Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాస్తవిక సంఘటనలకు కొంత కల్పన జతచేసి ఆకట్టుకునేలా సంభాషణలను రచించే నేర్పు మణి వడ్లమాని సొంతం. 'జీవితం ప్రవాహం', 'కాశీపట్నం చూడరా బాబు' నవలలో ఆమె ఎంచుకున్న శైలి, శిల్పం పాఠకులను ఆసాంతం అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తాయి. పౌరాణిక పాత్రలను తీసుకుని కొంత ఫిక్షన్ జతచేసి ఆమె రాసిన మొదటి కథ 'కృష్ణం వందే జగద్గురుం' ఆమెలోని రచనాతృష్ణకు, సృజనాత్మక శైలికి నిదర్శనం. శరీరం పెరగడానికి ఆహారం ఎంత అవసరమో.. మనసు ఎదగడానికి పుస్తకపఠనం అంతే అవసరం అని భావించే ఆమె చిన్నతనంలోనే పుస్తక పఠనం ఆరంభించి ఆలస్యంగా రచయితగా మారారు. వైవిధ్యభరితమైన ఇతివృత్తాలతో, ఆకట్టుకునే పదాల అల్లికతో కథలు, నవలలు రాస్తూ పాఠకులను అలరిస్తున్న ఆమె మానవితో పంచుకున్న సాహితీప్రయాణ విశేషాలు..
నేను మద్రాసులో పుట్టాను. అమ్మ ప్రభావతి. నాన్న ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో రాజమండ్రిలో పనిచేసేవారు. డిగ్రీవరకు అక్కడే చదువుకున్నాను. నాన్న సాహిత్య ప్రియులు. పాలగుమ్మి పద్మరాజు గారి శిష్యులు. దేవులపల్లి కృష్ణశాస్త్రి అభిమానులు. బాగా పుస్తకాలు చదివేవారు. అందుకే ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. అన్నం తింటూ కూడా పుస్తకం చదివేదాన్ని. ఇప్పటికీ అంతే ఒకచేతిలో పుస్తకం.. మరో చేతిలో అన్నం పళ్ళెం ఉంటుంది. పుస్తకాలు చదవడమంటే అందరూ పిచ్చి అనుకునేంత ఇష్టం. స్కూలులో చదువుతున్నప్పుడే చిన్నపిల్లల కథలతో పాటు యద్దనపూడి సులోచనరాణి, ద్వివేదుల విశాలక్షి గారి కథలు, రచనలు ఎన్నో చదివాను. దాదాపు స్కూలు లైబ్రరీలో ఉండే జీవిత చరిత్రలన్నీ చదివేశాను. ఆ తర్వాత కాలేజీలో చేరిన తర్వాత కథల స్థానాన్ని నవలలు ఆక్రమించాయి. ప్రముఖ రచయితలందరీ నవలలు, సీరియల్స్ బాగా చదివేదాన్ని. రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్లో పనిచేసే మూర్తితో పెండ్లి నిశ్చయం చేశారు.
పుస్తకాలతో బంధం బలపడింది..
పెండ్లి చూపుల్లోనే ఆయన నన్ను పుస్తకాలు చదువుతారా? అని అడిగాను. నేను చదివిన పుస్తకాల గురించి ఇద్దరం మాట్లాడున్నాం. ఆయన ఎక్కువగా ఇంగ్లీష్ సాహిత్యం చదివేవారు. మా పెండ్లి అయిన తర్వాత మేమిద్దరం ఎన్నో పుస్తకాలపై మాట్లాడు కుంటునే ఉన్నాం. మా అత్తవారింటి సమీపంలోనే శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం ఉండేది. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను, ప్రముఖుల పుస్తకాలు చదివే అవకాశం నాకు ఈ గ్రంథాలం రూపంలో మళ్లీ లభించింది. అంతే కాకుండా మార్కెటులోకి వచ్చిన కొత్త పుస్తకాలను తప్పక కొనేవాళ్లం. ప్రతి సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫెయిర్కు ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం. పుస్తకాలతో మా వివాహబంధం మరింత బలపడింది. ఆయన సహకారంతోనే ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు ఉద్యోగ నిర్వహణలోనూ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు.
చిన్నిచిన్ని కవితలతో..
ఆదిత్య గ్రూప్ సంస్థలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 2010 వరకు ఉద్యోగం చేశాను. మా ఇద్దరు అమ్మాయిల చదువులు పూర్తయిన తర్వాత వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఖాళీ సమయం ఎక్కువగా ఉండటంతో మాకు ఇష్టమైన పుస్తకాలు కొంటూ.. చదువుతూ చదువుతూ ఉండగా చిన్నచిన్న కవితలు రాయడం ప్రారంభించాను. అవి ఫేస్బుక్లో పెట్టడం ఫ్రెండ్స్ బాగున్నాయి అంటూ కామెంట్ చేయడంతో పఠనావ్యాసాంగం నుంచి రచనావ్యాసాంగం వైపు మనసు మళ్లింది. ఆ తర్వాత స్నేహితుల సూచనతో 'జీవితం' బ్లాగ్ ఏర్పాటుచేసి బ్లాగ్ వాల్పై కవితలు, వివిధ అంశాలు రాసేదాన్ని. ఆ తర్వాత ఇతర వెబ్సైట్లకు రాయడం ప్రారంభమైంది. 'శబ్ద కదంబం' వెబ్సైట్లో పాత కథలు చది వేదాన్ని. పాలగుమ్మి, అడవి బాపిరాజు, శరత్చంద్రచటర్జీ కథలు చదివాను. అలా..అలా ప్రముఖుల కథలు మళ్లీ చదువుతున్నప్పుడే ఎన్నో ఆలోచనలు వచ్చేది. చిన్నప్పుడు చదివిన పురాణాలను, గ్రంథాలను మరోసారి మననం చేసుకునేదాన్ని. అప్పుడు 'కృష్ణం వందే జగద్గురం' రాశాను. ఇది నేను రాసిన మొదటికథ. రామాయణ, మహాభారతంలోని పౌరాణిక పాత్రలతో ఫిక్షన్గా సాగే కథ అది. ఆ కథను కిరణ్ప్రభగారికి పంపిస్తే.. 'కౌముది' వెబ్మ్యాగజైన్లో ప్రచురించారు. ఆ కథకు వచ్చిన స్పందన మరిన్ని కథలు రాయడానికి ప్రేరణ అయ్యింది. దాంతో మరింత ఉత్సాహంగా కలం కదిలించాను. ఆ తర్వాత నేను రాసిన మరో రెండు కథలు ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చాయి. 'బాగానే రాస్తున్నాను' అన్న నమ్మకం వచ్చిన తర్వాత కొన్ని కథల పోటీలకు నేను రాసిన కథలను పంపించాను. పోటీల్లోనూ నా కథలకు బహుమతులు వచ్చాయి. అంతేకాదు తెలుగువెలుగు, విపుల, స్వాతి, నవ్య పత్రికల్లోనూ నేను రాసిన కథలు వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 40కథలు ప్రచురితమయ్యాయి. వాటిలో 24కథలతో 'వాత్సల్య గోదావరి' కథాసంపుటి తీసుకువచ్చాం. ఈ ఏడాది హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది. చిన్నతనంలో నాతో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచిన యద్దనపూడి సులోచనరాణి గారికి ఆ పుస్తకం అందించడం నా సాహితీప్రయాణంలో మధురఘట్టంగా భావిస్తాను. నాకు ప్రేరణనిచ్చిన ఎంతో మంది సాహిత్యవేత్తలను ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై కలవడం, వారితో సాహిత్యభాషణం చేయడం నేను మరిచిపోలేని సంఘటనలు.
పట్టు.. విడుపు ఉండాలి..
నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎంతో పట్టుదలగా తాము కోరిన కెరీర్లో కొనసాగుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ నేటి తరం మహిళలకు చాలా అవసరం. ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు ఇంట్లో, ఉద్యోగంలో ఎప్పటికప్పుడు తమను తాము నిరూపించుకోవల్సి వస్తుంది. అయితే కొన్నిసార్లు పట్టుదలకు పోయి జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటారు. కొంత కాలం గడిచిన తర్వాత 'నేను అలా చేసి ఉండాల్సింది కాదు. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని నాకు ఎవరైనా చెబితే బాగుండేది' అన్న ఆత్మవిమర్శ మొదలైతుంది. ముఖ్యంగా వివాహబంధాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందుకే పట్టు.. విడుపు ఇద్దరిలోనూ ఉండాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఒకరి అభిరుచులను మరొకరు అర్థం చేసుకున్నప్పుడే వైవాహికజీవితం ఆనందమయం అవుతుంది.
సాహిత్యాన్ని పరిచయం చేయాలి..
ఇప్పుడు వస్తున్న యువ ఔత్సాహిక రచయితలు ఎన్నో క్లిష్టమైన అంశాలను తీసుకుని సరళమైన శైలిలో రచనలు చేస్తున్నారు. అయితే తెలుగు మీడియంలో చదివే పిల్లల సంఖ్య తగ్గిపోవడంతో మన సాహిత్యంలోని అపురూపమైన గ్రంథాలను, పుస్తకాలను వారు చదవలేకపోతున్నారు. తెలుగు సాహిత్యాన్ని పిల్లలకు పరిచయం చేయాలి. సాహిత్యం చదివితేనే సంస్కారం అలవడుతుంది. అని మనుషున్ని సరైన మార్గంలో పెడుతుంది. అప్పుడే రేపటితరంలోనూ చరిత్రలో గుర్తుండిపోయే తెలుగు సాహిత్యవేత్తలు మన మధ్యన ఉంటారు.
- వి. యశోద