తేజస్వినీని తన దిన చర్య గురించి అడిగితే 'ఉదయం యోగా చేసి హాస్పిటల్కు వెళతాను. రెండు గంటల వరకు హాస్పిటల్ పని పూర్తి చేసుకుని, అక్కడి నుంచి క్లాసులకు వెళ్ళిపోతాను. 9 గంటల వరకు బయట పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి పూట చదువుకుంటాను. ఇలా రోజంతా బిజీగా గడుపుతా' అంటున్నారు. ఇంత చిన్న వయసులో ఎన్నో విభిన్న కళల్లో నైపుణ్యం సాధించి, ఎన్నో అవార్డులు అందుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఈమె 'ఇప్పటి వరకు సాధించన వాటితో సంతృప్తి పడదలచుకోలేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా పేరు, ప్రతిష్టల ద్వారా నలుగురికీ సేవలు అందించాలి' అంటున్నారు.