Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు ఇంట్లో తయారు చేసిన వాటి కంటే బయట ఫుడ్డునే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చీజుతో నిండిన పిజ్జాలూ, నూనెలో వేయించిన సమోసాలని తినాలని అమితంగా కోరుకుంటారు. పిల్లలు అడిగారు కదా అని చాలామంది తల్లిదండ్రులు వారి కోరిక తీర్చాలని అడిగిన వెంటనే తెచ్చిపెడతారు. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తా...
ఇటీవలే జరిపిన ఓ అధ్యయనం ప్రకారం ఇలాంటి జంక్ఫుడ్స్ తిన్న పిల్లల్లో పెద్దయ్యాకా మానసిక సమస్యలతో పాటు, జ్ఞాన సంబంధమైన స్క్రిజోఫీనియా, అల్జీమర్స్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని నిరూపితమైంది. మన మెదడులో రీలిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది మెదడు నాడీ వ్యవస్థలో ముఖ్య భాగమైన సినాప్సిస్ అనే భాగం చురుకుగా పని చేయడానికి దోహదపడుతుంది.ఈ అధ్యయనం ప్రకారం కొవ్వు శాతం అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కీలక ప్రొటీన్ అయిన రీలిన్ నిల్వలు తగ్గిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.
చిన్న వయసులోనే ఇలాంటి మార్పులకి కారణం కొవ్వు అధికంగా ఉన్న ఆహారం. ఇది వారి మెదళ్ళ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మార్పులు కేవలం ఊబకాయం వల్లే ఉత్పన్నమయ్యేవి కావు అని ఈటీహెచ్ జ్యూరిక్, స్విట్జర్లాండుకి చెందిన ఉర్స్ మేయర్ అభిప్రాయం.
మెదడులోని ఒక భాగమైన ప్రిఫ్రోంటల్ కోర్టెక్స్ మీద అధ్యయనకారులు తమ దృష్టిని కేంద్రీకరించారు. ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, సామాజిక ప్రవర్తన, మనిషి పర్సనాలిటీ తదితర కీలక విషయాలని ప్రభావితం చేస్తుంది.
కౌమారంలో ఉన్నవారు కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాన సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి ఆహారం వల్ల ప్రీఫ్రోంటల్ కోర్టెక్స్ పూర్తిగా వృద్ధి చెందదు.
కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న జంతువుల ప్రిఫ్రోంటల్ కోర్టెక్స్లో వికాసం కుంటుపడిందనీ,రీలిన్ ప్రొటీన్ నిల్వలు పెంచడం ద్వారా వాటిలో వికాసం, కాగ్నిటివ్ ఫంకషన్స్ యధా స్థితికి వచ్చాయనీ ఫ్రాన్స్లోని ఇన్మెడ్ ఇన్స్టిట్యూట్కి చెందిన పాస్కల్ చావిస్ వివరించారు.
మాలిక్యులర్ సైకియాట్రీ జర్నల్లో ప్రచురించిన ప్రకారం కౌమారంలో ఉన్నప్పుడే సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రీఫ్రొంటల్ ఎదుగుదల పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుందట.