Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల, చిన్నారుల భద్రత ప్రభుత్వ బాధ్యత. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పోలీస్వ్యవస్థ ఈ విషయంలో చాలా కీలకపాత్ర పోషిస్తోంది. షీ-టీమ్స్ ఏర్పాటుచేసి బహిరంగస్థలాలు, విద్యాసంస్థల్లో ఈవ్టీజింగ్ను అరికట్టడంలో విజయవంతమైంది. మరో అడుగు ముందుకు వేసి బాధితులకు అన్ని సేవలు ఒకేచోట లభించేలా భరోసా సెంటర్ ఏర్పాటుచేసింది. ఇక్కడ అడుగుపెట్టిన బాధితులకు ముందుగా మనో ధైర్యం కల్పించి, అవసరమైన వైద్యసేవలందించి, తమ గోడును వినిపించడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అంతేకాదు.. కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా కేసు దర్యాప్తు కూడా ఇక్కడి నుంచే కొనసాగుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితులు తమ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్కు చెప్పుకునే సదుపాయం కల్పించారు. ఇలాంటి సౌకర్యం కల్పించడం దేశంలోనే ఇదే తొలిసారి. ఈ సెంటర్ నిర్వహణ బాధ్యతను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు దారా కవిత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. బాధితులకు న్యాయ సహాయంతో పాటు నిందితుల కు శిక్ష పడేందుకు ప్రణాళికను తయారు చేసి శెభాష్ అనిపించుకుంటున్న ఆమెతో మానవి..
మీ గురించి చెప్పండి..
అమ్మ టీచర్గా పనిచేసేవారు. నా చిన్నతనంలో నాన్న దారా సాంబయ్య ఎక్సైజ్ డిపార్ట్మెంటులో డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు. మేం నలుగురం ఆడపిల్లలమే. నేను రెండో అమ్మాయిని. చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలతో పెంచారు. నాన్నకు ఎక్కువగా బదిలీలు ఉండటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాల్లో నా విద్యాభ్యాసం జరిగింది. వరంగల్లోని ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. అసిస్టెంట్ ఆఫ్ రిజిస్ట్రార్గా కో-ఆపరేటివ్ సొసైటీలో రెండు సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత 2010లో గ్రూప్ 1 సర్వీసెస్లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ మిర్యాలగూడ. 2013లో రాంచంద్రాపురం ఎసీపీగా ఉన్నాను. ఆ తర్వాత ప్రభుత్వం మహిళ భద్రత కోసం ఏర్పాటుచేసిన షీటీమ్స్లో చేరాను.
పోలీస్ జాబ్ ఎంచుకోవడానికి కారణం?
నేను పోలీస్ అవుదామని అనుకోలేదు. సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం. ప్రజల సమస్యలను త్వరితంగా పరిష్కరించే అవకాశం ఐఏఎస్కు ఉంటుందని అనుకునేదాన్ని. సివిల్స్ రాసినప్పటికీ సెలెక్ట్ కాలేదు. ఆ తర్వాత గ్రూప్ 1సర్వీస్లో డిఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరి.. తర్వాత సీనియారిటీ ప్రకారమైన ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవచేయాలని అనుకున్నాను. కానీ, మిర్యాలగూడలో పనిచేస్తున్న సమయంలో ప్రజలు పోలీస్లపై చూపించే గౌరవం, సమాజంలో పోలీస్కు ఉన్న విలువ, బాధ్యత గుర్తించాను. ప్రజలకు సేవచేసే అవకాశం ఇక్కడ కూడా ఎంతో ఉందని గమనించాను. ఆ తర్వాత నా ప్రయత్నం మానుకున్నాను. ఇప్పుడు నా ఉద్యోగాన్ని నేను అమితంగా ఇష్టపడుతున్నాను.
షీటీమ్స్లోకి ఎలా వచ్చారు?
రాంచంద్రాపురం నుంచి సిటీ పోలీస్కీ బదిలీ అయ్యింది. అప్పుడే షీ టీమ్స్ ఏర్పాటు జరుగుతుంది. డిపార్ట్మెంట్లో కొంత మందిని షీటీమ్స్లోకి తీసుకుంటున్నారు. నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కు వచ్చాను. షీటీమ్స్ను మానిటర్ చేయడానికి మహిళా పోలీసాధికారి కావాలని అనుకుంటున్నారు. పోలీస్ కమిషనర్గారు, స్వాతిలక్రా మేడమ్, మరి కొంతమంది ఉన్నతాధికారులు నన్ను షీటీమ్స్ విభాగంలో పని చేయమన్నారు. షీటీమ్స్ అమలు చేయడంలో తీసుకోవల్సిన చర్యలను రూపొందించాం. మహిళలపై దాడులు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించేలా, ఏదైనా సమస్య వస్తే వెంటనే రియాక్ట్ అయ్యే టీమ్ ఉంది అన్న అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యాం. తెలంగాణలో ప్రతి జిల్లాలోనూ షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. జంటనగరాల్లో 160 టీమ్స్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 200టీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయి. అయితే 90శాతం మంది మహిళలు కంప్లెయింట్ ఇవ్వడానికి ఇష్టపడరు. షీ టీమ్తో ఉన్న వీడియో రికార్డు ఎవిడెన్స్తో వారిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. కేవలం ఈవ్ టీజింగ్ అయితే పెట్టి (70సిసిపి, 290 ఐపిసి కింద) కేసులు బుక్ చేస్తాం. ఇతర నేరాలకు అనుగుణంగా కేసులు బుక్ చేసి.. సీరియస్ కేసులు అయితే వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్టు చేసేవాళ్లం.
భరోసా ఏర్పాటు గురించి చెప్పండి..
మహిళలకు భద్రత కల్పించే షీటీమ్స్కు అనుబంధంగా బాధిత మహిళలకు, చిన్నారులకు బాసటగా నిలిచేలా ఒక వ్యవస్థను ఏర్పాటుచేయాలన్న ఆలోచనతో భరోసాను రూపొందించారు. 2016 మే 7న భరోసా సెంటర్ ప్రారంభమైంది. దీనిని ఒక సొసైటీగా రిజిస్ట్రర్ చేసి తరుణి ఎన్జీవో సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇక్కడకు వచ్చిన బాధితులు ఎవరైనా కానీ, పూర్తి న్యాయం జరిగిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్ళేలా అన్ని వసతులు కల్పిస్తున్నాం. బాధితులు పదే పదే పోలీస్ స్టేషన్ చూట్టూ... కోర్టుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా అన్ని సేవలు, వసతులు ఒకే చోట లభించేలా దీనిని రూపొందించారు. ఇలాంటి సెంటర్లు ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. బంగ్లాదేశ్, సింగపూర్లో భరోసా లాంటి వ్యవస్థ ఉంది. నిర్భయ సంఘటన తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 2014లో సఖీ సెంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని కారణాలతో అనుకున్న ఫలితాలు రాలేదు. విదేశాల్లో అమలులో ఉన్న వ్యవస్థను, మన దేశంలో సఖీ సెంటర్ల నిర్వహణను గమనించి.. వాటి కంటే మెరుగైన సేవలందించేలా మన రాష్ట్రంలో భరోసా సెంటర్ను ఏర్పాటుచేయడం జరిగింది. అనేక శాఖలకు సంబంధించిన సేవలన్నీ ఒకే దగ్గర లభించేలా.. గైడ్లైన్స్ తయారుచేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఈ సెంటర్ను రూపొందించాం.
బాధితులకు సత్వర సహాయం అందేలా మీరు తీసుకుంటున్న చర్యలు? ఇప్పటి వరకు నమోదైన కేసులెన్నీ?
ఇప్పటివరకు రెండువేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా గృహహింస, చిన్నారులపై లైంగిక దాడుల కేసులు వస్తున్నాయి. ఈ సెంటర్లో మొత్తం 30మంది పనిచేస్తున్నారు. వారిలో నలుగురు డాక్టర్లు, ఆరుగురు సైకాలజీ కౌన్సిలర్స్, ఇద్దరు న్యాయవాదులు, ఇతర సిబ్బంది ఉన్నారు. భరోసా సెంటర్ ఏర్పాటు చేయగానే పోలీస్ కమిషనర్ గారు 'నగర పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్స్లో నమోదు అయ్యే లైంగిక దాడుల కేసులను భరోసాకు పంపించాలి' అని అన్ని పోలీస్ స్టేషన్స్కు ఉత్తర్వులు పంపించారు. బాధితులకు కావల్సిన మానసిక స్థైర్యం, వైద్య, న్యాయ సహాయం అందిస్తాం. బాధతో ఇక్కడకు వచ్చేవారు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తిరిగి వెళ్ళేలా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. షెల్టర్ హోమ్స్ నిర్వహిస్తున్నాం. కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇప్పించాం. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఎంతో మంది అమ్మాయిలు భరోసాను ఆశ్రయిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలిస్తే చదువు ఆపేయమంటారన్న ఆందోళన ఒకవైపు, ఆగడాలను అరికట్టాలన్న ఆలోచన మరోవైపు వారిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారికి భరోసా భద్రతతో పాటు, గోప్యత పాటిస్తుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతున్నాం.
భరోసాను ఏ విధంగా అప్రోచ్ కావాలి? జిల్లాలో విస్తరించే ఆలోచన ఉందా?
అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు... తమపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా చెప్పడంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. స్వేచ్ఛగా జీవించే వారి హక్కులను కాపాడటం కోసం, గౌరవం, భద్రతతో బతికేలా భరోసా ఇవ్వడం కోసం మేం ఉన్నామని గుర్తిస్తే చాలు. బాధితులను ఆదుకుంటాం..వారికి గౌరవంతో కూడిన జీవితాన్ని కల్పిస్తాం. భరోసాను నాలుగు విధాలుగా అప్రోచ్ అవ్వవచ్చు. 100కు డైల్ చేయడం... సోషల్ మీడియా (వాట్సాప్ 94906 16555, ఫేస్బుక్, ట్విట్టర్...), పోస్ట్లెటర్ , స్వయంగా భరోసా సెంటర్కు రావడం. వీటిలో ఏ విధంగానైనా భరోసా నుంచి సహాయం పొందవచ్చు. భరోసా కేంద్రంలోనే చైల్డ్ హెల్ప్లైన్(1098, 040-23133550) కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ రెండు భరోసా ప్రత్యేక వాహనాలు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. త్వరలోనే భరోసా సెంటర్లు జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటుచేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళల, చిన్నారుల భద్రతే మా లక్ష్యం.
ఇప్పటి వరకు నమోదైన కేసులు 2299
క్లోజ్ చేసినవి 1804
పెండింగ్లో ఉన్నవి 495
గృహహింస కేసులు 2184
చిన్నారులపై లైంగిక దాడులు 253
మహిళల పై లైంగికదాడులు 66
ఇతర కేసులు 408
ఉద్యోగాలు పొందిన వారు 32
ఉపాధి శిక్షణ పూర్తిచేసిన వారు 35
స్కిల్ ట్రైనింగ్ పొందుతున్న వారు 65
వృత్తివిద్యాకోర్సులో ఉన్నవారు 34
అల్కహాలిక్ చికిత్స పొందుతున్నవారు 113
- వి. యశోద