Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏదైనా సాధించాలనే తపన ఉన్న మహిళలకు అవకాశాలు కల్పిస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. దానికి నేనే నిదర్శనం' అంటున్నారు కె.ప్రసన్న. భాషపై ఉన్న మమకారంతో రాజకీయాల్లోకి వచ్చారు. పదిమందికి ఉపయోగపడాలనే తపనతో కార్పొరేటర్గా గెలిచి తన పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ శాఖకు ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ శాఖకు మొదటి మహిళా ఛైర్మన్గా చరిత్ర సృష్టించిన ఆమె గురించి కొన్ని సంగతులు మానవి పాఠకుల కోసం...
మీ చిన్ననాటి సంగతులు ఏమిటీ?
పుట్టి పెరిగింది హైదరాబాద్. రాజ్భవన్ స్కూల్లో చదువుకున్నాను. అమ్మ సత్యవతి, నాన్న ముత్యాలరావు. మేం ఐదుగురం పిల్లలం. మా పెద్దన్నయ్య డాక్టర్. నాన్న తరపు బంధువులు పెద్దగా లేరు. దాంతో మేము ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళతోనే పెరిగాం. అమ్మమ్మ వాళ్ళది మెదక్ జిల్లా. అమ్మమ్మ ఫైర్ స్టేషన్లో జాబ్ చేసేది. తాతయ్య ఉద్యోగం కూడా హైదరాబాద్లోనే. దాంతో వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. అమ్మ మెట్రిక్ చదివింది. నాన్న ఐడీపీఎల్లో ఫైర్మెన్గా చేసేవారు. చిన్న ఉద్యోగమైనా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఏ లోటూ లేకుండా పెంచారు. అమ్మాయి, అబ్బాయి అనే తేడా కూడా చూపించేవారు కాదు. ఇప్పుడు అలాంటి తేడాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనుషుల పట్ల ప్రేమా, ఆప్యాయతలు కరువయ్యాయి. మా చిన్నతనంలో అందరం కలిసి తినేవాళ్ళం. అమ్మ వడ్డిస్తుంటే సరదాగా తింటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇంట్లో ఎవరైనా రావడం ఆలస్యమైతే వాళ్ళకోసం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఎవరి జీవితం వాళ్ళది. ఎప్పుడూ బిజీ బిజీ.
రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
అసలు రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఊహించని పరిణామం. మా ఇంట్లో అందరికీ తెలంగాణ భాష, యాస అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అలాంటి సినిమాలే చూసేవాళ్ళం. కేసీఆర్గారు కొత్తగా పార్టీ ఏర్పాటు చేశారు. మా అన్నయ్య ప్రోత్సాహంతో, భాషపై ఉన్న ప్రేమతో, తెలంగాణ కోసం నేనూ, మా వారు పార్టీలో చేరిపోయాం. అప్పటికి నా పెండ్లి జరిగి పదమూడేండ్లు. మాకు ఇద్దరు బాబులు. అప్పుడే మా డివిజన్కి మహిళా రిజర్వేషన్ రావడంతో 2002లో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను. అప్పటి నుంచి చాలా బిజీగా గడిపాను.
ఇటు ఇల్లూ, అటు రాజకీయాలు ఎలా?
చాలా ఇబ్బంది పడ్డాను. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నన్ను నేనే మర్చిపోయాను. మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళను వదిలిపెట్టి తిరిగేదాన్ని. అయితే పిల్లల్ని మా అక్క చూసుకునేది. అలాగే మా వారు కూడా ఇంటి విషయాల్లో చాలా బాధ్యతగా ఉండేవారు. గెలిచిన తర్వాత డివిజన్ లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. అప్పుడు కూడా బాగా తిరగాల్సి వచ్చేది. ఎంత కష్టమైనా పదిమందికి నా వల్ల మంచి జరుగుతుంది అని తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ముందు నా కష్టాన్ని మర్చిపోయేదాన్ని. వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. పదిమందికోసం పని చేయడం తృప్తిగా అనిపించింది. ఏదో ఒకటి సాధించాలి, పదిమందికి ఉపయోగపడాలి అనే ఆలోచనే ఉండేది. డివిజన్లో మహిళల్ని పోగు చేసి రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఇప్పటికీ అలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను.
మీరు ఇలా రాజకీయాల్లో తిరుగుతుంటే సమస్యలేమీ రాలేదా?
బయట సమస్యలేమీ లేవు. ఒక వేళ వచ్చినా పట్టించకోను. అయితే ఇంట్లో అత్తయ్య మాత్రం 'ఇవన్నీ అవసరమా' అనేవారు. ప్లెక్సీల్లో నా ఫోటోలు చూసి మన కుటుంబాల్లో ఆడవాళ్ళు ఇలా తిరగడం ఇప్పటి వరకు లేదు, ఏంటి ఇదంతా' అనేది. కానీ నేను ఇవేవీ పట్టించుకునేదాన్ని కాదు. నేను చేసే పని మంచిది అయినప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలి. మా వారు మాత్రం బాగా ప్రోత్సహించేవారు. మహిళలు పెండ్లి తర్వాత బయటకు రావాలన్నా, ఏదైనా సాధించాలన్నా ఇంట్లో భర్త సహకారం లేకపోతే మాత్రం కష్టం. అలాగే కుటుంబాన్ని వదిలిపెట్టి మగవాళ్ళు ఎన్ని పనులపై బయట తిరిగినా పట్టించుకోరు. అదే ఓ మహిళ బయటకు వెళితే ఇల్లూ, పిల్లల్ని వదిలి తిరుగుతుంది అంటారు. ఇలాంటి మాటల్లో మార్పు రావాలి.
మొదటి సారి లైబ్రరీ శాఖకు చైర్మన్గా.. ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది. చాలా ఏండ్ల తర్వాత కేసీఆర్ గారు గుర్తుపెట్టుకుని స్వయంగా ఫోన్ చేసి మరీ నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. తెలుగు మహాసభల వల్ల నేను వచ్చిన దగ్గర నుంచి లైబ్రరీలో పండుగ వాతావరణమే ఉంది. ఈ సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. కవిసమ్మేళనాలు, ముగ్గుల పోటీలు, తెలుగు పండితులకు సన్మానాలు, రిటైర్మెంట్ అయినవారికి సన్మానాలు ఇలా రకరకాల కార్యక్రమాలు చేశాం. లైబ్రరీలో చదువుకోడానికి 2000 మందికి పైగా వస్తుంటారు. అయితే సరైన సౌకర్యాలు లేవు. పిల్లలు రకరకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు చదువుకోడానికి ఆహ్లాదమైన వాతావరణం అవసరం. అందుకే నేను వచ్చిన వెంటనే ముందు బిల్డిండ్కి రంగులు వేయించాం. మంచినీరు, మరుగుదొడ్ల సమస్య పరిష్కరించాం. పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏం అవసరమున్నా వెంటనే వచ్చి అడగమని స్వయంగా పిలిచి చెప్పాం. పిల్లల్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ మధ్యనే లైబ్రరీ కోసం ప్రభుత్వం ఐదు కోట్లు బడ్జెట్ కేటాయించింది. దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకోడానికి పిల్లలు మొదట్లో భయపడేవారు. నన్నూ మీ అమ్మనే అనుకోండి అని ధైర్యం చెప్పాను.
లైబ్రరీ అభివృద్ధి కోసం ఇంకా ఏం చేయబోతున్నారు?
డిజిటలైజేషన్ చేయబోతున్నాం. కంప్యూటర్లు ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం పిల్లలు బయట కూర్చోని చదువుకుంటున్నారు. ఎండా, వానకు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఉన్న స్థలంలోనే ప్రత్యేకంగా రెండు, మూడు ఫ్లోర్ ఏర్పాటు చేయబోతున్నాం. మరో ఆరు నెలల్లో ఇవన్నీ ప్రారంభం అవుతాయి. ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే... ఇంట్లో మా పిల్లల్ని ఎలా తీర్చి దిద్దాలనుకుంటున్నానో అలాగే ఇక్కడకి వచ్చే పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఈ బాధ్యతల్లో రెండున్నరేండ్లు ఉంటాను. ఉన్నన్ని రోజులు పిల్లలకు ఉపయోగపడాలి.
మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం పట్ల మీ అభిప్రాయం?
కొన్ని బాధ్యతల్లో మహిళలు ఉంటే న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. నేనే కాదు నాతో చాలా మంది ఈ మాట అన్నారు. అలాగే మహిళలకు రిజర్వేషన్లు చాలా అవసరం. రిజర్వేషన్ల వల్ల నాలాంటి మహిళలు బయటకు రాగలుగుతున్నారు. దానికి నేనే ఓ నిదర్శనం. బయటకు రావాలని, సమాజానికి ఏమైనా చేయాలని, సాధించాలని చాలా మంది అనుకుంటారు. కానీ అవకాశాలు లేక వెనకబడి ఉన్నారు. సామర్థ్యం కలిగిన మహిళలకు అవకాశాలు కల్పిస్తే విజయం వైపు దూసుకుపోతారు.
మీ కుటుంబం గురించి చెప్పండి?
డిగ్రీ పూర్తి చేసిన వెంటనే 19 ఏండ్లకే పెండ్లి జరిగింది. ఆయన పేరు రామ్మూర్తి. మా బస్తీలోనే ఉండేవారు. మా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మా కులాలు వేరు కావడంతో పెండ్లికి ఇంట్లో ఒప్పుకోరేమో అని పారిపోయి పెండ్లి చేసుకున్నాం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు. ప్రస్తుతం మా పిల్లలు ఇంజనీరింగ్ పూర్తిచేశారు. పెద్ద బాబు కౌన్సిలర్గా కూడా చేశారు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. మా చిన్నబాబు జాబ్ చేస్తున్నాడు.
ఆడపిల్లలకు మీరు ఏం చెప్పదలచుకున్నారు?
ధైర్యంగా ఉండాలి. ఏదైనా సాధించగలం అనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే చాలు. ఏమైనా చేయగలం. ముఖ్యంగా పిరిగితనం ఉండకూడదు. మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు ఎవరికీ భయపడకూడదు. ప్రశ్నించాలి.
- సలీమ