Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతకుమారి(17మే, 1920 - 17 జనవరి, 2006)
తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా 'అమ్మ' అని పిలుచుకునే నటి శాంతకుమారి. 'శశిరేఖా పరిణయం' సినిమాతో నట జీవితం ప్రారంభించారు. ప్రముఖ సినీ దర్శకుడు సి.పుల్లయ్యతో పెండ్లి తర్వాత ఆమె నటనను కొనసాగించి దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి 1999లో 'రఘుపతి వెంకయ్య అవార్డు'ను అందుకున్నారు.
శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి వెల్లాల శ్రీనివాసరావుకు కళలు అంటే ఎంతో ఇష్టం. మద్రాసులో ప్రొఫెసర్ పి. సాంబమూర్తి వద్ద కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్పించారు. ప్రముఖ సంగీత కళాకారిణి డి.కె.పట్టమ్మాళ్తో కలిసి సుబ్బమ్మ సంగీత సాధన చేశారు. 13ఏండ్ల వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతం, 15ఏండ్ల వయసులో వయొలిన్లో పట్టా అందుకున్నారు.ఆ తర్వాత గురువుతో కలసి దక్షిణ భారత్లో ఎన్నో కచేరీలు చేశారు.
సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు శశిరేఖ పరిణయం సినిమాలోఅవకాశం ఇచ్చి... ఆమె పేరును శాంతకుమారిగా మార్చారు. నటనతో పాటు గాయనిగా కూడా ఆమె సంచలనం సృష్టించిన సినిమా సారంగధర (1937). ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్యతో పెండ్లి తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. వారికి రాధ, పద్మ ఇద్దరు అమ్మాయిలు.
పౌరాణిక పాత్రల్లోనే కాదు సాంఘిక పాత్రల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. పెరిగే వయసుతో పాటు పాత్ల్రోనూ మార్పును ఆహ్వానిస్తూ.. నాలుగు దశాబ్దాల పాటు ఆమె వెండితెరపై హీరోయిన్గా, వదినగా, తల్లిగా, బామ్మగా ఆమె నటించారు. శాంతకుమారి మొదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అక్కినేని నాగేశ్వరరావుతో మాయలోకం సినిమాలో కథానాయికగా నటించిన శాంతకుమారి, జయభేరి సినిమాలో ఆయనకు వదినగా, అర్థాంగి సినిమాలో సవతి తల్లిగా నటించారు. అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా నటించిన 'తల్లా పెళ్ళామా' సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.
పద్మశ్రీ పిక్చర్స్, రాగిణి పిక్చర్స్ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను రాసి, స్వరపరిచే తనలోని సంగీతాభిలాషను చాటుకునేవారు.