Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఫ్పై ఏండ్ల తనూజ తల్లిని వెంటబెట్టుకొని ఐద్వా లీగల్ సెల్కు వచ్చి 'మేడమ్ నాకు పెండ్లయి మూడు సంవత్సరాలు. మా వారి పేరు అశోక్, ఆయన మా మామయ్య కొడుకే. మా పెండ్లి నాటికి అశోక్కి ఉద్యోగం లేదు. అందుకే మా ఇంట్లో అప్పుడే పెండ్లి వద్దన్నారు. నాకు ఉద్యోగం ఉంది. జీతం పాతిక వేలు. దాంతో మా మామయ్య, అత్తయ్య నాన్న వెంటబడి మరీ పెండ్లి జరిపించారు.
ముఫ్పై ఏండ్ల తనూజ తల్లిని వెంటబెట్టుకొని ఐద్వా లీగల్ సెల్కు వచ్చి 'మేడమ్ నాకు పెండ్లయి మూడు సంవత్సరాలు. మా వారి పేరు అశోక్, ఆయన మా మామయ్య కొడుకే. మా పెండ్లి నాటికి అశోక్కి ఉద్యోగం లేదు. అందుకే మా ఇంట్లో అప్పుడే పెండ్లి వద్దన్నారు. నాకు ఉద్యోగం ఉంది. జీతం పాతిక వేలు. దాంతో మా మామయ్య, అత్తయ్య నాన్న వెంటబడి మరీ పెండ్లి జరిపించారు.
పెండ్లి తర్వాత నా ఏటిఎం అశోక్ దగ్గరే ఉంచుకునేవాడు. ఇంటి ఖర్చులే కాకుండా, అతని జల్సాలకు కూడా నా డబ్బే వాడుకునేవాడు. నాకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేక ఆఫీస్కు సెలవు పెడితే మా అత్త నానా మాటలు అనేది. పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. మావారు నాతో సరిగా మాట్లాడడు. వాళ్ళ అమ్మ ఎంత చెబితే అంత. అటు ఇంటి పనీ, అటు ఆఫీస్ పనితో నేను బాగా అలసిపోయేదాన్ని. పైగా నేను జాబ్ చేసే ఆఫీస్కు, మా ఇల్లు చాలా దూరం ఉండేది. దాంతో జర్నీ చేయడం చాలా కష్టంగా ఉండేది. మరోవైపు మా అత్త సూటిపోటి మాటలు. ఇక ఆ ఇంట్లో ఉండలేక నా ఆఫీస్కు దగ్గర్లో ఇల్లు తీసుకుందామని అడిగితే ముందు ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి ఉద్యోగం మానేస్తా అనేసరికి ఒప్పుకున్నారు.
కాని మా అత్త అశోక్కి ఫోన్ చేసి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉండేది. ఆయన ఇంట్లో నన్ను ఒక్కదాన్నే వదిలిపెట్టి చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి పోయేవాడు. ఎంత రాత్రైనా ఇంటికి వచ్చేవాడు కాదు. నేను ఫోన్ చేస్తే మా అత్త మాట్లాడేది. మా ఇంట్లో చెబితే సర్దుకుపొమ్మని చెప్పేవారు. ఒంటరితనాన్ని భరించలేక చచ్చిపోదామని ఒకసారి నిద్రమాత్రలు మింగాను. ఆరోజు రాత్రి ఆలస్యంగా వచ్చిన అశోక్ నన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళాడు.
ఆస్పత్రిలో నా ట్రీట్మెంట్కు అయిన ఖర్చులు మొత్తం నా అకౌంట్లోనివే. మా అమ్మ నాన్నలు చూడడానికి వస్తే వాళ్ళను రానివ్వ లేదు. కాస్త కోలుకున్నాకా మా అమ్మవాళ్ళు నన్ను తీసుకెళ్ళారు. తర్వాత నేను ఎన్ని సార్లు ఫోన్ చేసినా తియ్యలేదు. విషయం తెలుసుకుంటే అశోక్కు ఉద్యోగం దొరికింది. ఇక నాతో పనిలేదు. అందుకే నాతో మాట్లాడడం మానేశాడు. దాంతో నేను పోలీస్ స్టేషన్లో కేసుపెట్టా. కేసు కోర్టు వరకు వెళ్ళింది. ఆ కేసు నడిచినన్ని రోజులు అశోక్ నా చుట్టూ తిరిగేవాడు. కేసు విత్డ్రా చేసుకోకపోతే చచ్చిపోతానంటు మెసేజ్లు పంపేవాడు. నా దగ్గరకు వచ్చి బ్లేడుతో చేతులు కోసుకునే వాడు. నన్ను ప్రేమగా చూసుకుంటానని ఒట్లు వేశాడు. దాంతో నా మనసు మార్చుకొని జడ్జి దగ్గర నా భర్తతో వెళ్ళి పోతానని చెప్పి కేసు విత్డ్రా చేసుకుని అశోక్తో వెళ్ళిపోయాను. ఇక అప్పటి నుంచి నా జీతం డబ్బులు వాళ్ళకు ఇవ్వకుండ మానేశాను. రెండు నెలలు అక్కడ బాగానే ఉంది.
మళ్ళీ జీతం డబ్బులు మొత్తం తనకే ఇవ్వమని గొడవ పెట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదు వేరే అమ్మాయితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడేవాడు. ఈ విషయంలో మా ఇద్దరికి గొడవ జరిగింది. తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారు. దాంతో గొడవ పెద్దదై కొట్టుకునే వరకు వచ్చింది. ఆ కొట్లాటలో మా అత్తకు చిన్న దెబ్బతగిలింది. దాంతో వాళ్ళు పోలీస్ స్టేసన్కు వెళ్ళి మా వాళ్ళపై కేసుపెట్టారు.అప్పటి నుండి నేను మా పుట్టింట్లోనే ఉంటున్నా. ఇప్పుడు ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. నేను వెళ్ళిన రెండో రోజే నా అకౌంట్లో ఉన్న పది లక్షలు తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇప్పుడు అశోక్కి బ్యాంక్లో మంచి ఉద్యోగం వచ్చింది. దాంతో నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఉట్టి డబ్బు మనుషులు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు న్యాయం చేయండి' అంటూ తన మాటలు ముగించింది.
తనూజ చెప్పింది విన్న బాధ్యులు వచ్చే వారం అశోక్ను, అతని తల్లినీ రమ్మని లెటర్ పంపారు. కాని రెండు వారాల వరకు వారు రాలేదు. ఫోన్ చేస్తే అశోక్ సిటీలో లేడని, జాబ్ ట్రైనింగ్ కోసం బాంబేలో ఉన్నాడని చెప్పాడు. దాంతో అశోక్ తల్లిని, తండ్రిని రమ్మని బాధ్యులు చెప్పారు. తర్వాతి వారం అశోక్ తల్లి, అతని బంధువును తీసుకొని లీగల్సెల్కు వచ్చింది.
ఆమె మాట్లాడుతూ 'మా కోడలు మేం చెప్పిన మాట వినదు. అసలు మేం వద్దంటే బలవంతంగా పెండ్లి చేశారు. పెండ్లయిన నాటి నుండి ఎప్పుడూ వేరు కాపురం గురించే ఆలోచించేది. మా వాడికి వేరు వెళ్ళడం ఇష్టం లేకపోయినా నేనే నచ్చజెప్పి వేరు కాపురం పెట్టించా. ఇలా ఆ పిల్ల ఏం అడిగితే అదే చేసేవాళ్ళం. అయినా ఓసారి నిద్రమాత్రలు మింగింది. రెండు లక్షలు ఖర్చుపెట్టి బతికించుకున్నాం. తనూజ పుట్టింటి వాళ్ళ వల్లే ఈ సమస్యలు' అని చెప్పుకొచ్చింది.
ఆమె చెప్పింది విన్న బాధ్యులు బయట కూర్చున్న తనూజకు వాళ్ళ అత్త చెప్పింది మొత్తం చెప్పారు. అయితే ఆమె తనూజ ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. బాధ్యులు ఆశోక్ తల్లితో 'చూడండి, మీరు పెద్దవాళ్ళు. ఒక కుటుంబాన్ని నడిపించిన వారు. కాని మీరు కోడలంటే కేవలం డబ్బు సంపాదించే యంత్రంగా చూస్తే ఎలా. పైగా ఆమె గురించి ఇప్పటి వరకు అన్నీ అబద్దాలే చెప్పారు. మీరు ఇలా చేయడం వల్ల వారి సంసారం నాశనమై పోతుంది. చిన్న వాళ్ళు పొరపాటు చేస్తే సర్థి చెప్పాల్సిన వారు, మీరే ఇలా చేస్తే ఎలా' అని ఆమెకు నచ్చజెప్పారు.
కాని ఆమె మాత్రం 'మావాడి ఇష్టం. మీరు వాడితోనే మాట్లాడుకోండి, వాడు రెండు నెలల తర్వాత వస్తాడు' అని చెప్పి వెళ్ళి పోయింది. బాధ్యులు వెంటనే అశోక్కు ఫోన్ చేస్తే 'తనూజతో కలిసి ఉండాలని ఇప్పటి వరకు చాలా ప్రయత్నించా. ఇక ఆమె మారదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది. తనతో కలిసి ఉండాలనే ఆలోచనే నాకు లేదు' అని తేల్చి చెప్పాడు.
కానీ బాధ్యులు అతనితో 'నువ్వు ఆఫీస్ పని ముగించుకుని వచ్చిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు' అని చెప్పారు. తర్వాతి వారం అశోక్ లీగల్సెల్కు వచ్చాడు. అప్పుడు కూడా తనూజతో విడాకులు తీసుకుంటానని చెప్పాడు. దాంతో బాధ్యులు అతనితో... 'చూడు అశోక్, నీకు ఉద్యోగం లేనపుడు ఆమె డబ్బుతోనే నీ అవసరాలు తీర్చుకున్నావు. తన డబ్బులన్నీ నువ్వే వాడుకున్నావు. నీకు ఉద్యోగం వచ్చిన వెంటనే ఆమెను దూరం పెడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. కుటుంబ విలువలు నీకూ, మీ అమ్మకు అర్థం కావడం లేదు. నువ్వు విడాకులు కావాలంటే ఊరికే రావు. ఒకసారి తనూజ కోర్టు వరకు వెళితే నువ్వే బతిమలాడి, మాయమాటలు చెప్పి కేసు విత్డ్రా చేయించుకున్నావు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. గతంలో నీపై ఓసారి కేసు ఉంది కాబట్టి, ఈ సారి ఆమె మళ్ళీ కేసు పెడితే నీకు కచ్చితంగా శిక్ష పడుతుంది. ఓ సారి ఆలోచించి నిర్ణయం తీసుకో' అన్నారు. కాని అతను ఏమాత్రం వినే పరిస్థితుల్లో లేడు.
దాంతో తనూజ 'ఎంత చెప్పిన అర్థం చేసుకోని వ్యక్తితో ఇక తను కూడా బతకలేను. అతనిపై మళ్ళీ కేసుపెడతాను. వాళ్ళను కోర్టు చుట్టూ తిప్పుతాను. నాకు రావాల్సిన డబ్బు మొత్తం వచ్చేలా పోరాటం చేస్తాను' అని చెప్పి వెళ్ళిపోయింది.
- సలీమ